కరోనా ప్రభావంతో గతేడాది నిరాడంబరంగా జరిగిన నాథన్ 'హాట్డాగ్' తిండిపోటీలు.. అమెరికాలో ఈసారి మళ్లీ అట్టహాసంగా జరిగాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయి కేరింతలు కొడుతుండగా.. పోటీదారులు తిండి తినడం ప్రారంభించారు. ఈ పోటీల్లో జోయి జాస్ చెస్ట్నెట్ తన రికార్డును తానే బద్ధలు గొట్టాడు. 76 హాట్డాగ్స్, రొట్టెలు తినేసి.. 14వ సారి టైటిల్ విజేతగా నిలిచాడు. మహిళా విభాగంలో 30 3/4 హాట్డాగ్స్, రొట్టెలు మింగేసి.. మిచెల్లె లెస్కో తొలిసారి టైటిల్ గెలిచింది.
అమెరికా న్యూయార్క్లోని కోనీ ద్వీపంలోని ఓ బేస్బాల్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. ఇక్కడ కాల్చిన బాణాసంచా వెలుగులు.. చూపరులను ఆకట్టుకున్నాయి. అమెరికాలోని పలు టీవీ ఛానెళ్లు ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
ఏటా జులై 4న
ఈ హాట్డాగ్ తిండి పోటీలు 1972లో ప్రారంభమయ్యాయి. 1916లో ప్రారంభమైన నాథన్ కంపెనీ ఈ పోటీలను అప్పటి నుంచే ప్రోత్సహిస్తోంది. ఏటా జులై 4న ఈ తిండిబోతు పోటీలు జరుగుతాయి. అయితే గతేడాది కరోనా సంక్షోభం కారణంగా.. పెద్దగా ప్రేక్షకులు లేకుండానే ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లోనూ జోయి జాస్ చెస్ట్నెట్ పది నిమిషాల్లో 75 హాట్డాగ్స్, రొట్టెలు తిని టైటిల్ గెలిచాడు. మహిళల విభాగంలో 47 హాట్డాగ్స్, రొట్టెలు తిని.. మికీ సూడో ఏడోసారి విజేతగా నిలిచింది.
ఇదీ చూడండి: అద్దెకు 'బాల్కనీ'- గంటకు రూ.1800!