ప్రజలంతా కలిసి ఉన్నప్పుడు ఎంతో బలంగా, ఉత్తమంగా ఉంటారని.. కరోనా మహమ్మారిపై పోరు ద్వారా తెలిసొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'గ్లోబల్ సిటిజెన్ లైవ్' సదస్సులో వర్చువల్గా ఆయన పాల్గొన్నారు.
"జీవితకాలంలో ఓ సారి వేధించే మహమ్మారితో రెండేళ్లుగా మనం పోరాడుతున్నాం. ఈ పోరులో మన ఉమ్మడి అనుభవాలు... మనం ఐకమత్యంగా ఉంటే దృఢంగా, ఉత్తమంగా ఉంటామని తెలిసేలా చేశాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
కరోనా విజృంభణ సమయంలో మానవత్వమే అన్నింటి కన్నా ప్రధానమని నిరూపితమైన సత్యాన్ని రాబోయే తరాలు కూడా గుర్తుంచుకుంటాయని మోదీ చెప్పారు. కరోనాను ఓడించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, కొవిడ్ యోధులు తమ వంతుగా చేసిన కృషి.. యావత్ ప్రపంచం చూసిందని పేర్కొన్నారు.
ప్రపంచం ముందు వాతావారణ మార్పులు అనే ముప్పు పొంచి ఉందని మోదీ హెచ్చరించారు. ఈ ముప్పును నివారించడానికి ప్రత్యమ్నాయ మార్గాలను ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ గొప్ప పర్యావరణ వేత్త అని పేర్కొన్నారు. పేదలను ప్రభుత్వాలపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తే.. పేదరికంపై పోరాడలేమని చెప్పారు.