ETV Bharat / international

'ఉక్రెయిన్ ఆక్రమణకు పుతిన్ తుది నిర్ణయం.. దాడి అప్పుడే'

author img

By

Published : Feb 19, 2022, 8:23 AM IST

Russia Ukraine tensions: ఉక్రెయిన్ ఆక్రమణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తుది నిర్ణయం తీసుకున్నారని తాము విశ్వసిస్తున్నట్లు అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తెలిపారు. రాబోయే కొద్దిరోజుల్లో దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. అయితే, రష్యా ఆక్రమణకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

russia ukraine war
russia ukraine war

Russia Ukraine tensions: ఉక్రెయిన్​ను ఆక్రమించుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నారని భావిస్తున్నట్లు అమెరికా అధినేత జో బైడెన్ పేర్కొన్నారు. ఆక్రమణ చర్యల్ని మరింత ముమ్మరం చేశారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్​పైనా దాడి జరిగే అవకాశం ఉందని చెప్పారు.

Biden on Russia Ukraine war

రష్యా ఒకవేళ దాడికి పాల్పడితే అత్యంత తీవ్ర స్థాయిలో ఆర్థిక, దౌత్యపరమైన చర్యలు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. తన కార్యాచరణపై పుతిన్ పునరాలోచించుకోవాలని సూచించారు. ఆక్రమణకు తగిన మూల్యం చెల్లించేలా అమెరికా, ఐరోపా దేశాలు సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పారు.

"పూర్తిస్థాయి ఆక్రమణపై రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గతకొద్దిరోజులుగా అమెరికా నిఘా వర్గాలు భావించాయి. అయితే, ఇప్పుడు ఆ అంచనాలు మారిపోయాయి. పుతిన్ (ఆక్రమణపై) నిర్ణయం తీసుకున్నారని నేను నమ్ముతున్నా. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది జరగొచ్చు. అమెరికా, ఐరోపాలోని మిత్ర పక్షాలు ఇదివరకు ఎన్నడూ లేనంత ఐకమత్యంతో ఉన్నాయి. దాడికి రష్యా తగిన మూల్యం చెల్లించేలా చేస్తాయి."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రష్యా పనిచేస్తుందని అమెరికా ఇప్పటికీ ఆశతోనే ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ దాడి చేస్తే మాత్రం కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దౌత్యపరమైన చర్చలకు తాము సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్స్​లో పాల్గొన్న కమల.. రష్యా దూకుడుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సైబర్ దాడులకు ఏర్పాట్లు..

మరోవైపు, ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా సైబర్ దాడులకు పాల్పడుతోందని శ్వేతసౌధం ఆరోపించింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ, ఆ దేశంలోని పెద్ద బ్యాంకులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్ అధికారులు సత్వరమే స్పందించడం వల్ల ఇటీవల రష్యా చేసిన సైబర్ దాడుల ప్రభావం పరిమితంగానే ఉందని అధికారులు తెలిపారు. అయితే, మరింత భయంకరమైన చొరబాట్ల కోసం రష్యా ఏర్పాట్లు చేసుకుంటోందని ఆరోపించారు.

అది విపత్తే..: ఐరాస

అటు, ఐరాస ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తే సంభవించేది విపత్తేనని హెచ్చరించారు ఐరాస సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​. దౌత్యానికి మించిన ప్రత్యామ్నాయం లేదని సూచించారు.

ఇదీ చదవండి: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై తొలగని యుద్ధమేఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.