HM died due to transfers : బదిలీ ఆవేదనతో ఆగిన ప్రధానోపాధ్యాయుడి గుండె

author img

By

Published : Dec 31, 2021, 10:30 AM IST

HM died due to transfers, hm jetram died

HM died due to transfers : రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన బదిలీల నేపథ్యంలో... వేరే జిల్లాకు బదిలీ అయ్యాననే మనస్తాపంతో ఓ ప్రధానోపాధ్యాయుడు మరణించారు. సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకు ట్రాన్స్​ఫర్ అవడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

HM died due to transfers : పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాడు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది.

ఎలా జరిగింది?

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాణోత్ జేత్రాo(57 ) నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసేవారు. ఉద్యోగుల జిల్లా కేటాయింపుల్లో ఆయనను ములుగు జిల్లాలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన అంత దూరం ఎలా వెళ్లాలనే ఆలోచనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో గుండెపోటుతో గురువారం సాయంత్రం మరణించారు.

ఎవరూ లేని సమయంలో..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని... ఆయన అప్పటికే మృతి చెందారని కుమారుడు గోపాల్ తెలిపారు. ట్రాన్సఫర్ వల్లే తమ తండ్రి మృతి చెందారని కుమారుడు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

మా అమ్మ అంగన్వాడీ టీచర్. భార్యాభర్తలు ఒకే జిల్లాలో డ్యూటీ చేయాలని చెప్పినా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సొంత జిల్లా మహబూబాబాద్ జిల్లా కాకుండే వేరే జిల్లాకు ఎలా బదిలీ చేస్తారు. బదిలీ చేయడం వల్లనే మా డాడీకి ఇలా జరిగింది. మా నాన్న పెరాలసిస్​తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ట్రాన్స్​ఫర్ చేసి మా కుటుంబ పెద్ద దిక్కును లేకుండా చేశారు. ఇప్పుడు మాకు దిక్కెవరు?

-గోపాల్, మృతుడి కుమారుడు

జిల్లాల కేటాయింపు విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరితోనే జేత్రాం మృతి చెందారని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మల్లారెడ్డి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడు జైత్రాం మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) డిమాండ్‌ చేసింది. గిరిజన ఉపాధ్యాయుల దామాషాను సక్రమంగా పాటించకుండా, కేడర్‌ సీనియారిటీ ప్రకారం ఆయన్ను జూనియర్‌గా నిర్ణయించి ములుగు జిల్లాకు కేటాయించారని నేతలు ఆరోపించారు. భార్యాభర్తల విభాగంలోనైనా తనకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో మానసిక క్షోభతో గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారని కమిటీ నేత చావ రవి తెలిపారు. యూఎస్‌పీసీ అత్యవసర సమావేశంలో జైత్రాం మృతికి సంతాపం ప్రకటించారు.

జేత్రాం మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 317 జి. ఓ. ప్రకారం స్థానికతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. పుట్టి, పెరిగి దాదాపు 30 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పని చేసిన జిల్లాను వదిలి... వేరే జిల్లాకు వెళ్లాల్సివస్తుందన్న బాధతో ఆయన మరణించారు. ఈ విషయంపై తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ మరణానికి ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణం.

-ఉద్యోగ సంఘాల నాయకులు

ఇదీ చదవండి: Teacher Transfers in Telangana: టీచర్ల అప్పీళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.