ETV Bharat / international

తాలిబన్ల అకృత్యాలు- ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడి..

author img

By

Published : Nov 30, 2021, 10:49 PM IST

AFGHAN TALIBAN
ప్రభుత్వాల హత్య

Taliban killing government officials: అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు.. మాజీ ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక వంద మందికి పైగా పోలీసులు, నిఘా సంస్థల అధికారులు హత్యకు గురికావడమో, అదృశ్యం కావడమో జరిగిందని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.

Taliban Human Rights Watch report: అఫ్గాన్​ను పాలిస్తున్న తాలిబన్లు తమ రాక్షస నైజాన్ని చాటుకుంటున్నారు. వంద మందికి పైగా మాజీ పోలీసులు, నిఘా సంస్థల అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ అధికారులంతా హత్యకు గురికావడమో, అదృశ్యం కావడమో జరిగిందని 'హ్యూమన్ రైట్స్ వాచ్' సంస్థ వెల్లడించింది. అందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. గత ప్రభుత్వం తరఫున పని చేసిన వారిపై ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.

Afghanistan Taliban news: ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి ఉద్యోగుల కోసం తాలిబన్లు వెతుకుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక తెలిపింది. ఎవరినైతే లక్ష్యంగా చేసుకోవాలో వారి వివరాలను స్థానిక తాలిబన్ కమాండర్లు సేకరిస్తున్నారని వెల్లడించింది. ఈ ఉద్యోగులు క్షమించరాని నేరాలు చేశారని తాలిబన్లు ఆరోపిస్తున్నారని పేర్కొంది.

"అఫ్గాన్ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి హత్యలను చూసి మాజీ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు. తూర్పు నంగర్హార్ ప్రావిన్సులోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్​నకు సహకరిస్తున్న వ్యక్తులను సైతం తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. క్షమాభిక్ష ప్రకటించినప్పటికీ.. ఆర్మీ మాజీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోకుండా స్థానిక కమాండర్లను నియంత్రించలేకపోతున్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 మధ్య 47 మంది సాయుధ దళాల మాజీ అధికారులు హత్యకు గురికావడమో, అదృశ్యమవడమో జరిగింది. మరో 53 మంది మాజీ ఉద్యోగులు సైతం మరణించడమో, కనిపించకుండా పోవడమే జరిగినట్లు తాము చేపట్టిన పరిశోధనలో తేలింది."

-హ్యూమన్ రైట్స్ వాచ్

గత శనివారం ఈ వార్తలపై స్పందించిన తాలిబన్ ప్రధానమంత్రి మహమ్మద్ హసన్ అఖుంద్.. ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలు జరిగాయనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని, దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అందరికీ తాము క్షమాభిక్ష ప్రసాదించామని చెప్పారు. అయితే, మాజీ సెక్యూరిటీ అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే.. కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

మరోవైపు, ఐఎస్ మిలిటెంట్లు దాక్కొని ఉన్నారని అనుమానిస్తున్న ఓ శిబిరంపై తాలిబన్లు దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జలాలాబాద్​లో ఇరువర్గాల మధ్య ఎనిమిది గంటల పాటు భీకర పోరు జరిగిందని చెప్పారు. ఓ ఇంట్లో ఉన్న పురుషుడు మరో మహిళ.. వారు ధరించిన సూసైడ్ బాంబులు పేలి మరణించారని వెల్లడించారు. ఎన్​కౌంటర్​లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను తాలిబన్లు అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జైలుపై మిలిటెంట్ల దాడి- 11 మంది మృతి, ఖైదీల పరార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.