ETV Bharat / international

'అఫ్గాన్​లో కాదు.. ఉగ్ర ముప్పు ఆ దేశాల్లోనే ఎక్కువ'

author img

By

Published : Aug 19, 2021, 9:52 PM IST

US AFGHAN BIDEN
జో బైడెన్ అఫ్గానిస్థాన్

అఫ్గానిస్థాన్​తో పోలిస్తే ఇతర దేశాల నుంచే అమెరికాకు అధిక ముప్పు ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. సిరియా, ఆఫ్రికా దేశాలలో ఉగ్రవాదుల ప్రమాదం అధికంగా ఉందని అన్నారు. సైనిక శక్తితో మహిళా హక్కులను కాపాడలేమని చెప్పుకొచ్చారు.

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లతో పోలిస్తే ఇతర దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్​ఖైదా వంటి ఉగ్రమూకల నుంచే అమెరికాకు అధిక ముప్పు ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. కాబట్టి అఫ్గాన్​లో అమెరికా తన సైన్యాన్ని మోహరించడానికి హేతుబద్ధమైన కారణాలు లేవని అన్నారు. ఈ మేరకు ఓ వార్తా ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

సిరియా సహా తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపులు అఫ్గానిస్థాన్​ కన్నా ప్రమాదకరంగా మారాయని అన్నారు. ఐసిస్ అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

"ఎక్కడ ప్రమాదం ఎక్కువగా ఉందో అక్కడే మనం దృష్టిసారించాలి. ఉత్తరాఫ్రికా, పశ్చిమాఫ్రికాలో ఉన్న అధిక ముప్పును పట్టించుకోకుండా.. అఫ్గానిస్థాన్​లో వేల కొద్దీ సైన్యాన్ని మోహరించడం, ట్రిలియన్ డాలర్లను వెచ్చించడం వివేకం కాదు. సిరియాలో ఉగ్రవాదులను ఎదుర్కోగలిగే సామర్థ్యం అమెరికాకు ఉన్నా.. అక్కడ మన సైన్యం తగినంతగా లేదు."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

మరోవైపు, మహిళా హక్కుల పరిరక్షణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. సైనిక బలప్రయోగం ద్వారా మహిళల హక్కులను కాపాడటం సరికాదని చెప్పుకొచ్చారు. దౌత్య, అంతర్జాతీయ ఒత్తిడితోనే అది సాధ్యవడుతుందని అన్నారు.

అఫ్గాన్​లో చిక్కుకున్న అమెరికన్లందరినీ బయటకు తీసుకొస్తామని బైడెన్ స్పష్టం చేశారు. సైనిక ఉపసంహరణకు చివరి తేదీ అయిన ఆగస్టు 31 తర్వాత కూడా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

మరో షాక్..

ఇప్పటికే అఫ్గాన్​ కోసం కేటాయించిన నిధులపై ఆంక్షలు విధించిన బైడెన్ సర్కారు.. తాలిబన్లకు మరో షాక్ ఇచ్చింది. అఫ్గాన్ ప్రభుత్వానికి ఆయుధాలు విక్రయించడాన్ని నిలిపివేసింది. పెండింగ్​లో ఉన్న ఆయుధ కాంట్రాక్టులు, డెలివరీ చేయని ఆయుధాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాటిని సమీక్షించనున్నట్లు తెలిపింది.

'అది అనవసర యుద్ధం'

అమెరికాలోని చాలా మంది ప్రజలు సైతం అఫ్గానిస్థాన్​లో తమ దేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బైడెన్ విదేశాంగ విధానంపై చాలా వరకు అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ.. ఈ విషయంలో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడి అభిప్రాయానికే మొగ్గుచూపినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అసోసియేటెడ్ ప్రెస్-ఎన్​ఓఆర్​సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి. ఆగస్టు 12-16 మధ్య సర్వే జరిగింది.

మూడింట రెండొంతుల మంది అమెరికన్లు అఫ్గాన్​లో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో బైడెన్​ పనితీరు బాగుందని 47 శాతం మంది అభిప్రాయం తెలపగా.. 52 శాతం మంది జాతీయ భద్రత విషయంలో బైడెన్ విధానాన్ని స్వాగతించారు. అయితే, రిపబ్లికన్లలో కొంతమంది మాత్రం ఇరాక్, అఫ్గాన్​లలో అమెరికా యుద్ధాన్ని సమర్థించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.