ETV Bharat / entertainment

వినోదానికి విరామం లేదు మిత్రమా.. ఈ వేసవి అగ్ర హీరోలదే

author img

By

Published : Apr 14, 2022, 6:43 AM IST

2022 Summer movies
చిరంజీవి మహేశ్​బాబు

2022 Summer movies: విరామం లేదు.. వాయిదాల మాటే లేదు.. వారం వారం వినోదాల విందు భోజనం చేసేస్తున్నారు సినీప్రియులు. అటు ప్రేక్షకులు.. ఇటు చిత్ర వర్గాలు.. ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే వేసవి సినీ మారథాన్‌ ఈసారి కాస్త ముందుగానే షురూ అయింది. కరోనా పరిస్థితుల వల్ల గడిచిన రెండేళ్లు సినీ క్యాలెండర్‌లో వేసవి వినోదాల సందడి కనిపించలేదు. దీంతో ఈసారి వేసవికి.. రెండేళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ ముందు వరుసగా సందడి చేస్తున్నాయి. ఇప్పటికే 'రాధేశ్యామ్'​, 'ఆర్​ఆర్​ఆర్'​ వచ్చేయగా 'బీస్ట్'​, 'కేజీఎఫ్​ 2' సందడి మొదలైంది. మరి కొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

2022 Summer movies: వేసవి సినిమాల జోరు ఎప్పుడో మొదలైంది. గత నెలలో 'రాధేశ్యామ్‌', 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' విడుదలతో ఆ వేడి మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేశాయవి. ఏప్రిల్‌లోనూ ఆ దూకుడు కొనసాగుతోంది. ఈ వారం విడుదలైన రెండూ అనువాద చిత్రాలే అయినా... బాక్సాఫీసు దగ్గర కావల్సినంత సందడి కనిపిస్తోంది. ఇక నుంచి రెండు వారాలకొకటి చొప్పున అగ్ర తారల సినిమాలే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అసలు సిసలు వేసవి సీజన్‌ని బాక్సాఫీసుకి రుచి చూపించనున్నాయి. వీటి తాకిడికి చిన్న సినిమాలు బేజారవుతున్నాయి. ప్రేక్షకుల దృష్టంతా అగ్ర తారల సినిమాలపైనే ఉండటంతో... చిన్న చిత్రాలు విడుదలలు వాయిదా పడుతున్నాయి.

అగ్ర తారల సినిమాలు ఇదివరకు సీజన్‌కి ఒకట్రెండు చొప్పున విడుదలయ్యేవి. సుదీర్ఘంగా సాగే వేసవి సీజన్‌లో అయితే ఆ సంఖ్య కొంచెం పెరిగేదంతే. అయితే కరోనా ఈ వేసవిని పూర్తిగా మార్చేసింది. ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు, అందులోనూ అగ్రతారల సినిమాలు ఎక్కువగా ఈ వేసవిపైనే దృష్టిపెట్టాయి. దాంతో బాక్సాఫీసుకి వారం వారం పండగే అన్నట్టుగా మారింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తరహాలో ఎప్పట్నుంచో ఊరిస్తూ వచ్చిన ‘కె.జి.ఎఫ్‌ 2’, విజయ్‌ ‘బీస్ట్‌’లతో ఈ వారం బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. ఆ తర్వాత ‘ఆచార్య’తో చిరంజీవి, రామ్‌చరణ్‌ రంగంలోకి దిగనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు వారాలకే, మే 12న మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’, ఆ తర్వాత రెండు వారాలకి వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌3’ సినిమాలు థియేటర్లలోకి క్యూ కడుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో విడుదలవుతున్న సినిమాల నిర్మాణ వ్యయమే దాదాపు రూ. 1600 కోట్లకిపైనే ఉంటుందని అంచనా. వీటిలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రూ.వెయ్యి కోట్లకిపైగా వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ వేసవి అంతా అగ్ర తారల సినిమాలు వరుస కడుతుండటంతో ప్రేక్షకులు వాటిపైనే దృష్టి పెడుతున్నారు. మధ్యలో వచ్చే యువతారల సినిమాలు, పరిమిత వ్యయంతో రూపొందే సినిమాలపై అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదు. వాటికి సరైన వసూళ్లే దక్కడం లేదు. దాంతో చిన్న చిత్రాలు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్‌ 22న విడుదల కావల్సిన ‘కృష్ణ వ్రింద విహారి’, ‘జయమ్మ పంచాయితీ’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలు వాయిదా పడుతుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. సినిమా టికెట్‌ ధరల పెరుగుదల కూడా చిన్న చిత్రాల వాయిదాకి ఓ కారణంగా భావిస్తున్నాయి ట్రేడ్‌ వర్గాలు. తమ దగ్గరున్న డబ్బుతో అగ్ర తారల సినిమాలు చూసేసి, చిన్న సినిమాల గురించి మళ్లీ ఆలోచిద్దాం అనే ధోరణిలో కనిపిస్తున్నారు ప్రేక్షకులు. అగ్ర తారల సినిమాల జోరు తగ్గాకే పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'కేజీయఫ్​ యశ్​'తో తారక్​, చెర్రీ దోస్తీ ఎప్పటిదో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.