కరోనా టీకా(Covid vaccine) బూస్టర్ డోసు పంపిణీ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది బ్రిటన్. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభిస్తామని బుధవారం ఆ దేశ ఆరోగ్య మంత్రి సాజిద్ సావిద్ తెలిపారు. టీకా పంపిణీ, రోగ నిరోధకతపై ఏర్పాటైన ఉమ్మడి కమిటీ(జేసీవీఐ) చేసిన సూచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"సెప్టెంబర్ నుంచి బూస్టర్ డోసు వేయాలని మాకు జేసీవీఐ సూచించింది. వ్యాధి ప్రభావానికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉన్నవారికి తొలుత టీకా అందించాలని తెలిపింది. ఇదే మా ప్రణాళిక. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత్యంత కీలకమైనది. టీకా మొదటి డోసు ఇంకా తీసుకోని బ్రిటన్ పౌరులు ఎవరైతే ఉన్నారో.. వారు ముందుకు వచ్చి టీకా తీసుకోవాలి."
- సాజిద్ జావిద్, బ్రిటన్ ఆరోగ్య మంత్రి
ఇన్ఫ్లూయెంజా సీజన్ను ఎదుర్కోవటంలో భాగంగా.. కొవిడ్ వ్యాక్సిన్తో పాటు ఫ్లూ టీకా పంపిణీ కార్యక్రమం కూడా బ్రిటన్లో కొనసాగతుందని సాజిద్ సావిద్ స్పష్టం చేశారు. చాలా దేశాలు కొవిడ్ టీకా బూస్టర్ డోసు పంపిణీ చేయాలని యోచిస్తున్నాయి. అయితే.. ఈ ప్రక్రియను మొదలుపెట్టే విషయంలో బ్రిటన్ అన్నింటికంటే ముందుగా ఉందని తెలుస్తోంది.
బ్రిటన్ ఆరోగ్య మంత్రిగా సాజిద్ జావిద్ శనివారమే బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న మ్యాట్ హాంకాక్.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన కార్యాలయంలోని సహాయకురాలిని ముద్దు పెట్టుకునే ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
భారత్లో నవంబర్ నాటికి..
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడో డోసు వినియోగంపై క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు నవంబర్ నాటికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడో డోసుపై పరీక్షలు నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఏప్రిల్లో అనుమతులు ఇచ్చింది. భారత్లో 12 చోట్ల ఈ బూస్టర్ డోసు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: 'టీకా బూస్టర్ డోస్పై ముమ్మర పరిశోధనలు'
ఇదీ చూడండి: వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమా?