ETV Bharat / international

టీకా పంపిణీకి ప్రపంచ దేశాలు సన్నద్ధం.. కానీ...

author img

By

Published : Dec 3, 2020, 7:15 PM IST

కరోనా టీకాకు అత్యవసర అనుమతులిచ్చి చరిత్ర సృష్టించింది బ్రిటన్​. రానున్న కొన్ని వారాల్లో తమ ప్రజలకు టీకా అందించనుంది. ఇలానే ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా టీకా పంపిణీకి సన్నద్ధమవుతున్నాయి. చైనా వ్యాక్సిన్​ను ఇప్పటికే కొనుగోలు చేసిన టర్కీ.. రానున్న రోజుల్లో అత్యవసర అనుమతులివ్వాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​ నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నట్టు పాకిస్థాన్​ వెల్లడించింది.

World Nations are prepping to supply corona vaccine
టీకా పంపిణీ కోసం ప్రపంచ దేశాలు సన్నద్ధం

ప్రాణాంతక కరోనా​పై ఏమీ తెలియని స్థితి నుంచి.. వైరస్​కు టీకా అభివృద్ధి చేసే స్థాయికి ఎదిగింది ప్రపంచం. కరోనా కేసులు, మరణాలను కట్టడిచేయడం నుంచి ఇప్పుడు తమ దృష్టిని వ్యాక్సిన్​ పంపిణీపై పెడుతున్నాయి. ఇందులో బ్రిటన్​ ముందువరుసలో ఉంది. దాదాపు 95శాతం ప్రభావవంతమైన ఫైజర్​ టీకా పంపిణీకి అత్యవసర అనుమతులిచ్చి... రానున్న వారాల్లో ప్రజలకు అందించనుంది. మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఆ విశేషాలను ఓసారి చూద్దాం..

టర్కీ...

చైనా సంస్థ సినోవాక్​ నుంచి 50 మిలియన్​ డోసుల కరోనావాక్​ టీకాను కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది టర్కీ. తాజాగా ఈ 'ఇనాక్టివ్​ టీకా'ను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు ఆ దేశ ఆరోగ్యమంత్రి ఫహ్రెట్టిన్​ కోకా. ఈ నెల 11న ఈ టీకా దేశానికి చేరుతుందని.. దాని భద్రతపై టర్కీ ల్యాబ్​లు నివేదించిన అనంతరం అత్యవసర అనుమతులు జారీ చేస్తామని వెల్లడించారు.

ల్యాబ్​లో వైరస్​ను అభివృద్ధి చేసి.. ఆ తర్వాత దానిని చంపే ప్రక్రియలో రూపొందించే టీకాను 'ఇనాక్టివ్​ వ్యాక్సిన్'​ అంటారు. ఇది ప్రస్తుతం మూడో దశలో ఉంది.

ఇదీ చూడండి:- ఛలో బ్రిటన్​: 'వ్యాక్సిన్​ టూరిజం'కు క్రేజ్​

పాకిస్థాన్​..

తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్​ను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పాకిస్థాన్​ అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్​ డోసులను కొనుగోలు చేసేందుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వం అనుమతులిచ్చినట్టు వివరించారు. చైనా వ్యాక్సిన్లు ఆశాజనకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఆఫ్రికా..

ఆఫ్రికా ఖండంలోని 60శాతం మంది ప్రజలకు రానున్న రెండు-మూడేళ్లలో టీకా అందించాలని ఆఫ్రికా సీడీసీ(రోగ నివారణ- నియంత్రణ కేంద్రం) డైరెక్టర్​ జాన్​ కెన్​గాసాంగ్​ అభిప్రాయపడ్డారు.

ఖండంలోని అనేక దేశాలు వ్యాక్సిన్​ కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. కానీ 1.3 బిలియన్ ​మంది ప్రజలున్న ఈ ఖండానికి వ్యాక్సిన్​ అందేసరికి చాలా ఆలస్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది రెండో భాగంలోనూ టీకా దక్కుతుందనే నమ్మకం తనకు లేదని జాన్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'ఫిబ్రవరి చివరి నాటికి 10 కోట్ల మందికి టీకా'

ఇంటర్​పోల్​ హెచ్చరికలు...

కరోనా టీకాలకు 'నకిలీ' బెడద తప్పదని ఇంటర్​పోల్​ హెచ్చరించింది. ఈ నకిలీ టీకాలను ప్రచారం చేసి అమ్మేందుకు అనేక క్రిమినల్​ నెట్​వర్క్స్​ రంగంలోకి దిగినట్టు వెల్లడించింది. ఈ మేరకు 194 దేశాలకు ఆరెంజ్​ నోటీసు జారీ చేసింది. వ్యాక్సిన్​లను దొంగిలించేందుకు కూడా వీరు వెనకాడరని స్పష్టం చేసింది.

ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని తేలితేనే ఆరెంజ్​ నోటీసులు జారీ చేస్తుంది ఇంటర్​పోల్​.

సమాచారం కోసం సైబర్​ దాడులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కరోనా టీకా పంపిణీ ప్రణాళికలను దొంగిలించేందుకు ఫిషింగ్​ మెయిల్స్​ ద్వారా దాడులు జరుగుతున్నాయని ఐబీఎం భద్రతా పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇది ఎవరు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించలేకపోయామన్నారు. జర్మనీ, ఇటలీ, దక్షిణకొరియా, తైవాన్​ను వీరు లక్ష్యంగా చేసుకుని సెప్టెంబర్​ను కార్యకలాపాలు సాగిస్తున్నారని వివరించారు. వారి లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదని చెప్పారు.

'ఇంకా ప్రమాదం ఉంది...'

టీకాకు అనుమతించినంత మాత్రాన కరోనాకు స్వస్తి పలికినట్టు కాదని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ హెచ్చరించారు. రానున్నది శీతాకాలమని.. అందువల్ల ప్రజలు మరింత జ్రాగ్రత్తగా ఉండాలని సూచించారు. శీతాకాలం కోసం రూపొందించిన ప్రత్యేక నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:- టీకా సరే.. 'ప్రణాళిక' అమలు అంత సులభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.