ETV Bharat / international

'భారత్​-అమెరికా భాగస్వామ్యం మరింత దృఢం'

author img

By

Published : May 29, 2021, 10:07 AM IST

external minister s.jaishankar
విదేశాంగ మంత్రి జైశంకర్​

భారత్​, అమెరికా మధ్య జరిగిన చర్చలతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢంగా మారిందని విదేశాంగ మంత్రి జైశంకర్​ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​తో సమావేశమయ్యారు. కరోనాపై పోరులో భాగంగా భారత్​కు అమెరికా అందించిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు.

అమెరికా, భారత్​ మధ్య జరిగిన చర్చలు.. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం సహా ద్వైపాక్షిక సహకార లక్ష్యాన్ని విస్తృతం చేసేందుకు దోహదపడ్డాయని విదేశాంగ మంత్రి జైశంకర్​ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా.. ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​, రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​తో భేటీ అయ్యారు.

"అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్​తో సమావేశమవ్వడం సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ, ప్రపంచానికి సంబంధించి వివిధ అంశాలపై మేం చర్చలు జరిపాం. ఇండో పసిఫిక్​, క్వాడ్​, అఫ్గానిస్థాన్​, మయన్మార్​, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వంటి అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం."

-జైశంకర్​, విదేశాంగ మంత్రి

భారత్​-అమెరికా టీకా భాగస్వామ్యంపై బ్లింకెన్​తో భేటీలో చర్చించామని జైశంకర్​ తెలిపారు. వ్యాక్సిన్‌ సరఫరా గొలుసుకట్టులో భారత్‌-అమెరికా మధ్య నెలకొన్న సమస్యపై చర్చించామని చెప్పారు. కొన్ని రోజుల్లో దీనిపై ఇరు దేశాల మధ్య స్పష్టమైన నిర్ణయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో భాగంగా.. అమెరికా అందించిన సాయంపై ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

జైశంకర్​ పర్యటన ద్వారా.. అమెరికా, భారత్​ మధ్య సంబంధాల్లోని లోతు కనిపించిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక కార్యదర్శి డీన్​ థాంప్సన్​ పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధాన భాగస్వాములలో ఒకటిగా భారత్​ను అమెరికా పరిగణిస్తున్నట్లు కనిపించిందని చెప్పారు.

ఇదీ చూడండి: వచ్చే ఏడాది అమెరికా బడ్జెట్​ 6 ట్రిలియన్​ డాలర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.