'BBC డాక్యుమెంటరీ ఓ కుట్ర.. వలసవాద మనస్తత్వంతో వ్యవహరిస్తోంది'

author img

By

Published : Jan 20, 2023, 10:43 AM IST

Updated : Jan 20, 2023, 12:13 PM IST

BBC documentary a propaganda piece colonial mindset indi

మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్​ అల్లర్ల గురించి ప్రస్తావిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దూమారం రేపుతోంది. ఈ ఉదంతంపై భారత్​ తీవ్రంగా స్పందించింది. ఈ డాక్యుమెంటరీతో వలసవాద మనస్తత్వం అర్థమవుతోందని చెప్పింది. పక్షపాత ధోరణి, కుట్రలో భాగంగానే కథనాన్ని ప్రసారం చేశారని మండిపడింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. కుట్రలో భాగంగానే ఈ డాక్యుమెంటరీ రూపొందిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ డాక్యుమెంటరీ మోదీకి అపఖ్యాతి తెచ్చేందుకే బీబీసీ ఈ కథనాన్ని ప్రసారం చేసిందని పేర్కొంది. దీని బట్టి బీబీసీ పక్షపాత వైఖరి, వలసవాద మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం, వెనుక ఉన్న ఎజెండా గురించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాము గౌరవించబోమని చెప్పారు. "ఇండియా: ది మోదీ క్వశ్చన్" అని రెండు పార్ట్​లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించామని పేర్కొంది.

బ్రిటీష్​ మాజీ విదేశీ కార్యదర్శి జాక్​ స్ట్రా అడిగిన ప్రశ్నలకు బాగ్చి స్పందించారు. జాక్​ స్ట్రా చేసిన వ్యాఖ్యలకు బీబీసీ చట్టబద్ధత ఎలా ఇస్తుందని మండిపడ్డారు. "నేను ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్​ అనే పదాలు విన్నాను. మనం వలస వాద మనస్తత్వం అనడానికి ఇది చాలు. ఎందుకంటే.. ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వాళ్లేమైనా దౌత్యవేత్తలా? మన దేశాన్ని ఏమైనా పాలిస్తున్నారా? వాళ్లు అలా చిత్రీకరించడాన్ని నేను అంగీకరించను. అయితే ఆ డాక్యుమెంటరీ భారత్​లో ప్రసారం కాలేదు. కాబట్టి నా సహచర ఉద్యోగులు ద్వారా తెలుసుకున్న విషయాలపై మాత్రమే మాట్లాడతాను." అని ఆయన చెప్పారు.

బ్రిటీష్​ పార్లమెంటులో చర్చ.. మోదీని వెనకేసుకొచ్చిన సునాక్
ఈ డాక్యుమెంటరీ గురించి బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. పాకిస్థాన్‌ సంతతికి చెందిన ఎంపీ ఒకరు ఈ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, దీన్ని యూకే ప్రధాని రిషి సునాక్‌ సున్నితంగా ఖండించారు. వాస్తవానికి, తాము ఎక్కడా హింసను సహించమని.. కానీ ఓ దేశాధినేతను అలా చిత్రీకరించడాన్ని అంగీకరించనని చెప్పారు. దౌత్య సంబంధాల విషయంలో యూకే ప్రభుత్వం స్పష్టంగా ఉందని రిషి సునాక్ అన్నారు. భారత్, యూకే మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ డాక్యుమెంటరీని యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా తీవ్రంగా ఖండించారు. దీనిపై సోషల్​ మీడియా వేదికగా నిరసన తెలిపారు. యాంటీ ఇండియా, యాంటీ హిందూ, పక్షపాత వైఖరితో బీబీసీ చాలా మంది ప్రేక్షకులను కోల్పోయిందని అయినా జవాబుదారీ తనం లేకుడా ద్వేశాన్ని వెళ్లగుక్కుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఇండియా ది మోదీ క్వశ్చన్'​ అనే రెండు పార్ట్​ల డాక్యుమెంటరీలో మంగళవారం మొదటి పార్ట్​ ప్రసారం అయ్యింది. "భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలను పరిశీలించడం, 2002లో వెయ్యి మందికి పైగా మరణించిన అల్లర్లలో ఆయన పాత్ర గురించి దర్యాప్తు చేయడం" అనే అంశంపై దీన్ని రూపొందించినట్టు పేర్కొంది. కాగా, రెండో భాగం జనవరి 24న ప్రసారం కానుంది. దీన్ని "2019లో తిరిగి ఎన్నికైన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, భారత్​లోని ముస్లిం మైనారిటీలకు మధ్య ఉన్న సమస్యాత్మక సంబంధం" అనే అంశంపై ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది.

Last Updated :Jan 20, 2023, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.