ETV Bharat / crime

"దృశ్యం" సినిమా రిపీట్​.. వారం రోజులకే బండారం బయటపడిందిలా..

author img

By

Published : Jul 7, 2022, 7:58 PM IST

Updated : Jul 7, 2022, 10:38 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా భర్తను చంపేసి.. కొత్తగా కడుతున్న ఇంట్లో పూడ్చి పెట్టింది ఓ భార్య. అచ్చం హీరో వెంకటేశ్​ నటించిన దృశ్యం సినిమాను తలపించేలా జరిగిన హత్య.. దాన్ని దాచేందుకు చేసిన ప్రయత్నం.. సినిమాకు ఎంతమాత్రం తీసిపోలేదు. కానీ.. దృశ్యం సినిమాలోలాగా నిజం ఎక్కువ రోజులు దాగకుండా.. వారం రోజులకే బయటపడిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగింది.. నిజం ఎలా బయటపడిందో మీరూ తెలుసుకోండి..

wife killed husband as like drushyam movie because of illegal affair at kamareddy district
wife killed husband as like drushyam movie because of illegal affair at kamareddy district

హీరో వెంకటేశ్​ నటించిన దృశ్యం సినిమాను తలపించేలా ఓ రియల్​ క్రైం కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సినిమాలో.. కుమార్తెని కాపాడేందుకు భార్య అనుకోకుండా చేసిన హత్య నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ సామాన్యుడు నిజాన్ని నిర్మాణంలో ఉన్న పోలీస్​స్టేషన్​లో సామాధి చేస్తాడు. ఈ కథలో మాత్రం తన వివాహేతర సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఓ భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. తాను పనిచేసే ఇంట్లోనే పూడ్చి.. నిజాన్ని సామాధి చేద్దామనుకుంది. అయితే.. సినిమాలోలాగా.. ఎవ్వరడిగినా.. ఎంత భయపెట్టినా.. నిజాన్ని బయటపెట్డకుండా.. అందరూ ఒకేమాట మీద ఉండేలా ట్రైనింగ్​ ఇచ్చేందుకు ఇక్కడ హీరో వెంకటేశ్​ లేడు కదా..! అందుకే ఎక్కువ రోజులు నిజాన్ని దాచలేకపోయింది ఈ కథలో నాయిక..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా బొందపల్లికి చెందిన రమేశ్​(27) అతని భార్య వెన్నెల‍(25)తో కలిసి భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా.. భవన నిర్మాణ పనులకు వెళ్తున్న క్రమంలోనే రమేశ్​ భార్య వెన్నెలకు వికారాబాద్ జిల్లాకు చెందిన దస్తప్పతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేత సంబంధానికి దారి తీసింది.

జూన్​ 30న వాళ్లిద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో రమేశ్​ చూడటంతో.. చాలా కాలంగా సాగుతున్న వీళ్ల వ్యవహారం బయటపడింది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. తన బండారం బయటపడకుండా ఉండాలంటే రమేశ్​ను అడ్డుతొలగించుకోవటమే ఏకైక మార్గమని వెన్నెల భావించింది. ఇంకేముంది.. తర్వాతి రోజే దస్తప్పతో కలిసి వెన్నెల తన భర్త రమేశ్​ను గొంతు నులిమి హతమార్చింది. మృతదేహం ఎవరికి దొరకకుండా చేయటం కోసం.. వాళ్లు పని చేస్తున్న ఇంటినే ఎంచుకున్నారు. కొత్తగా కడుతున్న ఇల్లు కావటంతో.. ఎవరికి అనుమానం రాదని అదే ఇంట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.

"దృశ్యం" సినిమా రిపీట్​.. వారం రోజులకే బండారం బయటపడిందిలా..

ఇంత చేసిన.. ఏమీ ఎరుగనట్టు తిరిగి తమ స్వస్థలానికి వెన్నెల వెళ్లింది. తన భర్త కనిపించట్లేదని.. అక్కడికి గానీ వచ్చాడా..? అంటూ బంధువులను వాకబు చేసింది. వెన్నెల మీద అనుమానం వచ్చిన బంధువులు.. గద్దించి అడగ్గా అసలు విషయం ఒప్పేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రమేశ్​ కుటుంబసభ్యులు ఎల్లారెడ్డికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని తవ్వి బయటకు తీసి అక్కడే పంచనామా పూర్తి చేశారు. ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుని.. చట్టప్రకారంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 7, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.