ETV Bharat / crime

Cheating: పెట్టుబడి పెడితే కమీషన్ అంటూ.. కోటికి ముంచిన అర్చకుడు.!

author img

By

Published : Jul 28, 2021, 6:39 PM IST

Updated : Jul 28, 2021, 7:53 PM IST

పూజలు చేయిస్తే కమీషన్‌ వస్తుంది.. కొంత పెట్టుబడి పెడితే కూర్చున్న చోటే లక్షాధికారులవుతారని నమ్మించిన ఓ పూజారి మహిళలకు శఠగోపం పెట్టాడు. ఒకరికి తెలియకుండా మరొకరు ఇలా ఒకే ఇంటి నుంచి వసూలు చేశాడు. మాయమాటలతో మహిళల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లిలో మండలంలో చోటుచేసుకుంది.

priest cheating in nizamabad
నిజామాబాద్​లో పూజారి చీటింగ్​

నిజామాబాద్​ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రూ.5 వేల నుంచి రూ.25లక్షల వరకు వసూలు చేశాడు. మొత్తం రూ.కోటి పైగా వసూలు చేసి కనిపించకుండా పోయాడు. పెళ్లి కోసం, ప్రసవం గురించి, పిల్లల చదువులు, ఆస్పత్రి ఖర్చుల కోసం.. ఇలా అవసరం కోసం దాచుకున్న సొమ్మును పూజారి చేతిలో పెట్టిన మహిళలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పూజారి చేతిలో మోసపోయాం.. న్యాయం చేయాలంటూ బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ)లోని ఓ ఆలయానికి గతేడాది నవంబరులో శ్రీనివాసశర్మ అనే అర్చకుడు వచ్చాడు. ఆ పూజారికి గ్రామస్థులు అక్కడే ఆశ్రయం కల్పించారు. నోములు, వ్రతాల కోసం వచ్చే మహిళలతో కొన్నాళ్లు ప్రత్యేక పూజలు చేయించాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. గ్రహస్థితి సరిగా లేదు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండటం లేదని వచ్చేవారితో సుమంగళి, నాగపూజలు చేయించేవాడు.

పెట్టుబడి పెడితే కమీషన్​

తనతో ఎన్‌ఆర్‌ఐలు, సినీ పరిశ్రమ వారు, నిర్మాతలు పూజలు చేయించుకొంటున్నారని.. వాళ్లు ఇక్కడికి రాలేరని... వారి పేరుపై చేసే పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్‌ పొందొచ్చని మహిళలను నమ్మించాడు. దీంతో కొందరు మహిళలు పెట్టుబడి పెట్టారు. మొదట్లో వారిని నమ్మించేందుకు రూ.10 వేలు పెడితే రూ.12 వేలు, రూ.15 వేలు పెడితే రూ.20 వేలు ఇవ్వడంతో అందరూ నమ్మారు. కమీషన్‌ డబ్బుల్లోనూ కొంత హుండీలో వేయించాడు. అసలే కరోనా కాలం.. ఏ పని చేద్దామన్నా దొరకట్లేదు... ఇంట్లో ఉండి కమీషన్‌ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని వారికి గాలం విసిరాడు. అది నమ్మి చాలా మంది అత్తకు తెలియకుండా కోడలు.. భర్తకు చెప్పకుండా భార్య.. పెట్టుబడి పెట్టారు. ఇంట్లో తెలియకుండా మహిళలంతా పూజారికి డబ్బులు ఇచ్చారు. అందరి వద్దా అందినకాడికి వసూలు చేసిన ఘనుడు మే 29న కనిపించకుండా పోయాడు. కొద్ది రోజులు ఫోన్ మాట్లాడిన పూజారి.. ఆ తర్వాత ఫోన్ కూడా పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

