ETV Bharat / international

'టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్​'.. ఊర మాస్ చిట్కాలతో కరోనాపై కిమ్ ఫైట్!

author img

By

Published : May 18, 2022, 4:50 PM IST

North Korea covid cases
ఊర మాస్ చిట్కాలతో కరోనాపై కిమ్ ఫైట్

North Korea covid cases: కొవిడ్​-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉప్పు నీళ్లే ఉత్తమమని దేశ ప్రజలకు సూచించింది ఉత్తర కొరియా. కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో వంటింటి చిట్కాలను పాటిస్తే చాలంటూ కిమ్​ జోంగ్​ ఉన్​ సర్కార్​ సూచించటం గమనార్హం. మరోవైపు.. ఉత్తరకొరియాలో వైరస్​ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

North Korea covid cases: కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల వరకు తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని గొప్పగా చెప్పుకుంది ఉత్తర కొరియా. ఐరాస నేతృత్వంలోని కొవాక్స్​ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశంలో కొవిడ్​ మహమ్మారి పంజా విసురుతోంది. ఈ క్రమంలో.. కొవిడ్​ను అరికట్టేందుకు కిమ్​ జోంగ్​ ఉన్​ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుకిలించటం సహా ఇతర వంటింటి చిట్కాలను పాటించాలని సూచించింది.

North Korea covid cases
వైద్య సిబ్బంది సూచనలు

సంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ మహిళ ఆ దేశ అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్​ తెలిపింది. తన పిల్లలు రోజుకు రెండు సార్లు ఉప్పు నీటిని పుకిలిస్తారని తెలిపినట్లు పేర్కొంది. కరోనా వైరస్​పై పోరాడేందుకు వంటింటి చిట్కాల్లోని ఉప్పు నీళ్లు ఉత్తమమైనవి, వాటినే ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నట్లు న్యూస్​ ఏజెన్సీ తెలిపిందని, దాంతో పాటు విల్లో ఆకుల నీటిని రోజుకు మూడుసార్లు తాగాలని సూచించినట్లు తెలిపింది. ఈ ఆకులను జ్వరం లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. 'కరోనాపై పోరాటంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. కరోనా అనగానే ముందుగా భయపడ్డాను. కానీ, వైద్యుల సలహాలు పాటించాక పెద్ద విషయమేమీ కాదని భావిస్తున్నా.' అని ఆ మహిళ పేర్కొన్నట్లు రాయిటర్స్​ తెలిపింది.

North Korea covid cases
శరీర ఉష్ణోగ్రత చూస్తున్న వైద్య సిబ్బంది

1.7 మిలియన్​ కేసులు: ఆ దేశ అధికారిక మీడియో కేసీఎన్​ఏ ప్రకారం.. దేశంలో 1.7 మిలియన్ల​కు పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్క రోజే 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా.. ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు పెరిగింది. ప్రస్తుతం 6,91,170 మంది క్వారంటైన్​లో ఉన్నారు. అయితే, జ్వరం లక్షణాలను ఇప్పటి వరకు కరోనాగా గుర్తించలేదు కిమ్​ సర్కార్​. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు పలు రెట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

North Korea covid cases
శానిటైజ్​ చేస్తున్న సిబ్బంది

అయితే, ఇప్పటికే 10 లక్షలకుపైగా ప్రజలు అనుమానిత కొవిడ్​ నుంచి కోలుకున్నట్లు బుధవారం వెల్లడించింది ఉత్తర కొరియా. పరీక్షలు చేసేందుకు సరైన వసతులు లేకపోవటం వల్ల చాలా కేసులను కొవిడ్​-19గా గుర్తించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. సరైన ఔషధాలు, వైద్య సామగ్రి, సౌకర్యాలు లేకపోయినప్పటికీ పది లక్షల మంది ప్రజలు ఎలా కోలుకున్నారనేది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. జ్వరం లక్షణాలు కాస్త తగ్గగానే క్వారంటైన్​ నుంచి పంపించేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

North Korea covid cases
ఓ సంస్థలో శానిటైజ్​ చేస్తున్న సిబ్బంది

డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన: కరోనా సమాచారం అందించాలని కోరినప్పటికీ ఉత్తర కొరియా స్పందించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​. 'ఉత్తర కొరియాలో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన చెందుతోంది. ఆ దేశంలోని చాలా మంది ప్రజలు కొవిడ్​ బారిన పడే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు చేయకపోవటం వల్ల జరిగే వ్యాప్తి కొత్త వేరియంట్లు ఉద్భవించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం చీఫ్​ డాక్టర్​ మైకెల్​ ర్యాన్​ పేర్కొన్నారు. ఆయా దేశాలు తమ సాయాన్ని అంగీకరించనంత వరకు కొవిడ్​ కట్టడికి డబ్ల్యూహెచ్​ఓ ఏమీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కొరియాపై కరోనా పంజా.. కిమ్ 'స్పెషల్ ఆపరేషన్'.. వారికి వార్నింగ్!

కరోనా బాధితులను గుర్తిస్తున్న జాగిలాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.