ETV Bharat / international

ప్రపంచ దేశాలకు మార్గదర్శకం.. భారత స్వాతంత్ర్యోద్యమం

author img

By

Published : Aug 15, 2021, 8:30 AM IST

రెండు శతాబ్దాల బ్రిటిష్‌ దాస్య శృంఖలాలను పెకలించి భారత దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన సంగ్రామం అనేక దేశాల్లో సరికొత్త పోరాట పంథాకు ఊపిరులూదింది. అహింసే ప్రధాన ఆయుధంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ప్రాంతాల్లో రక్తపాతరహిత ఉద్యమాలకు బాటలు వేసింది. గాంధేయ మార్గంలో సాగితే... ఎంతటి క్లిష్ట సమస్యకైనా పరిష్కారం చూపుతుందన్న విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ మార్గంలోనే పయనించిన కొన్ని దేశాలు స్వేచ్చను సాధించాయి. మరికొన్ని దేశాల్లో పాలకులు, ఉన్నత వర్గాల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినవారు.. కొత్త శకానికి బాటలు వేసుకున్నారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం..

భారత స్వాతంత్య్రోద్యమం ప్రపంచదేశాలకు మార్గదర్శకం

1947 ఆగస్టు 15 భారత దేశం స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. ఒక సరికొత్త దేశం ఉదయించిన క్షణం. భారతావని నలుమూలాల సంబరాలు అంబరాన్నింటిన చారిత్రక సమయమది. అంతులేని ఆనందం వెల్లి వెరిసిన తరుణమది. అఖండ భారతం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు సాధించిన ఆ విజయం అహింసామార్గంలో సుదీర్ఘ కాలం సాగిన పోరాట ఫలితం. సాధారణ ప్రజలే సాటిలేని సాహసం, అపూర్వ సమరశీలతతో చావోరేవో తేల్చుకోవాలన్న అకుంఠిత దీక్షతో యావత్‌ భారతావనిని ప్రభంజనంలా నడిపించిన.. దేశ స్వాతంత్ర ఉద్యమం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. బ్రిటిష్‌వారి దాస్యశృంఖలాలకు వ్యతిరేకంగా శ్రీలంక చేసిన పోరాటానికి, అమెరికా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వర్ణ వివక్షపై సాగిన ఉద్యమాలకు బాటలు వేసింది మహోత్తర పోరాటం భారత స్వాతంత్ర్యోద్యమం.

పొరుగున ఉన్న మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా అంగ్​సాన్​ సూకీ సాగించిన సుదీర్ఘ ఉద్యమం, కమ్యూనిస్టు చైనా నిరంకుశ విధానాలపై టిబెటన్‌ గురువు దలైలామా చేస్తున్న పోరాటమూ భారత స్వాతంత్ర్యోద్యమం అందించిన స్ఫూర్తితోనే సాగాయి. ఇంకా అనేక ఉద్యమాలు, పోరాటాలకు పరపీడనపై భారతీయులు చేసిన పోరాటం బాటలు చూపిస్తోంది.

గాంధీ ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందిన లంక..

రెండొందల ఏళ్ల బ్రిటిష్‌వారి పాలనకు చరమగీతం పాడిన భారత స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో స్వయం పాలన కోసం పోరాటం సాగించింది పొరుగున ఉన్న శ్రీలంక. బౌద్ధులైన అనగరిక ధర్మపాల గాంధీ స్ఫూర్తితో శాంతియుత పోరాటం చేయగా అక్కడి యువ సంఘాలు ఆయన మార్గంలోనే పయనించాయి. శ్రీలంక స్వాతంత్ర్యోద్యమ నాయకుడు చార్లెస్ ఎడ్గార్‌ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన మహాత్మాగాంధీ అక్కడ చేసిన ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందిన లంక యువత ఆయన చూపిన మార్గంలోనే తమ స్వయం పాలనకు బాటలు వేసుకున్నారు. లంక యువత కూడా భారతీయులు అనుసరించిన అహింసా మార్గాన్ని ఎంచుకోగానే ఆ ఉద్యమాన్ని అణచివేయడం తమ తరం కాదని భావించిన బ్రిటిష్‌వారు 1948లో లంకకు స్వాతంత్ర్యం ఇవ్వక తప్పని పరిస్థితి. అలా స్వేచ్ఛావాయువులు పీల్చిన సిలోన్‌ 1972లో రిపబ్లిక్‌ ఆఫ్‌ శ్రీలంకగా మారింది. అప్పటివరకు యూకేకు అనుబంధ రాజ్యంగా కొనసాగింది.

గాంధీ మార్గంలో నడయాడి.. దక్షిణాఫ్రికా జాతిపితగా..

దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష అంతానికి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అనుసరించిన అహింసే మార్గం చూపింది. అఖండ భారతావనిని తన అహింసామార్గంతో.. ఒక్కతాటిపైకి తెచ్చి దేశాన్ని బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తం చేయించిన మహాత్మ గాంధీ ప్రేరణతోనే దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు నెల్సన్‌ మండేలా. అక్కడి పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నో ఆంక్షలు విధించినా జాతి వివక్షపై అకుంఠిత దీక్షతో పోరాడారు. ఎన్నో ఏళ్లు జైళ్లలో మగ్గినా తన పోరాట పంథాను వీడని మండేలా చివరకు విజయాన్ని ముద్దాడారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను రూపుమాపాలన్న తన లక్ష్యాన్ని సాకారం చేశారు. కోట్లాదిమంది ఆకాంక్షను అహింసా మార్గంలో నెరవేర్చిన మండేలా దక్షిణాఫ్రికా జాతిపితగా కీర్తినార్జించారు. దక్షిణాఫ్రికా ప్రజలకు.. వర్ణవివక్ష నుంచి విముక్తి ప్రసాదించిన మండేలా తన దృష్టిలో అహింస సూత్రం కాదని, గొప్ప వ్యూహమని తన ఆత్మకథలో రాసుకున్నారంటే భారత స్వాతంత్ర్యోద్యమం చూపిన బాట వైశిష్ట్యం తెలిసిపోతుంది. ఎప్పుడైతే... అహింసా ఉద్యమంలో హింస చెలరేగుతుందో అప్పుడే దాని ప్రభావం ముగుస్తుందని మండేలా తన పుస్తకంలో పేర్కొన్నారు.

నల్లజాతీయులకు చుక్కాని..

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహాలు అగ్రరాజ్యం అమెరికాలో నల్లజాతి వారికీ చుక్కానిగా మారాయి. అమెరికా ప్రజా హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ అహింసామార్గంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికీ.. గాంధీజీ చూపిన అహింసా మార్గమే ఎంచుకున్నారు.

మహాత్మగాంధీ నడిపిన భారత స్వాతంత్ర్యోద్యమం నుంచి స్పూర్తి పొందిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాలో బస్సులు వంటి ప్రజారవాణాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు. 1955లో.. మాంట్‌ గోమెర్రీ బస్‌ బాయ్‌కాట్‌ ఉద్యమాన్ని నిర్వహించారు.ఆ పోరాటంలో లక్ష్యాన్ని సాధించిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌.. అహింసా మార్గం అన్నింటికంటే అత్యుత్తమ మార్గమని చెప్పడం భారత స్వతంత్ర పోరాటం గొప్పతనానికి నిదర్శనం. పీడిత జాతి.. పీడన నుంచి బయటపడేందుకు అహింస అతి గొప్ప ఆయుధమని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ చేసిన వ్యాఖ్యలు భారత పోరాట స్ఫూర్తిని చాటుతున్నాయి. జీసస్ నాకు సందేశం ఇస్తే, గాంధీ దాన్ని ఆచరణలో చూపించారన్న కింగ్‌ మాటలు మహాత్ముడు చూపిన మార్గంలో ఔన్నత్యానికి నిలువుటద్దాలు.

అంగ్​సాన్​ సూకీ, దలైలామా.. భారత మార్గంలోనే..

పక్కనే ఉన్న మయన్మార్‌లో ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాస్వామ్యకాంక్ష భారత స్వతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే కొనసాగుతోంది. ప్రజాస్వామ్య నాయకురాలైన అంగ్​సాన్​ సూకీని అక్కడి సైనిక పాలకులు 20ఏళ్లు నిర్బంధించినా ఆమె మనోధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదంటే భారతీయులను.. ఆదర్శంగా తీసుకోవడమే కారణం. గాంధీజీ చూపిన బాటలో పయనిస్తూ నిర్బంధాల నుంచి బయటకొచ్చిన అంగ్​సాన్ సూకీ.. తన సొంత పార్టీ ఎన్‌ఎల్‌డీ ద్వారా 2015లో.. మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆమెను అక్కడి సైన్యం మళ్లీ బంధించినా శాంతియుతంగానే సూకీ పోరాడుతున్నారు. అక్కడి ప్రజలు కూడా... భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలను లెక్కచేయకుండా సైన్యానికి ఎదురొడ్డి శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు.

టిబెట్‌ బౌద్ధ గురువు దలైలామా కూడా గాంధీ మార్గాన్నే అనుసరించి.. కమ్యూనిస్టు చైనా నిరంకుశత్వ విధానాలపై పోరాటం చేస్తున్నారు. ప్రవాసంలో ఉంటూ శాంతియుతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిబెట్ సమాజానికి.. మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఇవీ చూడండి: చిమ్మచీకట్లో విరిసిన వెలుగు రేఖ

'ఆత్మనిర్భర శంఖారావంతో ప్రపంచానికి మన శక్తిని చాటుదాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.