ETV Bharat / crime

ఒళ్లు గగుర్పొడిచే కిల్లర్ కథ... 18 హత్యల వెనుక క్రైం కహానీ!

author img

By

Published : Jan 26, 2021, 8:21 PM IST

psycho killer
psycho killer

భార్య దూరం కావడంతో మొత్తం మహిళల మీదే కక్ష పెంచుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 మంది స్త్రీలను అతిదారుణంగా హత్య చేశాడు. ఇటీవల రెండు హత్యకేసుల్లో దర్యాప్తు చేస్తుండగా... సైకో కిల్లర్‌ ఘాతుకాలు వెలుగుచూశాయి. నిందితుడు రాములును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు.

సైకో కిల్లర్ ‌ఘాతుకాలు... మహిళలపై ద్వేషంతో 18 హత్యలు!

పెళ్లి చేసుకున్న కొంత కాలానికే భార్య... వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. మరో వివాహం చేసుకున్నా... రెండో భార్య కూడా వదలిపెట్టిపోవడంతో మానసిక సంఘర్షణకు లోనైన ఓ వ్యక్తి సైకోగా మారాడు. మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. ఇలా 18 హత్యలు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్​ను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మానసిక సంఘర్షణలకు లోనై...

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన మైన రాములుకు 21ఏళ్ల వయసులో పెళ్లైంది. 1998లో పెళ్లైన కొన్ని నెలలకే భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు రాములును చులకనగా చూశారు. అవమానభారం తట్టుకోలేని రాములు రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె కూడా రాములును వదిలిపెట్టడంతో మానసిక సంఘర్షణలకు లోనై... సైకోగా మారాడు. మూడో వివాహం చేసుకున్నా... ఆమెతోనూ సరిగ్గా ఉండలేదు.

నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి..

మహిళలపై ద్వేషం పెంచుకున్న రాములు... ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడు. కల్లు దుకాణాలు, వైన్స్ షాపుల వద్ద కనిపించే మహిళలతో పరిచయం పెంచుకోసాగాడు. వారితో మాట కలిపి... నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. 2003లో మెదక్ జిల్లా తూప్రాన్​లో ఓ మహిళను తీసుకెళ్లి హత్య చేశాడు. ఇలా 2009 వరకు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మంది మహిళలను హత్య చేశాడు. ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి పూటుగా కల్లు తాపించి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత మహిళలను హత్య చేయడం రాములు నైజం.

జీవిత ఖైదు విధించినా..

కేవలం హత్యలే కాకుండా 4 దొంగతనాల కేసులు కూడా రాములుపై నమోదయ్యాయి. 2003 నుంచి 2009 వరకు జరిగిన 9 హత్యల్లో 7 హత్యలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కావడంతో ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మైన రాములును అరెస్ట్ చేశారు. రంగారెడ్డి న్యాయస్థానం 2011 ఫిబ్రవరిలో రాములుకు జీవిత ఖైదు విధించింది. రాములును చర్లపల్లి జైలుకు తరలించగా... మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో జైలు అధికారులు చికిత్స కోసం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి పంపించారు. 2011 డిసెంబర్ 30న ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి మరో ఐదుగురు ఖైదీలతో కలిసి రాములు పారిపోయాడు.

ఒక్క ఏడాదిలోనే నాలుగు హత్యలు

జైలు నుంచి పారిపోయిన రాములు ఆ తర్వాత హత్యల పరంపర ఆపలేదు. 2012లో ఒక్క ఏడాదిలోనే నలుగురు మహిళలను హత్య చేశాడు. 2013లో ఒక మహిళను హత్య చేశాడు. బోయిన్​పల్లి ఠాణా పరిధిలో ఇద్దరు మహిళలను, చందానగర్ ఠాణాల్లో పరిధిలో ఇద్దరు, దుండిగల్ ఠాణా పరిధిలో మరో మహిళను హత్య చేశాడు. ఈ ఐదు హత్య కేసులకు సంబంధించి బోయిన్​పల్లి పోలీసులు 2013లో రాములును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే తనపై ఉన్న హత్య కేసులకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న రాములు, జైలు నుంచే హైకోర్టుకు లేఖ రాశారు. తనను విడుదల చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు.

బెయిల్​పై విడుదలై

తన తరఫున ఓ న్యాయవాదిని నియమించుకొని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేలా హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. తీర్పును సమీక్షించిన హైకోర్టు రాములును విడుదల చేయాలని ఆదేశించడంతో 2018 అక్టోబర్ 3న జైలు నుంచి బయటికి వచ్చాడు. అయినా రాములు వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. 2019లో శామీర్​పేట్ ఠాణా పరిధిలో ఒక మహిళను, పఠాన్ చెరువు పీఎస్ పరిధిలో మరో మహిళను హత్య చేశాడు. ఈ రెండు హత్య కేసులకు సంబంధించి పోలీసులు రాములును అరెస్ట్ చేసి మరోసారి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. గతేడాది జూలై 31న రాములు బెయిల్​పై విడుదలయ్యాడు.

డబ్బు ఆశచూపి

ఐదు నెలల పాటు బుద్ధిగానే ఉన్న రాములు... గతేడాది డిసెంబర్ 10న బాలానగర్​లో ఉన్నకల్లు కంపౌండ్​కు వెళ్లి అక్కడ ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. డబ్బు ఆశచూపి మహిళను సిద్దిపేట్ జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాప్త సింగాయపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఇరువురు కలిసి మద్యం సేవించిన అనంతరం మహిళతో శారీరక వాంఛ తీర్చుకొని ఆ తర్వాత చీరతో గొంతుకు బిగించి హత్య చేశాడు. మృతురాలి కాళ్ల కడియాలు, వెండి ఆభరణాలు తీసుకెళ్లాడు. గుర్తు తెలియని మహిళ హత్య అయినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులే విస్తుపోతున్నారు..

ఈ నెల 4న ఘట్​కేసర్ పీఎస్ పరిధిలోని అంకుషాపూర్ గ్రామ శివారులోని రైలు పట్టాల సమీపంలో సగం కాలిపోయి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ వెంకటగిరికి చెందిన వెంకటమ్మగా గుర్తించారు. వెంకటమ్మ డిసెంబర్ 30 నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఘట్​కేసర్ పోలీసులతో పాటు... ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకటమ్మ ఓ వ్యక్తితో కలిసి ఆటోలో వెళ్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఫొటో సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మైన రాములే ఈ హత్య చేసినట్లు తేల్చారు. రాములు నేర ప్రవృత్తిని చూసే పోలీసులే విస్తుపోతున్నారు. ఈ తరహాలో హత్య చేసే వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదని ఓ పోలీస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆధారాలు లేక సరైన శిక్షపడలేదు

గతేడాది వరకు 17 హత్యలు చేసినప్పటికీ, పోలీసులు క్షేత్రస్థాయిలో సరైన ఆధారాలు సేకరించకపోవడం వల్ల నిందితుడైన రాములుకి న్యాయస్థానంలో సరైన శిక్షలు పడలేదు. నిర్మానుష ప్రాంతాల్లోకి తీసుకెళ్లి మహిళలను హత్య చేయడం, ఆ విషయం బయటికి వచ్చే సరికి మృతుల శరీరాలు కుళ్లిపోవడం వల్ల శాస్త్రీయమైన ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయారు. ఘట్​కేసర్​లో వెంకటమ్మ హత్య కేసులోనైనా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి రాములుకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి : సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 18 దారుణ హత్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.