ETV Bharat / international

ఇసుక తుపాను ధాటికి 8 మంది మృతి

author img

By

Published : Jul 27, 2021, 9:48 AM IST

US SHOOT
ఇసుక తుపాను ధాటికి 8 మంది మృతి

అమెరికాలో ఇసుక తుపాను ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భీకరమైన గాలులకు రహదారిపై పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మరో పది మందికి గాయాలయ్యాయి. మరోవైపు, కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. ప్రచండ గాలుల తుపాను ధాటికి పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

us sand storm
ఢీ కొట్టిన వాహనాలు

కనోశ్ నగరానికి సమీపంలోని ఇంటర్​స్టేట్ 15 రహదారిపై ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బాధితులను రహదారితో పాటు వాయు మార్గాల్లో ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో ఐ15 రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్​ను దారి మళ్లించారు.

us sand storm
కార్లు ధ్వంసం

తుపాకీ గర్జన

అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కాలిఫోర్నియాలోని బేకర్స్​ఫీల్డ్​లో ఓ దుండగుడు కొంత మందిని నిర్బంధించాడన్న వార్తలు తెలుసుకొని వారిని కాపాడేందుకు పోలీసులు వెళ్లారు. దుండగుడు ఆయుధాలతో ఇంటి పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా.. అతడిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి అక్కడే మరణించారు.

కాగా, దుండగుడి ఇంట్లో మూడు మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీరు అతడి కుటుంబ సభ్యులేనని భావిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు. ఇంట్లో ఉంటున్న ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు బాలికలు అక్కడి నుంచి తప్పించుకోగలిగారని తెలిపారు.

వరదలకు బలి

మరోవైపు, ఉత్తర కొలరాడోలో సంభవించిన వరదల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. పౌడ్రే నదిలో సోమవారం ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనలో మరణించినవారి సంఖ్య మూడుకు చేరింది.

ఇదీ చదవండి: పడవ మునిగి.. 57 మంది జల సమాధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.