ETV Bharat / international

కిమ్​ రాజ్యంలో ఆకలి చావులు.. పక్క రాష్ట్రం నుంచి ఫుడ్ ఐటమ్స్​​ తెచ్చుకుంటే కాల్పులు!

author img

By

Published : Jun 19, 2023, 7:10 AM IST

Updated : Jun 19, 2023, 8:21 AM IST

North Korea Food Crisis 2023 : మూడు దశాబ్దాల కిందటి నాటి కరవు పరిస్థితుల తర్వాత మళ్లీ ఇప్పుడు.. ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ -19 మహమ్మారి కారణంగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 2020లో సరిహద్దులు మూసివేయడం వల్ల ఆహార సరఫరా నిలిచిపోయి ప్రజలు నానా పాట్ల పడుతున్నారు.

north korea food crisis 2023
north korea food crisis 2023

North Korea Food Crisis 2023 : కొవిడ్‌-19 మహమ్మారి నుంచి యావత్‌ ప్రపంచం బయటపడినా.. ఉత్తర కొరియా మాత్రం ఇంకా ఆంక్షల వలయంలోనే చిక్కుకుపోయింది. ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో కఠిన నిబంధనలు సడలించినా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్​.. మాత్రం సరిహద్దులను ఇంకా తెరవలేదు. దీంతో ఆ దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు సరైన తిండిలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి.

అప్పుడు కొవిడ్​తో.. ఇప్పుడు ఆకలితో..
ప్యాంగ్యాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఆకలిచావుల బారిన పడినట్లు స్థానిక మహిళ ఒకరు వెల్లడించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. మరో గ్రామంలోనూ ఆకలితో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ గృహ నిర్మాణ కార్మికుడు వాపోయాడు. ఒకప్పుడు కొవిడ్‌తో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డామని.. కానీ, ఇప్పుడు ఆకలి చావులకు వణికిపోతున్నామని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

వారిని కాల్చివేయాలని గార్డులకు కూడా ఆదేశాలు!
North Korea Food Shortage : అయితే ఆహార సంక్షోభం నుంచి తప్పించుకునేందుకుగాను కొందరు ప్రజలు.. పొరుగుదేశం నుంచి అక్రమంగా ఆహార పదార్థాలను తరలించేందుకు యత్నించారు. కానీ, ఎవరూ అటువంటి చర్యలకు దిగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. సరిహద్దులు దాటొద్దని పౌరులను హెచ్చరించారు. అటువంటి వారిని కాల్చివేయాలని గార్డులకు కూడా ఆదేశాలిచ్చారట. పేద, మధ్యతరగతి వారే ఎక్కువగా ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారని.. ఇది తీవ్ర ఆందోళనకరమని ఉత్తరకొరియా ఆర్థికవేత్త పీటర్‌ వార్డ్‌ పేర్కొన్నారు. ఆహార సంక్షోభం ఇంకా దిగజారితే.. పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయన్నారు.

ఒంటరితనానికే ప్రాధాన్యత!
North Korea Food Scarcity : 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియా దేశ అవసరాలకు సరిపడా ధాన్యం ఉత్పత్తిలో చాలాకాలంగా వెనుకబడి ఉంది. అణ్వాయుధ కార్యక్రమాల కోసం దేశ ధనాగారం మొత్తం మళ్లిస్తున్న కిమ్‌ ప్రజల ఆకలిచావులపై దృష్టి సారించటం లేదు. "ఉత్తర కొరియా సరిహద్దులు తెరిచి పొరుగు దేశాలతో వాణిజ్యం పునరుద్ధరించాలి. వ్యవసాయం అభివృద్ధికి తగిన సదుపాయాలు కల్పించాలి. కానీ, ఇక్కడి పాలకులు ఒంటరితనం, అణచివేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు" అని మానవహక్కుల సంస్థ సీనియర్‌ పరిశోధకుడు లినా యూన్‌ తెలిపారు.

North Korea Food Crisis 1990 : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో (2020) ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలయ్యింది. ఇదిలా ఉండగా.. 1990వ దశకంలోనూ ఉత్తర కొరియాలో ఆకలి కేకలతో లక్షల మంది చనిపోయారు. ముఖ్యంగా 1994-98 మధ్యకాలంలో దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

Last Updated : Jun 19, 2023, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.