సింగపూర్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్లైన్ వేదికగా ఉద్యమం నడుస్తోంది. మానసికంగా దివ్యాంగుడైన వ్యక్తికి ఉరిశిక్ష విధించొద్దంటూ విన్నవిస్తున్నారు మానవ హక్కుల కార్యకర్తలు. 2010లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన మలేసియాకు చెందిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె ధర్మలింగం కోసమే ఇదంతా చేస్తున్నారు.
'దారులు మూసుకుపోయ్..'
అయితే ధర్మలింగం ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని.. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. ఈ మేరకు 'టుడే వార్తాపత్రిక' ఓ కథనాన్ని ప్రచురించింది. నాగేంద్రన్ కుటుంబం మలేసియా నుంచి సింగపూర్కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన హోమంత్రిత్వ శాఖ.. క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ తిరస్కరణకు గురైందని స్పష్టం చేసింది.
మహోద్యమం..
నవంబరు 10న నాగేంద్రన్ను ఉరి తీయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందిన మానవ హక్కుల కార్యకర్తలు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడుతున్న నాగేంద్రన్కు.. క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్కు అభ్యర్థనలు పంపుతున్నారు. అక్టోబర్ 29న ఆన్లైన్ వేదికగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి.. 50వేల సంతకాల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 39,962 సంతకాలను సేకరించారు.
తన ప్రియురాలిని చంపేస్తామని బెదిరించిన కొందరు.. నాగేంద్రన్తో బలవంతంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయించారని.. అందువల్ల దోషికి క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్లో అభ్యర్థిస్తున్నారు.
2009లో సింగపూర్లోకి 42.72 గ్రాముల హెరాయిన్ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్కు 2010లో మరణశిక్ష విధించింది కోర్టు.
తాత్కాలికంగా నిలిపివేత..
మరణశిక్ష ఎదుర్కొంటున్న నాగేంద్రన్ ధర్మలింగానికి కరోనా రూపంలో అదృష్టం కలిసొచ్చింది. నాగేంద్రన్కు కొవిడ్-19 నిర్ధరణ అయినట్లు జైలు అధికారులు తెలపటం వల్ల బుధవారం అమలు చేయాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ చూడండి: భారత సంతతి వ్యక్తిని 'ఉరి' నుంచి కాపాడిన కరోనా!
ఇవీ చదవండి: