ETV Bharat / international

కామన్​వెల్త్​ గేమ్స్​లో శ్రీలంక క్రీడాకారులు మిస్సింగ్!

author img

By

Published : Aug 8, 2022, 3:42 AM IST

శ్రీలంక
శ్రీలంక

కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది శ్రీలంక ఆటగాళ్లు అనుమానాస్పదరీతిలో అదృశ్యమయ్యారు. బ్రిటన్​లో ఉండిపోయేందుకే వారు ఇలా చేసి ఉంటారని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా కూడా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు.

బ్రిటన్‌లో జరుగుతోన్న కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక బృందంలోని 10 మంది సభ్యులు అనుమానాస్పదస్థితిలో అదృశ్యమయ్యారు. బహుశా ఉపాధి కోసం వారు బ్రిటన్‌లోనే ఉండిపోయేందుకు ఈ విధంగా వ్యవహరించి ఉండొచ్చని శ్రీలంక అధికారులు అనుమానిస్తున్నారు. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిది మంది అథ్లెట్లు, ఒక మేనేజర్‌ అదృశ్యమైనట్లు శ్రీలంకకు చెందిన ఓ క్రీడా అధికారి ఆదివారం వెల్లడించారు. వారిలో ముగ్గురు గత వారమే అదృశ్యమయ్యారన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి మరో ఏడుగురు కనిపించకుండా పోయారని తెలిపారు. మొత్తం 160 మంది సభ్యులతో కూడిన శ్రీలంక బృందం బ్రిటన్‌కు వెళ్లింది.

అదృశ్యమైన మొదటి ముగ్గురిని బ్రిటన్‌ పోలీసులు గుర్తించారు. అయితే వారు స్థానిక చట్టాలను ఉల్లంఘించనందున, పైగా ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉన్నందున.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని శ్రీలంక అధికారి తెలిపారు. అయితే, వారి ఆచూకీ మాత్రం వెల్లడించలేదన్నారు. గతంలోనూ ఆయా అంతర్జాతీయ క్రీడాపోటీల నుంచి శ్రీలంక క్రీడాకారులు మాయమైన ఘటనలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబరులో నార్వేలోని ఓస్లోలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ సందర్భంగా శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును వదిలిపెట్టి అదృశ్యమయ్యారు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న నేపథ్యంలో క్రీడాకారుల అదృశ్యం కావడం గమనార్హం.

ఇదీ చూడండి : గాజాపై బాంబుల వర్షం తీవ్రం.. ఇద్దరు పీజేఐ నేతలు హతం.. 28కి చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.