ETV Bharat / international

రష్యా దాడులతో నిర్మానుష్యంగా కీవ్: ఉక్రెయిన్​ ఎంపీ

author img

By

Published : Mar 6, 2022, 3:06 PM IST

Ukraine Russia War: ఉక్రెయిన్​పై గత కొన్ని రోజులుగా రష్యా విరుచుకుపడుతోంది. భీకర దాడులు చేపట్టి అక్కడి వారిని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ ఎంపీ వ్యాడమ్ ఇవ్​చెంకో కీలక విషయాలు వెల్లడించారు. రష్యా దాడులతో కీవ్​ నిర్మానుష్యంగా మారిందన్నారు.

ukrain mp interview
ఉక్రెయిన్ ఎంపీ ఇంటర్వ్యూ

ఉక్రెయిన్​ ఎంపీ వ్యాడమ్​ ఇవ్​చెంకో ఇంటర్వ్యూ

Ukraine Russia War: దేశాన్ని, దేశ స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్య విలువను రక్షించుకునేందుకు ఉక్రెనియన్లు రష్యా దురాక్రమణకు ఎదురొడ్డి పోరాడుతున్నారని.. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు వ్యాడమ్​ ఇవ్​చెంకో తెలిపారు. ఉక్రెయిన్‌ మానవతా సంక్షోభంలో చిక్కుకుందన్న ఆయన.. రష్యా దాడుల్లో చాలా నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దాడుల నుంచి ప్రజల ప్రాణ రక్షణకు... నోఫ్లైజోన్ ఏర్పాటు చేయడం తక్షణ అవసరమని వెల్లడించారు..

ప్రశ్న: ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పరిస్థితి ఎలా ఉంది?

జవాబు: ప్రస్తుతం పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉంది. ఇది మానవతా సంక్షోభం. అనేక మంది ప్రజలు తమ స్వస్థలాలను వదిలిపెట్టాల్సి వస్తోంది. అనేక నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఖార్కివ్‌, మరియుపోల్‌ను ప్రజలు వీడాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతంలో కూడా మానవతా సంక్షోభం ఉంది. అక్కడ ఆహార కొరత ఉంది. బాంబు దాడులు జరుగుతున్నాయి. దాడుల్లో నిషేధిత క్షిపణులను ఉపయోగిస్తున్నారు. పౌరులపై కూడా రష్యా బాంబులు వేస్తోంది.

ప్రశ్న: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరం భవిష్యత్తు ఏమిటి?

జవాబు: కీవ్‌ నగరం మొత్తం ధ్వంసమైంది. చెర్నిగోవ్‌పై కూడా బాంబులు పడ్డాయి. అనేక మంది ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. మా ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని రష్యా సైనికులను ప్రజలు అడుగుతున్నారు. మరియుపోల్‌ను ఆక్రమించుకున్నారు. ఇదీ వాస్తవ పరిస్థితి.

ప్రశ్న: పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా అంటోంది. అసలు నిజం ఏమిటి?

జవాబు: పౌరులపై దాడి చేయడం నిజం. పౌరులు నివసించే ప్రాంతంలో రష్యా సైన్యం అనేక బాంబులు, నిషేధిత క్షిపణులను ఉపయోగిస్తోంది. నా తల్లితండ్రులు, కుటుంబం నివసిస్తున్న నగరంలో ప్రైవేటు కార్ల మీదకు బాంబులను ప్రయోగించారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. తూర్పు ఉక్రెయిన్‌లో పౌరులు నివసించే ప్రాంతాల్లో జరుగుతున్న దాడులకు ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

ప్రశ్న: ఖేర్సన్‌ నగరం కుప్పకూలిందని అక్కడి మేయర్‌ తెలిపారు. మీరు ఎంతకాలం పోరాటం చేస్తారు?

జవాబు: మా ప్రాంతాన్ని మేం రక్షించుకుంటున్నాం. మా స్వాతంత్ర్యాన్ని మేం రక్షించుకుంటున్నాం. ఉక్రెయిన్‌ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారు. ప్రజలు మెషిన్‌గన్‌లను చేతబూనారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తిప్పికొట్టడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది రష్యా తమ సైనికులకు ఏ విధంగా మద్దతు ఇస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. గమనిస్తే రష్యా తమ సైనికులకు ఎలాంటి సాయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ గెలుస్తుంది. రష్యాకు వస్తువుల కొరత ఉంది. ఉక్రెనియన్ల కంటే 3 రెట్లు ఎక్కువ మంది రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు.

ప్రశ్న: ఆహారం, తాగునీరు, విద్యుత్‌, ఇతర సౌకర్యాల పరిస్థితి ఏమిటి? అవి అందుబాటులో ఉన్నాయా?

