ETV Bharat / crime

వివేకా రక్తపు మరకలను వాళ్లే శుభ్రం చేయించారు: సీబీఐకి ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం

author img

By

Published : Feb 25, 2022, 1:22 PM IST

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో ఎంపీ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16న సీబీఐకి ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

YS Viveka Murder Case
సీబీఐకి ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వై.ఎస్‌. అవినాశ్‌రెడ్డి పెదనాన్న వై.ఎస్‌. ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16వ తేదీన సీబీఐకి ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గుండెపోటుతో రక్తపువాంతులు చేసుకుని వివేకా మృతి చెందినట్లు... తన సోదరుడు వై.ఎస్. మనోహర్‌రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరున్నరకే తనకు చెప్పారన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అందరికీ చెప్పేశారని అన్నారు. ఆ తర్వాత వివేకానందరెడ్డి ఇంటికి తాను వెళ్లినట్లు చెప్పారు.

Viveka Murder Case Updates: వివేకానందరెడ్డి ఇంట్లో బెడ్ రూంలోకి వెళ్ళి చూసేసరికి..అప్పటికే అక్కడ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా ఉన్నారని చెప్పారు. బెడ్‌మీద, నేలపైన రక్తపుమరకలు ఉన్నాయని... బాత్ రూంలో వివేకా మృతదేహం కనిపించిందని తెలిపారు. అక్కడి పరిస్థితులను చూస్తే గుండెపోటు కాదని... ఏదో జరిగిందనే విషయం గ్రహించానని సీబీఐకి వివరించారు.

అవినాశ్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దగ్గరుండి పని మనిషితో రక్తపు మరకలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ శంకరయ్య ప్రశ్నించినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. తనకు గానీ లేదంటే షర్మిల, విజయమ్మల్లో ఒకరికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేకానందరెడ్డి గతంలో అడిగారని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. వివేకాకు ప్రజల్లో మంచిపేరు ఉండేదన్న ఆయన... వైఎస్.భాస్కర్‌రెడ్డి కుటుంబం మొదటినుంచీ ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించేదని సీబీఐకి ఇచ్చిన స్టేట్​మెంట్​లో తెలిపారు.

viveka murder case : మాజీ మంత్రి వివేకా మృతి సమాచారం వెలుగుచూశాక తొలుత ఆయన ఇంట్లోని బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించింది వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా సీబీఐకి చెప్పారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు మృతదేహాన్ని చూసి బయటకు వచ్చాక మిగిలినవారు లోపలికెళ్లారని.. బెడ్‌రూమ్‌లోని రక్తం, వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (అవినాష్‌రెడ్డి కజిన్‌) తనపై కేకలు వేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకున్నారని చెప్పారు. వారి రాక ముందే వివేకా మృతదేహానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించానని తెలిపారు. ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గదిలో ఉన్నారని.. వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం తనకు ఉందంటూ ఆయనతో చెప్పానని వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలు గదిలో చర్చించుకుంటూ కనిపించారని తెలిపారు. కొంతసేపయ్యాక వివేకా గుండెపోటుతో చనిపోయారని.. గాయాలకు బ్యాండేజీ, కాటన్‌ చుట్టాలంటూ వారు చెప్పారని వెల్లడించారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ప్రతులు గురువారం వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివి.

"వివేకా ఇంట్లోని రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎర్ర గంగిరెడ్డి నాతో చెప్పారు. ఆ మాటలకు నేను సరిగ్గా స్పందించకపోయేసరికి 3సార్లు గట్టిగా కేకలు వేశారు. గంగిరెడ్డి ఎందుకు అంతలా కంగారు పడుతున్నాడు? రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎందుకు అడుగుతున్నాడు? అంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని ప్రశ్నించా. తనకూ అదే అర్థం కావట్లేదంటూ ఆయన సమాధానమిచ్చాడు. ఆ తర్వాత వై.ఎస్‌. భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌. మనోహర్‌రెడ్డిలు వివేకా మృతదేహాన్ని ఉంచేందుకు ఇంట్లోకి ఫ్రీజర్‌ బాక్సు తెప్పించారు"

-షేక్‌ ఇనయతుల్లా

సీఐ శంకరయ్య బాత్‌రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లగా.. నేను ఆయన్ను అనుసరించా. ఆ సమయంలో అక్కడున్న అల్మారా హ్యాండిల్‌ విరిగి ఉన్నట్లు చూశా. ఇంతకుముందు ఇది విరిగిలేదని శంకరయ్యకు చెప్పా. గోడలపై రక్తపుమరకల్ని గమనించా. వివేకాను ఎవరో చంపేసి ఉంటారని తనకు అనుమానంగా ఉందని సీఐ శంకరయ్యతో చెప్పా. ‘మీ సార్‌ను చంపాలని ఎవరు అనుకుంటారు? కమోడ్‌పై పడిపోయుంటారు. అందుకే తలకు గాయాలై రక్తం వచ్చి ఉంటుంది’ అని ఆయన నాకు ఎదురు సమాధానమిచ్చారు. ఆ తర్వాత వివేకా మృతదేహాన్ని చూస్తే ఆయన మెడ వంగినట్లు కనిపించింది. దాన్ని తిన్నగా చేయాలని ప్రయత్నించా. ఆ సమయంలో నా వేళ్లు వివేకా పుర్రె లోపలికి వెళ్లాయి. దీంతో నేను ఏడుస్తూ పెద్దగా కేకలు వేశా. తల వెనుక వైపునా తీవ్ర గాయాలున్నట్లు చూశా. ఇదే విషయమై ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పగా.. ఎం.వి.కృష్ణారెడ్డి పోలీసు ఫిర్యాదు ఇస్తారని తెలిపారు. ఫిర్యాదిస్తే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లాల్సి ఉంటుందని, లేకపోతే అవసరం లేదని సీఐ శంకరయ్య ఆ సమయంలో అక్కడున్నవారితో చెప్పారు. గంగిరెడ్డి నమ్మదగ్గ వ్యక్తి కాదని వివేకా చెప్పారు.

-షేక్‌ ఇనయతుల్లా

ఇదీ చూడండి: Viveka Murder Case Updates : వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.