ETV Bharat / international

అక్కడ నవ్వులు, ఏడుపులు బంద్​- ఉల్లంఘిస్తే అంతే సంగతులు!

author img

By

Published : Dec 17, 2021, 2:12 PM IST

North Korea Laughing Ban: ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ విచిత్ర ఆంక్షలను అమలు చేసింది ఆ దేశం. 11 రోజుల పాటు నవ్వొద్దు, తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దని ప్రజలను ఆదేశించింది.

korea
నవ్వులు

North Korea Laughing Ban: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంటాయి. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి కావడం వల్ల.. ఆయన సంస్మరణార్థం ఆ దేశంలో 11 రోజులు సంతాప దినాలుగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. ఈ 11 రోజులు వారు నవ్వొద్దు, మద్యం తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దు. ఈ నియమాల గురించి చెప్తూ అక్కడి మీడియాలో ప్రకటన జారీ అయ్యింది.

'ఈ సంతాప దినాల సమయంలో మనం మద్యం సేవించకూడదు. నవ్వకూడదు. వేడుకల్లో పాల్గొనకూడదు' అంటూ రేడియో ఫ్రీ ఆసియా ప్రభుత్వ ఆదేశాలను వెల్లడించింది. డిసెంబర్ 17న ఆ దేశ ప్రజలు ఎవరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లకూడదు. ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే.. మృతుడి కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడవకూడదట. పుట్టిన రోజులు జరుపుకోవడానికి వీలు లేదు. ఇలా పలు ఆంక్షలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సంతాపదినాల సమయంలో ఆదేశాలకు విరుద్ధంగా కొందరు తాగుతూ పట్టుబడ్డారు. వారిని నేరస్థుల్లా పరిగణిస్తూ.. శిక్షలు వేశారు. ఆ తర్వాత వారి జాడ లేకుండా పోయిందని ఆ వర్గాలు వెల్లడించాయి.

కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియాను పాలించారు. తన నియంతృత్వ వైఖరితో ప్రజలకు స్వేచ్ఛను దూరం చేశారు. 2011, డిసెంబర్ 17న గుండెపోటుతో మరణించారు. ఇల్‌ మూడో కుమారుడే కిమ్ జోంగ్‌ ఉన్. కిమ్ జోంగ్ ఇల్ వర్థంతి రోజున ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. ఈసారి 10వ వర్థంతి కావడం వల్ల ఆ సంఖ్యను 11 రోజులకు పెంచారు.

కిమ్ కుటుంబ పాలనలోని ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు. దేశంలో కరవు తాండవిస్తుండటం వల్ల సరిగ్గా తిండితినే పరిస్థితి లేదు. ఆహార కొరత నెలకొనడం వల్ల కొద్ది నెలల క్రితం కిమ్ చేసిన ప్రకటనపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది. కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానులు కారణంగా ఆ దేశంలో ఆహార లభ్యత తగ్గి, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ పిలుపునిచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి : ఆన్​లైన్​లో ఫుడ్​ ఆర్డర్​.. స్పేస్​లో డెలివరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.