ETV Bharat / international

యూకేలో కొత్తగా 10వేల ఒమిక్రాన్ కేసులు​.. నెదర్లాండ్స్​లో లాక్​డౌన్

author img

By

Published : Dec 19, 2021, 9:18 PM IST

Updated : Dec 19, 2021, 10:59 PM IST

Omicron
ఒమిక్రాన్​

Britain Omicron Cases: బ్రిటన్​లో ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభిస్తోంది. శుక్రవారంతో పోల్చితే.. శనివారం మూడు రెట్లు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇరాన్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతివ్వాలంటే ప్రజలు కొవిడ్​-19 వ్యాక్సినేషన్ రిపోర్టు చూపించాలని ఆదేశించింది శ్రీలంక. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. నెదర్లాండ్స్‌ తాజాగా దేశంలో క్రిస్మస్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

Britain Omicron Cases: ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బ్రిటన్​లో శుక్రవారంతో పోల్చితే.. శనివారం మూడు రెట్లు అధికంగా ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 10,059 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్​లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కు చేరింది.

ఇక దేశంలో కొవిడ్​-19తో శనివారం 132 మంది మృతిచెందారు. యూకేలో ఒమిక్రాన్ వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని ఆ దేశ ఆరోగ్య సెక్రటరీ సాజిద్ జావిద్​ తెలిపారు. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామన్నారు.

బ్రిటన్​లో ఒమిక్రాన్​, కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా.. ఈ నెల చివర్లో రెండు వారాల పాటు సడలింపులతో కూడిన లాక్​డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాల్లో వస్తోంది.

బ్రిటన్​పై జర్మనీ ఆంక్షలు..

Germany Omicron Travel Restrictions: ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది జర్మనీ. బ్రిటన్​లో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం కారణంగా.. ఆ దేశం నుంచి వచ్చే ప్రజలకు ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ మేరకు 'వైరస్ వేరియంట్​ ప్రాంతాలు' జాబితాలో బ్రిటన్​ను చేర్చింది జర్మనీ ప్రభుత్వం. ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలి. వ్యాక్సినేషన్ పూర్తయినా ఈ రూల్స్ పాటించాల్సిందే. నూతన నిబంధనలు ఆదివారం రాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది జర్మనీ సర్కార్.

ఇరాన్​లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..

Omicron Cases In Iran: ఇరాన్​లో తొలి ఒమిక్రాన్​ కేసు నమోదైంది. ఈ మేరకు అక్కడి మీడియా పేర్కొంది. ఇరాన్​లో 60 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. 5 కోట్ల మంది రెండు డోసులు తీసుకోగా, దాదాపు 35 లక్షల మందికి బూస్టర్ డోసు సైతం పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే కొవిడ్-19 కారణంగా ఇరాన్​లో 131,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ కారణంగా ఇటీవలి కాలంలో మరణాలు తగ్గినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోసు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.

ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలి..

Israel PM On Omicron: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్.. దేశ ప్రజలకు సూచించారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ప్రారంభమైందని మంత్రులకు తెలిపారు ప్రధాని బెన్నెట్​. ఈ మేరకు ఒమిక్రాన్​ను 'అత్యంత వ్యాప్తిచెందే వేరియంట్​'గా అభివర్ణించారు.

శ్రీలంకలో కొవిడ్​ సర్టిఫికెట్ తప్పనిసరి..

ఒమిక్రాన్​ వ్యాప్తి దృష్ట్యా.. దేశ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది శ్రీలంక ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించాలంటే కొవిడ్​-19 వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాలని ఆదేశించింది. ఈ మేరకు పర్యటక మంత్రి ప్రసన్న రణతుంగ ఆదేశాలు జారీ చేశారు.

నెదర్లాండ్స్‌లో లాక్​డౌన్​..

నెదర్లాండ్స్‌ తాజాగా దేశంలో క్రిస్మస్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జనవరి 14 వరకూ అన్ని సాంస్కృతిక, వినోద కేంద్రాలు, కొన్ని దుకాణాలు మూసి ఉంటాయని ప్రధాని మార్క్‌ రుట్టే వెల్లడించారు. జనవరి 9 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. క్రిస్మస్ రోజు మినహా.. మిగతా రోజుల్లో అతిథుల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. 'ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. నెదర్లాండ్స్ ఆదివారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్తోంది'అని రుట్టే చెప్పారు.

ఇవీ చూడండి:

Uk Lockdown: బ్రిటన్​లో రెండు వారాలపాటు లాక్​డౌన్​?

Covid cases in uk: బ్రిటన్​లో ఆల్​టైం రికార్డుగా కరోనా కేసులు

'89 దేశాల్లో ఒమిక్రాన్.. అలాంటి చర్యలతోనే అడ్డుకట్ట'

Last Updated :Dec 19, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.