Blackmail : మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి... ఆపై బెదిరించి

author img

By

Published : Aug 14, 2021, 7:12 AM IST

మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి... ఆపై బెదిరించి
మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి... ఆపై బెదిరించి ()

ఒంటరిగా ఫీలవుతున్నారా.. నీకు నేనున్నానంటూ మెల్లగా మాయచేస్తుంది. ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు.. నీకు తోడుగా ఉంటానంటూ నమ్మిస్తుంది. నెమ్మదిగా ఫోన్ కాల్స్ నుంచి.. వాట్సాప్ ఛాటింగ్ వరకు... ఛాటింగ్ నుంచి.. వీడియో కాల్స్.. ఆ పై.. నూడ్ కాల్స్ వరకు తీసుకొస్తుంది. ఆ కిలేడీ మాయలో పడి.. వీడియో కాల్ మాట్లాడిన యువకుడి వీడియోను రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతుంది. ఇదీ రాష్ట్రంలో కొంతకాలంగా కిలేడీల వలపు వలలో చిక్కి గిలగిలలాడుతున్న అమాయక యువకుల పరిస్థితి.

‘ఒంటరిగా ఉన్నామని ఫీలవుతున్నారా.. మీ భావాలను పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడు/స్నేహితురాలు కావాలా..?’ అంటూ వచ్చే ఈ ఒక్క ఎస్‌ఎంఎస్‌ ఎందరో యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుదాంలే అనుకునేలోపే వలపు వలకు చిక్కి.. బయటకు రాలేకపోతున్నారు. తమకు జరిగిన మోసం ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే మానసికంగా కుమిలిపోతున్నారు.

ఈ తరహాలోనే విశాఖ యువకుడి నుంచి జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి(24).. రూ.24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో సుమారు 25 మంది అమ్మాయిలు పనిచేశారు. అది మూతపడటంతో వీరందర్నీ అక్కడే పనిచేసే టీం లీడర్‌ కృష్ణాజిల్లాకు చెందిన షాహిక్‌ అబ్దుల్‌ రెహమాన్‌(30) చేరదీశాడు. ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి వీరితో ఈ మోసాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. వీరే కాకుండా ఇంకా నగరంలో చాలామంది కి‘లేడీ’లు ఉన్నారని అప్రమత్తంగా ఉండాలంటూ సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వలకు ఎలా చిక్కుతున్నారంటే...

మార్కెటింగ్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, కాల్‌సెంటర్ల నుంచి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ పంపిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేయగానే కి‘లేడీ’లు రంగంలోకి దిగుతున్నారు. వర్చువల్‌ నంబర్లతో కాల్‌ చేస్తున్నారు. పది పదిహేను రోజులు తరచూ ఫోన్లు చేసి ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. బాధితులు వారి నంబర్‌ అడిగితే కి‘లేడీ’లు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న నంబర్లను ఇస్తున్నారు.

ఇక్కడి నుంచే అసలు కథ..

ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారు. వీడియో కాల్స్‌ చేసి రెచ్చగొడుతున్నారు. నగ్నంగా చూడాలని ఉందా..? అంటూ అడుగుతున్నారు. పైన దుస్తులు మాత్రమే తీసేస్తే రూ.500, ఇంకొంచెం కిందకైతే రూ.వెయ్యి, పూర్తిగా నగ్నంగా చూడాలనుకుంటే రూ.2వేలు చెల్లించాలని సూచిస్తున్నారు. ఇక్కడే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఒకటి, రెండు దశలు పూర్తి కాగానే బాధితులను కూడా నగ్నంగా కనిపించాలంటూ రెచ్చగొడుతున్నారు. అప్పుడు ‘స్క్రీన్‌ రికార్డింగ్‌’తో వీడియో (బాధితులు నగ్నంగా ఉన్నప్పుడు) చిత్రీకరిస్తున్నారు. తర్వాత ఆ వీడియోను వాట్సాప్‌లో పంపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలా..? అంటూ బెదిరింపులకు దిగి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.