ETV Bharat / international

సంపన్న దేశాల తోడ్పాటుతోనే అందరికీ టీకా

author img

By

Published : Sep 16, 2021, 6:14 AM IST

ధనిక దేశాలు కరోనా టీకాలను గుత్తకు తీసుకుని పేద దేశాలకు కొరత సృష్టించే ప్రమాదాన్ని నివారించే 'కోవ్యాక్స్‌ కార్యక్రమం' నత్తనడకన కొనసాగుతోంది. దీనితో అనేక పేద దేశాల్లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం మందగించింది. మరోవైపు కొన్ని దేశాల్లో రెండు డోసులు పూర్తయి.. బూస్టర్​డోసు ప్రతిపాదనలూ తెరపైకి వస్తున్నాయి. టీకాల పంపిణీలో ఈ వ్యత్యాసం తగ్గాలంటే ధనిక దేశాలు కలసి రావల్సిందే.

టీకా
టీకా

భారత్‌తో సహా అన్ని జీ20 దేశాల ఆరోగ్య మంత్రులూ ఇటీవల రోమ్‌లో సమావేశమై ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణను అరికట్టడానికి సమన్వయంతో కృషి చేయాలని నిశ్చయించారు. పేద దేశాలకు మరిన్ని కొవిడ్‌ టీకాలతోపాటు ఆర్థిక సహాయమూ అందించాలని తీర్మానించారు. ఆ పని చాలా త్వరగా జరగాలి. జనాభాలో అత్యధికులకు కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమంలో సంపన్న దేశాలు జోరుగా పురోగమిస్తుంటే- కనీసం ఒక్క శాతం జనాభాకైనా టీకాలు వేయలేకపోయిన పేద దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇజ్రాయెల్‌, బ్రిటన్‌, అమెరికా వంటి ధనిక దేశాల్లో 50శాతానికి పైగా జనాభాకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు పడ్డాయి. కానీ, అల్పాదాయ దేశాల జనాభాలో కనీసం ఒక్క డోసైనా పడినవారు 1.9శాతానికి మించరు. అత్యధిక శాతం ప్రజలకు ఇప్పటికే ఒకటి లేదా రెండు డోసులు వేసిన సంపన్న దేశాలు మూడో (బూస్టర్‌) డోసుకు సైతం సిద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్‌ అయితే నాలుగో డోసు గురించి ఆలోచనలు చేస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పు పడుతోంది. పేద దేశాలకు టీకాల సరఫరా పెంచకుండా సంపన్న దేశాలు మూడు, నాలుగు డోసులు వేసుకుంటూ పోవడం ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. కొవిడ్‌ బూస్టర్‌ డోసులపై సెప్టెంబరు నెలాఖరుకు మారటోరియం విధించాలని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్‌ అదనొం కోరారు. అయినా పరిస్థితిలో మార్పు రానందువల్ల ఈ ఏడాది చివరి వరకు బూస్టర్‌ డోసులపై మారటోరియం కొనసాగించాలని ఇటీవల మళ్ళీ పిలుపిచ్చారు. ప్రపంచ జనాభా అంతటికీ టీకాలు వేసినప్పుడే ప్రమాదకర కరోనా వైరస్‌ వేరియంట్లు వ్యాపించకుండా అరికట్టగలుగుతామని ఆయన అంటున్నారు.

సరఫరా పెరగాలి..

కొద్ది ప్రాంతాల్లో మాత్రం విస్తృతంగా టీకాలు వేసి మిగతా అన్ని ప్రాంతాలను నిరక్ష్యం చేస్తే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి, టీకాలు వేసుకున్నవారికీ అనారోగ్యం తెచ్చిపెడతాయి. అత్యధిక జనాభాకు టీకాలు వేసిన సంపన్న దేశాల్లోనూ తాజాగా డెల్టా వేరియంట్‌ విజృంభించడం దీనికి నిదర్శనం. ప్రపంచంలో ఇంతవరకు ఉత్పత్తి అయిన కొవిడ్‌ టీకాల్లో 75శాతం కేవలం పది సంపన్న దేశాలకే దక్కాయి. పేద దేశాలకూ టీకాల సరఫరాను పెంచడం తక్షణ అవసరం. రాజకీయ దృఢసంకల్పం, ఆర్థిక చేయూత ఉంటే టీకాల కొరతను అధిగమించవచ్చు. అంతా అనుకున్నట్లే సజావుగా సాగినా అల్పాదాయ దేశాల్లో అత్యధిక జనాభాకు టీకాలు వేయడం 2023 నాటికి కానీ పూర్తికాదు. ఆలోగా కొవిడ్‌ కేసులు విజృంభించి, మరణాలు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. ఈ ప్రమాదాన్ని నివారించాలన్న ‘కోవ్యాక్స్‌’ లక్ష్యానికి నిధుల కొరత అడ్డువస్తోంది. ధనిక దేశాలు తమ జనాభా కోసం కొవిడ్‌ టీకాలు కొంటూనే, కోవ్యాక్స్‌ కోసం కొన్ని టీకాల కొనుగోలుకు నిధులిస్తామని మొదట్లో హామీ ఇచ్చాయి. ఈ నిధులకు తోడు వితరణ సంస్థలు, వ్యాపార సంస్థల నుంచి, కొన్ని దేశాల నుంచి సేకరించే విరాళాలతో మరిన్ని టీకాలు కొనాలని కోవ్యాక్స్‌ ఆశించింది. ఈ రెండు మార్గాల్లో సేకరించిన నిధులతో టీకా ఉత్పత్తి కంపెనీల నుంచి కోట్లాది డోసులు కొని పేద దేశాలకు అందించవచ్చని భావించింది. కానీ, ధనిక దేశాలు టీకా కంపెనీల ఉత్పత్తిని ముందుగానే బుక్‌ చేసుకోవడంతో పేద ప్రపంచానికి కొరత వచ్చిపడింది. టీకాల ఉత్పత్తి కేంద్రమైన భారతదేశం కోవ్యాక్స్‌కు టీకాలు సరఫరా చేస్తానని మాట ఇచ్చినా- స్వదేశంలో కరోనా కేసులు విజృంభించడంతో హామీ నిలబెట్టుకోలేకపోతోంది. తొలివిడతలో పెద్దయెత్తున టీకాలు అందించినా, ఇప్పుడు దేశంలోని జనాభా అంతటికీ టీకాలు వేసిన తరవాతే మిగతా ప్రపంచానికి సరఫరా చేస్తానంటోంది. దీంతో కోవ్యాక్స్‌కు ఈ ఏడాది జూన్‌ చివరికి 19 కోట్ల డోసుల కొరత ఏర్పడింది. కోవ్యాక్స్‌ లక్ష్యం నెరవేరాలంటే ఇంకా 50 కోట్ల డోసులు కావాలి. వాటి కొనుగోలుకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేయాలి. మరోవైపు కొవిడ్‌ టీకాలకు పెరుగుతున్న గిరాకీకి దీటుగా ఉత్పత్తి మెరుగుపడటం ఆశాజనకమైన అంశం.