జవాబు: తూర్పు ఉక్రెయిన్‌లో వీటి లభ్యత కష్టంగా ఉంది. వైద్య సౌకర్యాలు అందడం కూడా కష్టంగా ఉంది. ఎక్కడ ఆశ్రయం పొందాలనే విషయం కూడా కష్టంగానే ఉంది. ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ కోరుతోంది. మాకు మానవతా కారిడార్‌ ఏర్పాటు చేయాలి. రష్యా బాంబు దాడుల వల్ల ప్రజలు ప్రాణాలు వదలకుండా ఉండేందుకు ఇది అవసరం.

ప్రశ్న: ఊహించిన మేరకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్నాయా?

జవాబు: రష్యాపై ఆంక్షలు విధించడం ద్వారా పశ్చిమ దేశాలు మాకు సాయం చేస్తున్నాయి. ట్యాంకు విధ్వంసక ఆయుధాలు వంటివి పంపిస్తే మేం మా దేశాన్ని కాపాడుకుంటున్నాం. ఆ దేశాలు మాకు ఆహారం, మందులు అందిస్తూ వివిధ రూపాల్లో మానవతా సాయం చేస్తున్నాయి. వారు మాకు సైనిక సాయం చేస్తున్నారు. పశ్చిమ దేశాల నుంచి మాకు తగినంత సాయం అందుతోంది. ఉక్రెయిన్‌లో నో ఫ్లై జోన్‌ ఏర్పాటు చేయాలని మాత్రమే... మేం ప్రస్తుతం పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. శుక్రవారం రష్యా సైనికులు అణు కేంద్రంపై దాడి చేయడం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ అణు కేంద్రం చెర్నోబిల్‌ అణుకేంద్రం కంటే నాలుగు రెట్లు పెద్దది. నో ఫ్లైజోన్‌ ఏర్పాటు చేస్తే చాలా మంది పౌరులను కాపాడుకోవచ్చు. విద్యుత్‌ కేంద్రాలను రక్షించుకోవచ్చు. అణు కేంద్రాలను రక్షించవచ్చు. అనేక మౌలిక సదుపాయాలను కూడా రక్షించవచ్చు.

ప్రశ్న: ఉక్రెయిన్ నియోనాజీలకు మద్దతు ఇవ్వడమే అసలు సమస్యని పుతిన్ అంటున్నారు. దీనిని మీరు అంగీకరిస్తారా?

జవాబు: మీకు తెలుసా.. ఖర్కివ్ రష్యా అనుకూల నగరం. మరెందుకు పుతిన్ ఈ నగరాన్ని ధ్వంసం చేశారు? ఖేర్సన్, మరియుపోల్, చెర్నిహివ్‌ రష్యా అనుకూల నగరాలు. రష్యా అనుకూల నగరాలు అని ఎందుకు అంటున్నానంటే.. వీటిలో జరిగిన ఎన్నికల్లో రష్యా అనుకూల పార్టీలు గెలుపొందాయి. స్థానిక ప్రభుత్వాల్లో మెజారిటీ రష్యా అనుకూల వైఖరి ఉన్న పార్టీలవే. రష్యా దూకుడైన దేశమని అందరికీ తెలుసు. రష్యా అనుకూల వైఖరి ఉన్న పార్టీలు, ప్రాంతాలు సైతం ప్రస్తుతం మిగతా భూభాగాలతో కలిసి పోరాడుతున్నాయి. ఉక్రెనియన్లుగా మేము ఐక్యంగా పోరాడతాం. మా ప్రాంత స్వాతంత్ర్యాన్ని కలిసికట్టుగా పోరాడి కాపాడుకుంటాం. అదే పుతిన్‌కు, రష్యాకు పెద్ద సమస్య.

ప్రశ్న: ఇప్పటికీ అనేకమంది భారతీయ విద్యార్థులు, విదేశీయులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి?

జవాబు: ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. అణు విద్యుత్ కేంద్రం ఉక్రెయిన్ నియంత్రణలో ఉంది. చాలావరకు నగరాలు ఉక్రెయిన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల రష్యాతో భీకర పోరు సాగుతోంది. అయినప్పటికీ అవి కూడా స్థానిక ప్రభుత్వాల నియంత్రణలోనే ఉన్నాయి. నేను కీవ్‌లోని వాస్తవ పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు. ఎక్కడా కూడా జనం లేరు. కీవ్‌లో సుమారు 40 లక్షలమంది నివసించేవారు. కానీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. చాలామంది శరణార్థులుగా మారారు. కొంతమంది పశ్చిమ ఉక్రెయిన్ వైపు వెళ్లారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.