ETV Bharat / entertainment

పెద్దన్నపై అవార్డుల వర్షం.. ఆస్వాదించడానికి కాస్త గ్యాప్ ఇవ్వమ్మా అంటూ జక్కన్న ట్వీట్

author img

By

Published : Jan 26, 2023, 11:16 AM IST

Updated : Jan 26, 2023, 12:01 PM IST

సంగీత విధ్వాంసుడు కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల రాజమౌళి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వరుస అవార్డుల వర్షం కురుస్తున్న వేళ..కాస్త అవార్డుకు అవార్డుకు మధ్య కాస్త గ్యాప్ ఇవ్వమని విశ్వాన్ని కోరుతున్నానని చెప్పారు. అప్పడే విజయాన్ని పూర్తిగా ఆస్వాదించగలమని అన్నయ్యపై అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే పద్మశ్రీ అవార్డును పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డులు వరించడానికి తన కష్టం మాత్రమే కాదని..తనతో పాటు పని చేసిన ప్రతి ఒక్కరి విజయం అని తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

rajamouli congragulates his brother keeravani with a special post
పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు కీరవాణిని అభినందించిన రాజమౌళి

తన సోదరుడు, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల అమితానందం వ్యక్తం చేశారు దర్శకధీరుడు రాజమౌళి . అన్నయ్య విషయంలో తాను గర్వంగా ఉన్నట్లు చెప్పారు. కీరవాణిని చూస్తూ కూర్చొన్న ఓ ఫొటోని ఆయన షేర్‌ చేశారు. తన అన్నయ్యకు వరుస అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జక్కన్న.. అవార్డుకు అవార్డుకు మధ్య కాస్త గ్యాప్‌ ఇవ్వమని ఈ విశ్వానికి చెబుతానని అన్నారు. అలా, అయితేనే ఒక విజయాన్ని పూర్తిగా ఆస్వాదించగలనని తెలిపారు.

‘‘నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాలని మీ అభిమానులందరి లాగానే నేనూ భావిస్తున్నాను. కానీ, ఈ విశ్వం ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఊహించని రీతిలో అందిస్తుందంటూ మీరు ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తు పెట్టుకున్నాను. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే.. "కొంచెం గ్యాప్‌ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్‌ చేశాక మరొకటి ఇవ్వు" అని దానికి చెబుతాను. నా పెద్దన్న.. ఎం.ఎం.కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. గర్వంగా ఫీలవుతున్నా’’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి గానూ కీరవాణికి ఈ ఏడాది వరుస అవార్డులు వరించాయి. ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డుతోపాటు 'బోస్టన్‌ సోసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌', 'క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డు', 'లాస్‌ ఏంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌' అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా వచ్చిన పద్మశ్రీతో ఆయన ఖ్యాతి మరింత పెరిగింది. ఇప్పటికే ఆస్కార్‌ నామినేషన్‌లో చోటు దక్కించుకున్న 'నాటు నాటు' కనుక విజయం అందుకుంటే కీరవాణి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లు అవుతుంది.

ఇది నా విజయం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిది..: కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి అవార్డులు రావడం.. వాటిని గవర్నర్‌ చేతుల మీదగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం తన కష్టం మాత్రమే కాదని.. తనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరి విజయమన్నారు. పెద్దల ఆశీర్వాదాలతోనే ఇంతటి ఘనత సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక పద్మశ్రీ పురస్కారం రావడంపై కీరవాణి తన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. "భారత ప్రభుత్వ పౌర పురస్కారం వరించిన సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు నా గురువులు కవితపు సీతమ్మ గారి నుంచి కుప్పాల బుల్లి స్వామి నాయుడు గారి వరకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేశారు.

ఇక ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోని 'నాటు నాటు' పాటకు కీరవాణి గోల్డెన్ గ్లోబ్‌ అవార్డును అందుకున్నారు. తాజాగా ఆయన ప్రతిభకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రేక్షకులు, ప్రముఖులు అభినందనలు, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ఎన్నో అరుదైన అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ నామినేషన్లలోనూ చోటు దక్కించుకుంది.

Last Updated : Jan 26, 2023, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.