ఆస్కార్​ వేడుకలో విల్​స్మిత్​ చెంపదెబ్బకు ఏడాది.. ఇప్పటికీ బాధిస్తుందన్న కమెడియన్​

author img

By

Published : Mar 12, 2023, 5:28 PM IST

chris rock

విల్​స్మిత్​ చెంపదెబ్బ ఘటన గుర్తుందా?.. గతేడాది ఆస్కార్​ అవార్డుల వేడుకలో జరిగిన ఈ వివాదాస్పద ఘటనకు ఏడాది అయిపోయింది. అయితే ఆ విషయం ఇప్పటికీ తనను బాధిస్తుందని తాజాగా కమెడియన్​ క్రిస్‌ రాక్‌ అన్నారు.

ఆస్కార్‌ అవార్డు వేడుకల చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘటన విల్‌స్మిత్‌ చెంపదెబ్బ. గతేడాది జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్‌రాక్‌ వ్యవహారశైలికి మండిపడ్డ విల్‌స్మిత్‌ వేదికపైనే ఆయనపై చేయిచేసుకున్నారు. అవార్డుల వేడుకలో ఉన్నవారితో పాటు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది ఒక్కసారిగా నివ్వెర పోయారు. అయితే ఆ ఘటన ఇప్పటికీ తనను బాధిస్తుందని తాజాగా క్రిస్‌ రాక్‌ చెప్పుకొచ్చారు.

"ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నాను. అందరి ముందు అతను నన్ను కొట్టాడు. 'ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా' అని కొంతమంది నన్ను అడిగారు. ఇప్పటికీ నేను బాధపడుతున్నా. ఆ దెబ్బ నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అయితే నేను బాధితుడిని కాదు. అందుకు నేనేమీ కన్నీళ్లు పెట్టుకోను" అని క్రిస్‌ రాక్‌ చెప్పుకొచ్చారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
94వ ఆస్కార్‌ ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ హాస్యాన్ని పండించే క్రమంలో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ భార్య జాడా పింకెంట్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్యం జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్‌ రాక్‌ ఆమెను జీ.ఐ.జేన్‌ చిత్రంలో డెమి మూర్‌ పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్‌ స్మిత్‌ నేరుగా వేదికపై వెళ్లి క్రిస్‌ చెంప పగలగొట్టారు.

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్‌ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. అనంతరం, ఘటనపై స్పందించిన స్మిత్‌ అకాడమీ, సహచరులకు క్షమాపణలు తెలిపారు. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అకాడమీ నిర్వాహకులు విల్ స్మిత్‌ను ఆస్కార్ వేడుకలకు హాజరుకాకుండా పదేళ్లపాటు నిషేధం విధించారు.

భారీ ఏర్పాట్లు..
హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో భారీ ఏర్పాట్ల మధ్య 95వ ఆస్కార్​ అవార్డుల ప్రదాన వేడుక.. మార్చి 13న( భారత కాలమానం ప్రకారం) ఘనంగా జరగనుంది. జిమ్మీ కిమ్మెల్ మూడోసారి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రతి ఏడాది నటీ నటులకు స్వాగతం పలికే రెడ్‌ కార్పెట్‌ స్థానంలో ఈసారి షాంపైన్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. రెడ్‌ కార్పెట్‌ మీదుగా ఈ షాంపైన్‌ కార్పెట్‌ను వేస్తున్నారు. 1961 తర్వాత మొదటిసారిగా కార్పెట్ ఎరుపు రంగులో కాకుండా షాంపైన్‌ రంగులో ఉండనుంది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు ఆస్కార్‌ పురస్కారాల కోసం షార్ట్‌లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా అకాడమీ తుది జాబితాను ఎంపిక చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.