లక్షల మంది వలసదారులను అమెరికా పౌరులుగా మార్చే ఇమ్మిగ్రేషన్ బిల్లులపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు అమెరికా చట్టసభ్యులు. డొనాల్డ్ ట్రంప్ వైదొలిగినప్పటికీ.. వలసదారుల సమస్య పరిష్కరించడం బైడెన్ యంత్రాంగానికి కష్టంతో కూడుకున్న విషయమని రిపబ్లికన్, డెమొక్రాటిక్ సెనేటర్లు డిక్ డర్బిన్, లిండ్సే గ్రాహమ్ పేర్కొన్నారు.
మెక్సికో సరిహద్దు వెంబడి దేశానికి వస్తున్న వలసదారుల సంఖ్య పెరగడం, కాంగ్రెస్ ఉభయసభల్లో సరైన మద్దతు లేకపోవడం వంటి విషయాలు.. వలస చట్టాలు ఆమోదం పొందేందుకు అవరోధాలుగా ఉన్నాయని డర్బిన్ తెలిపారు. సరిహద్దు సమస్య కారణంగా వలస విధానంపై అవగాహన కుదరడం చాలా క్లిష్టంగా మారిందని గ్రాహమ్ అన్నారు. దీనిపై రూపొందించే సమగ్ర బిల్లు ఈ ఏడాది ఆమోదం పొందే అవకాశం లేదని చెప్పారు.
ఇటీవలి కాలంలో మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్న చిన్నారులు, కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ట్రంప్ హయాంలో జీరో టాలరెన్స్ పాలసీ పేరిట వలసదారుల పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేసి ఉంచారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మార్చారు. ప్రస్తుతం వలసదారుల పిల్లలను కొన్ని రోజుల పాటు ఒకే చోట ఉంచి.. వారికి శరణార్థులుగా అమెరికాలో ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: కీలక 'వలస' ఉత్తర్వులపై బైడెన్ సంతకం