ETV Bharat / international

'చైనాపై దాడికి సిద్ధమైన ట్రంప్​- వణికిపోయిన ఆ అధికారి!'

author img

By

Published : Sep 15, 2021, 10:42 AM IST

Updated : Sep 15, 2021, 11:12 AM IST

trump war on china
ట్రంప్ చైనా దాడి

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. చైనా విషయంలో దూకుడైన నిర్ణయాలు తీసుకుంటారేమోనని ఓ సైనికాధికారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో చైనా సైనికాధికారితో చర్చించి.. యుద్ధం (US China War) రాకుండా చూడాలని కోరారు. ఈ విషయాలు ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా (Donald Trump) ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికారులు వణికిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పదవిలో ఉన్న చివరి రోజుల్లో చైనాపై యుద్ధం (US China War) ప్రకటిస్తారేమోనని ఓ సైనికాధికారి హడలెత్తిపోయారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్​కు చెందిన జర్నలిస్టులు 'పెరిల్' అనే పుస్తకంలో ప్రస్తావించారు.

పాలన చివరి రోజుల్లో ట్రంప్ ఎలాంటి దూకుడైన నిర్ణయాలు తీసుకుంటారోనని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్​కు ఛైర్మన్​గా ఉన్న మార్క్ మిలే (Mark Milley) ఆందోళన వ్యక్తం చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై ముందు జాగ్రత్తగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారి జనరల్ లీ జూవోచెంగ్​తో మార్క్.. రెండు సార్లు మాట్లాడారు. ఇరుదేశాల మధ్య యుద్ధం జరగకుండా చూడాలని కోరారు. అధ్యక్ష ఎన్నికల తేదీకి (US election 2020) మూడు రోజుల ముందు(2020 అక్టోబర్ 30) ఓసారి, క్యాపిటల్ హింసాకాండ (Capitol insurrection) జరిగిన రెండు రోజుల తర్వాత మరోసారి చైనా అధికారితో మాట్లాడారు.

"జనరల్ లీ.. అమెరికా ప్రభుత్వం స్థిరంగానే ఉందని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇక్కడి ప్రభుత్వం వంద శాతం సుస్థిరంగా కొనసాగుతోంది. కానీ, ప్రజాస్వామ్యం కొన్నిసార్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటుంది. మేము మీపై దాడి చేయబోం. ఒకవేళ చేయాల్సి వస్తే.. ముందుగానే మీకు ఫోన్ చేసి చెప్తా. హెచ్చరికలు లేకుండా ఆకస్మిక దాడులు అయితే జరగవు."

-మార్క్ మిలే, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ మానసికంగా కుంగిపోయారని మిలే భావించినట్లు పుస్తకంలో వివరించారు. అణ్వాయుధ దాడికి ఆదేశిస్తారన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్తగా అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 'జనవరి 8న ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతో జరిగిన సంభాషణలో.. అణ్వాయుధ దాడికి ఆదేశాలు ఇవ్వకుండా ట్రంప్​ను అడ్డుకునేలా ఏం చేయగలమనే అంశంపై మిలే చర్చించారు. ఇండో పసిఫిక్ కమాండ్​కు నేతృత్వం వహిస్తున్న అడ్మిరల్​కు ఫోన్ చేసి.. సైనిక కార్యక్రమాలు, విన్యాసాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అణుదాడి చేయాలని ట్రంప్ ఆదేశిస్తే.. తనను సంప్రదించాలని కోరారు' అని పుస్తకంలో పేర్కొన్నారు.

'ఆయనో మూర్ఖుడు'

కాగా, ఈ వార్తలపై స్పందంచిన ట్రంప్.. మార్క్ మిలేను మూర్ఖుడిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు నిజమే అయితే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చైనాపై దాడి చేయాలన్న ప్రతిపాదనను తాను ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.

"ఈ వార్త నిజమే అయితే.. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టాలి. అధ్యక్షుడికి తెలియకుండా చైనా అధికారులతో మాట్లాడారు. దాడి చేస్తే ముందుగానే చెప్తానని హామీ ఇచ్చారు. ఇలా ఎవరూ చేయరాదు! మిలేపై సత్వరమే చర్యలు తీసుకోవాలి."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

మరోవైపు, ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు మండిపడుతున్నారు. మార్క్ మిలేను వెంటనే పదవిలో నుంచి దించేయాలని సెనేటర్ మార్కో రూబియో డిమాండ్ చేశారు. దేశ సర్వసైన్యాధ్యక్షుడిని తక్కువ చేసేలా ఆయన ప్రవర్తించారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ కూర్పు నచ్చకే బరాదర్‌ అజ్ఞాతవాసం!

Last Updated :Sep 15, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.