ETV Bharat / international

డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత మృతి- దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాల విధ్వంసం

author img

By PTI

Published : Jan 3, 2024, 6:43 AM IST

Updated : Jan 3, 2024, 6:52 AM IST

israel hamas war
israel hamas war

Israel Hamas War : ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీ చనిపోయాడు. లెబనాన్ రాజధాని బీరుట్​లో ఈ దాడి జరిగింది. మరోవైపు, ఇజ్రాయెల్​పై అంతర్జాతీయ కోర్టులో కేసు వేసింది దక్షిణాఫ్రికా.

Israel Hamas War : లెబనాన్‌ రాజధాని బీరుట్‌ శివారులో మంగళవారం ఇజ్రాయెల్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో హమాస్‌ అగ్రనేత, మిలిటెంట్‌ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకరైన సలేహ్‌ అరౌరీ మృతి చెందాడు. డ్రోన్‌ దాడితో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించినట్లు లెబనాన్‌ అధికారి వెల్లడించారు. మృతుల్లో అరౌరీ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరించింది.

israel-hamas-war
సలేహ్ అరౌరీ

యుద్ధం మరింత తీవ్రం!
హెజ్‌బొల్లాకు గట్టి పట్టున్న ప్రాంతమైన దక్షిణ బీరుట్‌ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసిన లెబనాన్‌ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్‌ మికాతీ ఇజ్రాయెల్‌ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

israel-hamas-war
లెబనాన్​లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి
israel-hamas-war
లెబనాన్​లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి

గాజాపై ఉద్ధృతంగా దాడులు
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై దాడులు ఉద్ధృతం చేసింది ఇజ్రాయెల్. ఉత్తర గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న ఇజ్రాయెల్- దక్షిణాన భీకరంగా విరుచుకుపడుతోంది. వైమానిక, క్షిపణి దాడులతో బలగాలు బెంబేలెత్తించాయి. మధ్య గాజాలోని బురెజ్ శరణార్థి శిబిరం వద్ద భీకరంగా భూతల పోరు జరుగుతోంది. నుసైరత్, బురెజ్ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. జబలియా శరణార్థి శిబిరం చుట్టూ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్​ను పూర్తిగా నిర్మూలించేవరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 100 మందిని విడిపించుకుంటామని తెలిపారు. యుద్ధం మరిన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

israel-hamas-war
ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లు

ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా కేసు
మరోవైపు, ఇజ్రాయెల్​పై ద హేగ్ కేంద్రంగా పని చేసే అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో కేసు వేసింది దక్షిణాఫ్రికా. గాజాలో మానవ హననంతో పాటు తీవ్ర విధ్వంసానికి పాల్పడుతోందని ఇజ్రాయెల్​పై ఆరోపణలు గుప్పించింది. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యను వెంటనే ఆపేలా ఆ దేశానికి మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దక్షిణాఫ్రికా ఆరోపణలను కోర్టులోనే ఎదుర్కొంటామని స్పష్టం చేసింది ఇజ్రాయెల్. హమాస్​కు రాజకీయ, న్యాయపరమైన రక్షణ కవచాన్ని దక్షిణాఫ్రికా అందిస్తోందని ఇజ్రాయెల్ మండిపడింది.

ఇజ్రాయెల్ మారణహోమం- ఒక్క రోజులో 187 మంది మృతి- 'ఇలా అయితే 'గాజా' కనుమరుగే'

ఇజ్రాయెల్​కు షాక్! రాకెట్లతో హమాస్ ఎదురుదాడి- నెతన్యాహు దళాలు వెనక్కి!

Last Updated :Jan 3, 2024, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.