చనిపోయే ముందు ఆ నటుడికి వయాగ్రా ఇచ్చారా?.. మహిళ సంచలన ఆరోపణలు

author img

By

Published : Mar 12, 2023, 2:38 PM IST

SATISH KAUSHIK DEATH MYSTERY
SATISH KAUSHIK DEATH MYSTERY ()

బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ మృతి పలు అనుమానాలకు కారణమవుతోంది. చనిపోయిన ముందు రోజు ఆయన హోలీ వేడుకలు జరుపుకున్న ఫామ్​హౌస్​లో అనుమానిత ఔషధాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఫామ్​హౌస్ యజమాని రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు.

సీనియర్ నటుడు సతీశ్ కౌశిక్ అకాల మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ ఫామ్​హౌస్​లో జరిగిన పార్టీకి హాజరైన తర్వాత ఆయన ఆనారోగ్యానికి గురికావడం.. అక్కడ అనుమానాస్పద ఔషధాలు లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫామ్​హౌస్ యజమాని వికాస్ మాలు రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు, సతీశ్ కౌశిక్​కు డబ్బు విషయంలో గొడవ జరిగిందని ఆరోపించారు. రష్యన్ అమ్మాయిలను సతీశ్​కు ఎరగా వేస్తానని తన భర్త చెప్పాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే సతీశ్ మరణించడం వల్ల అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

"ఓ పార్టీ కోసం సతీశ్ కౌశిక్ నా భర్త ఫామ్​హౌస్​కు వచ్చారు. అక్కడే ఆయన ఆరోగ్యం క్షీణించింది. సతీశ్​కు నా భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. గతేడాది ఆగస్టులో వాగ్వాదానికి దిగారు. గతంలో ఇచ్చిన రూ.15 కోట్లు తిరిగి ఇవ్వాలని నా భర్తను సతీశ్​ కౌశిక్ డిమాండ్ చేశారు. భారత్​కు వచ్చిన తర్వాత డబ్బు ఇస్తానని నా భర్త చెప్పారు. నేను డబ్బు విషయం గురించి నా భర్తను అడిగా. సతీశ్ నుంచి డబ్బు తీసుకున్నానని.. కరోనా సమయంలో నష్టాల వల్ల ఆ డబ్బు పోగొట్టుకున్నానని నా భర్త నాతో చెప్పారు. వయాగ్రా ఔషధాలు, రష్యన్ అమ్మాయిలను ఉపయోగించి కౌశిక్​ సమస్యను పరిష్కరించుకుంటానని నాతో అన్నారు. ఈ విషయాలన్నీ చెప్పాలని నేను పోలీసులను కలిశా. ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరా."
-ఫామ్​హౌస్ యజమాని భార్య

దావూద్ ఇబ్రహీం వంటి అండర్​వరల్డ్ డాన్​లతో తన భర్తకు సంబంధాలు ఉన్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 'అనాస్ అనే వ్యక్తి ఫామ్​హౌస్​కు తరచుగా వచ్చేవాడు. అతడు దావూద్ ఇబ్రహీం కొడుకు అని వికాస్ స్వయంగా నాతో చెప్పాడు. ఆ ఫామ్​హౌస్​కు తరచుగా వచ్చే మరో వ్యక్తి ముస్తఫా. అతడు దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అని వికాస్ చెప్పాడు. ఇలా ఫామ్​హౌస్​కు వచ్చే కొందరి ఫొటోలు సైతం నా దగ్గర ఉన్నాయి' అని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. నైరుతి దిల్లీ జిల్లాకు చెందిన ఇన్​స్పెక్టర్ స్థాయి అధికారి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

SATISH KAUSHIK DEATH MYSTERY
పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ మార్చి 9న కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. ముందు రోజు (మార్చి 8న) ఆయన తన స్నేహితులతో కలిసి దిల్లీలోని ఫామ్​హౌస్​లో ఉల్లాసంగా గడిపారు. ఆ రోజు ఘనంగా హోలీ జరుపుకున్నారు. పాటలకు నృత్యాలు చేస్తూ గడిపారు. ఆ రోజు 9.30 గంటలకు నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. దీంతో కౌశిక్ మేనేజర్.. ఆయన్ను గురుగ్రామ్​లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు సీపీఆర్ చేశారు. కానీ, ఆయన ప్రాణాలు నిలవలేదు. 1.43 గంటల సమయంలో కౌశిక్ కన్నుమూశారు.

హోలీ వేడుకలు జరిగిన ఆ ఫామ్​హౌస్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సతీశ్ కౌశిక్​ది సాధారణ మరణమేనని పోస్టు మార్టం నివేదికలో తేలిందని చెప్పారు. 'కార్డియాక్ అరెస్టు వల్లే ఆయన చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆయనకు మధుమేహం ఉంది. హైపర్​టెన్షన్​ సమస్యతో బాధపడుతున్నారు' అని వివరించారు. అయితే, దర్యాప్తు నిమిత్తం ఫామ్​హౌస్​కు వెళ్లిన పోలీసులకు.. పలు ఔషధాలు లభ్యమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటిని పరీక్షలకు పంపినట్లు తెలిపాయి. అవి నిషేధిత ఔషధాలు కావని పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.