ETV Bharat / international

28వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య.. మరణాన్ని గెలిచిన 10 రోజుల పసికందు

author img

By

Published : Feb 12, 2023, 6:38 AM IST

తుర్కియే, సిరియాల్లో సంభవించిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య 28వేలు దాటిపోయింది. మరోవైపు, తుర్కియేను ఆదుకునేందుకు దశాబ్దాలుగా నెలకొన్న వైరాన్ని ఆర్మేనియా పక్కనబెట్టింది. ఈ క్రమంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆ రెండు దేశాల మధ్య మొదటిసారి సరిహద్దు పాయింట్‌  తెరిచి సహాయ సామగ్రిని పంపించింది.

Turkey and Syria earthquake death toll update
Turkey and Syria earthquake death toll update

కూలిపోయిన ఇంటి శిథిలాల కింద అయిదు రోజులు సజీవంగా ఉన్న ఓ కుటుంబాన్ని తుర్కియేలో సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు తుర్కియే, సిరియాలలో సంభవించిన పెనుభూకంపం మృతుల సంఖ్య 28,000 దాటిపోయింది. తమ దేశంలో భూకంప మృతుల సంఖ్య 24,617కి చేరిందని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ శనివారం ప్రకటించగా, సిరియాలోని ప్రభుత్వ, తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాల్లో మరణించినవారి సంఖ్య 3,575కు చేరింది. తుర్కియేలో 80,104 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు ఎర్డోగాన్‌ తెలిపారు.

.

గాజియాన్‌తెప్‌ ప్రావిన్సులోని నూర్దగీ పట్టణంపై భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఓ ఇంటి శిథిలాల కింద ఉన్న అయిదుగురు కుటుంబసభ్యులనూ ఒకరి తర్వాత ఒకరుగా సహాయక బృందాల సభ్యులు కాపాడారు. ఒకవైపు ఆశలు కొడిగడుతుండగా, మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయినా.. 16 ఏళ్ల వయసున్న యువతిని, 70 ఏళ్ల వృద్ధురాలిని సైతం కాపాడారు. బయటికొచ్చిన తర్వాత.. 'ఈరోజు తేదీ ఏంటి' అని ఆ యువతి అడిగింది. తుర్కియే, కిర్గిజిస్థాన్‌ దేశాలకు చెందిన బృందాలు కలిసి రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి.

.

భారతీయ వైద్యుల సేవలు
భారత సైన్యానికి చెందిన 99 మంది వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన ఆసుపత్రుల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన శిబిరాల్లో బాధితులకు సాంత్వన కలిగిస్తున్నారు. ఆపరేషన్‌ దోస్త్‌లో భాగంగా ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర సహాయ సామగ్రితో ఏడో విమానం శనివారం దిల్లీ నుంచి తుర్కియేకి బయలుదేరి వెళ్లింది.

.

తుర్కియేలో మరణించిన ఉత్తరాఖండ్‌ వాసి
ఉత్తరాఖండ్‌ పౌఢీ జిల్లాకు చెందిన విజయ్‌కుమార్‌ గౌడ్‌ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక విధులపై తుర్కియే వెళ్లిన ఆయన ఈ నెల ఆరో తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో అప్పటి నుంచి ఆయన కుటుంబం ఆందోళన చెందింది. మరోవైపు, విజయ్‌కుమార్‌ తాను బసచేసిన హోటల్‌ శిథిలాల కింద విగతజీవిగా పడిఉండడాన్ని శనివారం సహాయక బృందాలు గుర్తించాయి.

.

* తుర్కియేను ఆదుకునేందుకు దశాబ్దాలుగా నెలకొన్న వైరాన్ని ఆర్మేనియా పక్కనబెట్టింది. ఈ క్రమంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆ రెండు దేశాల మధ్య మొదటిసారి సరిహద్దు పాయింట్‌ తెరిచి సహాయ సామగ్రిని పంపించింది.

90 గంటలు మృత్యువుతో పోరాటం.. గెలిచిన 10 రోజుల పసికందు
శిథిలాల మధ్యలో.. గడ్డకట్టే చలిలో.. ఆహారంలేని పరిస్థితుల్లో ఓ పది రోజుల పసికందు బతికి బయటపడింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. ఈ శిశువును, అతడి తల్లిని సహాయక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన హతాయ్‌ ప్రావిన్సులో చోటుచేసుకుంది. ఆ పది రోజుల బుడతడి పేరు యాగిజ్‌ ఉలాల్‌. తన తల్లితోపాటు శిథిలాల్లో చిక్కుకున్నాడు. సహాయ సిబ్బందికి శిథిలాల మధ్యనుంచి చిన్నశబ్దం వినిపించింది. స్పందించిన సిబ్బంది ఆ బిడ్డను వెలికితీశారు. చిన్నారిని ఒక థర్మల్‌ దుప్పటిలో చుట్టి ఆసుపత్రికి తరలించారు.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.