ETV Bharat / entertainment

టాలీవుడ్​ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆరోజు నుంచి షూటింగ్స్​ బంద్!

author img

By

Published : Jul 17, 2022, 10:17 AM IST

Updated : Jul 17, 2022, 5:20 PM IST

సినిమా
సినిమా

క్యారెక్టర్​ ఆర్టిస్ట్​లు, హీరోహీరోయిన్​లు పారితోషికాలు పెంచడం.. తమకూ కనీస వేతనాలు పెంచాలంటూ జూనియర్​ ఆర్టిస్ట్​లు సమ్మెకు దిగడం మొదలైన కారణాల వల్ల భవిష్యత్తులో సినిమాల నిర్మాణంపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్​లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Producers Guild: కరోనా పాండెమిక్ తరువాత సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దానిక తగ్గట్టే నటీనటులు పారితోషికాలు కూడా పెంచేశారు. మరోవైపు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్​లు కూడా భారీగా రెమ్యునరేషన్​లను పెంచేశారని సమాచారం. ఇటీవల 24 క్రాప్ట్స్​కు చెందిన టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్​లు కూడా తమ కనీస వేతనాలు పెంచాల్సిందే అంటూ మెరుపు సమ్మెకు దిగారు. ఇలా ప్రతీ విషయంలోనూ సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి (Producers Guild) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

ఈ మేరకు గిల్డ్ సభ్యులైన నిర్మాతలు శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. ఆ సమావేశంలోనే సంచలన నిర్ణయానికి సిద్ధం అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవైపు స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్​లు.. మరోవైపు రోజు కూలీలతో పాటు 24 క్రాఫ్ట్​లకు చెందిన వారంతా ఒకేసారి పారితోషికాలు పెంచేయడంతో సినిమాలు నిర్మించలేని స్థితిలో ఉన్నామని సమావేశంలో నిర్మాతలు వాపోతున్నారని తెలిసింది. ఈ సమావేశంలో పారితోషికాల విషయంలో సమ్మెకు దిగుతూ కొంత మంది సినిమాల షూటింగ్​లను ఆపడానికి ప్రయత్నించిన విషయం.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫైవ్ స్టార్ భోజన ఖర్చులతో పాటు కొంత మంది రోజుల వారీగా.. గంటల వారిగా రెమ్యునరేషన్​లను డిమాండ్ చేస్తున్న విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు.

ఇలాగే ఉంటే పరిస్థితి తమ చేయిదాటిపోతుందని.. ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వైపు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపు చేయలేక, మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు రాక.. ఇలా నానా కష్టాలు పడే కంటే ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్​లను తిరిగి ప్రారంభిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంత వరకూ కొత్తగా ప్రారంభమయ్యే సినిమాల షూటింగ్​లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుందని తెలిసింది. అలాగే ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై ఇటీవలే నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పుడు దీనిపై మరోసారి చర్చించారని సమాచారం. 50 రోజులు కాకుండా 70 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీలో ిరిలీజ్​ చేయాలని నిర్ణయించారట.

ఇదీ చూడండి : రవితేజను కారవాన్​లోకి లాగిన చిరంజీవి​.. 'మెగా154' సెట్​లో సందడి

Last Updated :Jul 17, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.