కోవ్యాక్స్‌ నత్తనడక..

నిక దేశాలు టీకాలను గుత్తకు తీసుకుని పేద దేశాలకు కొరత సృష్టించే ప్రమాదాన్ని నివారించడానికే కోవ్యాక్స్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, టీకా ఉత్పత్తిదారులు, ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్‌, గావి టీకా ఎలయన్స్‌ తదితర సంస్థలు కలిసి కోవ్యాక్స్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. కొవిడ్‌ టీకాలు కొనుగోలు చేసే స్థోమత లేని 92 అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో కనీసం 20శాతం జనాభాకు టీకాలు అందించాలని కోవ్యాక్స్‌ లక్షిస్తోంది. దీనికోసం వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుల నుంచి టీకాలు కొని పేద దేశాలకు సరఫరా చేయాలని తలపెట్టింది. ఇందుకు ధన, వస్తు రూపేణా సహకరించాల్సిన ప్రధాన దేశాలు తమ బాగు తాము చూసుకోవడంతో కోవ్యాక్స్‌ కుంటువడుతోంది. సెప్టెంబరు ఎనిమిదో తేదీ నాటికి కోవ్యాక్స్‌ కింద 139 దేశాల్లో కేవలం 24 కోట్ల డోసులు పంపిణీ చేయగలిగారు. ఈ లెక్కన 2021 చివరికి 200 కోట్ల డోసులు సరఫరా చేయాలన్న కోవ్యాక్స్‌ లక్ష్యం నెరవేరడం కష్టమే. బహుశా 2021 ముగిసేటప్పటికి 140 కోట్ల డోసులు సరఫరా చేసి, 2022 ప్రథమ త్రైమాసికానికైనా మొత్తం 200 కోట్ల డోసుల లక్ష్యాన్ని పూర్తిచేయాలని కోవ్యాక్స్‌ మల్లగుల్లాలు పడుతోంది.

కారుచీకట్లో కాంతి రేఖ..

ఫార్మా కంపెనీలు నేడు నెలకు సుమారు 150 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు తయారుచేస్తున్నట్లు అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య ప్రకటించింది. ఇంతవరకు సుమారు 750 కోట్ల డోసులు తయారుచేశామని, ఈ ఏడాది చివరకు 1,200 కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకొస్తామని సమాఖ్య అధికారులు వెల్లడించారు. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), బ్రిటన్‌, కెనడాల వద్ద ప్రస్తుతం 50 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయని ఎయిర్‌ ఫినిటీ అనే డేటా సంస్థ వెల్లడించింది. వీటిని ఇప్పటికిప్పుడు పేద దేశాలకు విరాళంగా ఇస్తే, పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఈ ఏడాది చివరికల్లా పది కోట్ల కొవిడ్‌ టీకా డోసులను పేద దేశాలకు అందించదలచినట్లు రోమ్‌లో ఇటీవలి జీ20 సమావేశంలో జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్‌ స్పాన్‌ ప్రకటించారు. ఇంతవరకు జర్మనీలో వేసిన టీకాలు కూడా పది కోట్లే. ఈ సంవత్సరాంతానికి ప్రపంచంలో 40శాతం జనాభాకు కొవిడ్‌ టీకాలు వేయాలనే లక్ష్యాన్ని అందుకోవడానికి తమ విరాళం తోడ్పడుతుందని స్పాన్‌ తెలిపారు. అల్పాదాయ దేశాలకు మొత్తం 20కోట్ల డోసులను విరాళంగా అందిస్తామని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) తాజాగా ప్రకటించింది. ఇతర ధనిక దేశాలూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని కోవ్యాక్స్‌కు పూర్తి అండదండలు ఇవ్వాలి.

- ఆర్య

ఇవ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.