ETV Bharat / international

చైనాకు షాక్​: భారత్​కు అమెరికా పూర్తి మద్దతు

author img

By

Published : May 21, 2020, 10:38 AM IST

Updated : May 21, 2020, 11:11 AM IST

భారత్​- చైనా సరిహద్దు వివాదంలో అగ్రరాజ్యం అమెరికా ఇండియాకు మద్దతుగా నిలిచింది. లద్ధాఖ్​లోని గాల్వన్​ లోయ ప్రాంతంలో చైనా తన సైనిక బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా చర్యలు రెచ్చగొట్టేలా, శాంతిని భంగపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

China continues with its 'provocative and disturbing behaviour': Wells
చైనా చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయ్: అమెరికా

లద్ధాఖ్​లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా తన సైనిక బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్​కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యం... చైనా చేపడుతున్న చర్యలు శాంతిని భంగపరిచే విధంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

భారతదేశానికి చెందిన లద్ధాఖ్​లోని గాల్వన్​ లోయ, పాంగాంగ్​ త్సో సరస్సు వద్ద... చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. సరస్సులో అదనపు పడవలను తెస్తుంది. ఈ ప్రాంతంలో భారత్ అక్రమ సైనిక నిర్మాణాలు చేపడుతోందని చైనా ఆరోపిస్తోంది.

మే 5న ఇరుదేశాల సైనికులు తూర్పు లద్ధాఖ్​లో ఘర్షణపడ్డారు. నాలుగు రోజుల తర్వాత ఉత్తర సిక్కింలోని నకులా పాస్​ వద్ద ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనల తరువాత చైనా దూకుడు పెంచింది. డెమ్​చోక్​, దౌలత్ ​బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ తన సైనిక బలగాలను గణనీయంగా పెంచింది. దీటుగా స్పందించిన భారత్​ కూడా ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది.

ఇండో చైనా సరిహద్దు వివాదాలు

భారత్​- చైనాలు 3,488 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య అనేక సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. భారత భూభాగమైన అరుణాచల్​ప్రదేశ్​ను​ దక్షిణ టిబెట్​లోని భాగమని చైనా వితండవాదం చేస్తూవస్తోంది.

దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ..

వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ చైనా ప్రవర్తన రెచ్చగొట్టేలా ఉందని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'దక్షిణ, మధ్య ఆసియా బ్యూరో' హెడ్​ అలిస్ జీ వెల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చైనా సముద్రంపై సార్వభౌమాధికారం ప్రకటించుకున్న చైనా... వియత్నాం, మలేసియా, ఫిలప్పీన్స్, బ్రూనై, తైవాన్ల హక్కులను కాలరాస్తోందని ఆమె ఆరోపించారు.

అన్నీ ఆక్రమిస్తున్న చైనా...

ఖనిజాలు, ముడిచమురు, ఇతర సహజవనరులు సమృద్ధిగా ఉన్న ... దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం రెండింటిపైనా చైనా తన అధికారాన్ని ప్రకటించుకుంటోంది. ఈ సముద్రాల్లోని అనేక ద్వీపాలను ఆక్రమించి, అక్కడ తన సైన్యాలను నిలుపుతోంది.

'ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఈ రెండు సముద్రాలను నియంత్రిస్తున్న చైనా... స్వేచ్ఛా వాణిజ్యానికి భంగం కలిగిస్తూ... తను మాత్రం అక్రమంగా లాభపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. రెండో ప్రపంచ యుద్ధానంతరం నిర్దేశించుకున్న ఆర్థిక సూత్రాలను ఎలా అమలుచేయగలుగుతాం' అని వెల్స్​ అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'కాలాపానీ'పై నేపాల్​కు భారత్​ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!

Last Updated : May 21, 2020, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.