రూ. లక్షల్లో చీటింగ్​

నిజామాబాద్‌ నగరానికి చెందిన ఓ మహిళ తన భర్తకు అనారోగ్యం ఉందంటూ పూజారిని ఆశ్రయించింది. వారి గ్రహస్థితి బాగా లేదని అర్చకుడు పూజలు చేయించాడు. పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్‌ వస్తుందంటూ ఆశ చూపించాడు. దీంతో భూమి విక్రయించగా వచ్చిన రూ.25 లక్షలు పలు దఫాలుగా ఇచ్చి మోసపోయారు. నందిపేట్‌ మండలం ఆంధ్రానగర్‌కు చెందిన ఓ మహిళ రూ.10 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారు. నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ.6 లక్షలు, బోధన్‌ మండలం పెగడాపల్లికి చెందిన పలువురు స్త్రీలు రూ.లక్షల్లో సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.

రూ. 5 లక్షల వరకు నన్ను మోసం చేశాడు. నా భర్త విషయంలో చిన్న తప్పు చూపించి పూజల పేరుతో నన్ను ముంచాడు. పిల్లల చదువులకు దాచిపెట్టిన డబ్బులు, అప్పులు తెచ్చి మరీ పెట్టాను. సుమంగళి పూజల పేరుతో పెట్టుబడి పెట్టించి.. డబ్బులు కాజేసి ఇప్పుడు పారిపోయాడు. -మాధవి, బాధితురాలు

పనిమనిషి నుంచి కూడా

ఒక్క ధర్మారం(బీ)లోనే 40 మంది వరకు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయినట్లు సమాచారం. మొత్తంగా 50మందికిపైగా ఈ విధంగా అర్చకుడి దగాకు గురయ్యారు. ఆ ఆలయంలోనే పని చేసే ఓ మహిళ తాను దాచుకున్న డబ్బులతో పాటు, గుళ్లో పని చేసినందుకు ఇచ్చిన మొత్తం డబ్బులు రూ. 70వేలు పూజారి చేతిలోనే పెట్టింది. మరొకరు కూతురి ప్రసవం కోసం దాచిన డబ్బుతో పాటు అప్పులు చేసి మరీ పూజారికి ఇచ్చారు. ప్రసవం అయిపోయి బాబుకు ఏడాదిన్నర వయసు వచ్చినా డబ్బులు మాత్రం అందలేదు. అందరి వద్ద నుంచి దాదాపు రూ.కోటి 20లక్షలతో ఉడాయించినట్లు బాధితులు చెబుతున్నారు.

గుడిలో పనిచేస్తూ దాచుకున్న డబ్బులను పూజారి పెట్టుబడి పెట్టించాడు. నా కూతురు ప్రసవం కోసం దాచిన డబ్బులు.. కమీషన్​తో సహా తిరిగి ఇస్తానంటే ఇచ్చాను. ఇప్పుడు బాబు పుట్టి ఏడాదిన్నర గడుస్తున్నా డబ్బు తిరిగి ఇవ్వలేదు. మోసపోయాము. పోలీసులు అతను ఎక్కడున్నా పట్టుకోవాలి. -బాధితులు

కూలీ చేసి సంపాదించిన డబ్బును డిపాజిట్ల పేరుతో మా వద్ద నుంచి కట్టించుకున్నాడు. అడిగితే చెక్కులు ఆలస్యమన్నాడు. కమిటీ వాళ్లకు చెబితే మాకు చెప్పి చేయలేదు.. మీరే చూసుకోండి అంటున్నారు. అందుకే పోలీసులను ఆశ్రయించాం. కమీషన్​ వస్తుందని ఆశ చూపి మాకు మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బు కట్టించుకున్నారు. ఇంట్లో తెలియకుండా డబ్బు కట్టాం. ఇప్పుడు ఎవరికీ మా బాధ చెప్పుకోలేని పరిస్థితి. -సరిత, బాధితురాలు

సిమ్​, నంబరు రెండూ డమ్మీనే

పూజారి చేతిలో మోసపోయిన బాధితుల ఆవేదన

పూజారిగా చేరిన శ్రీనివాసశర్మ.. తన ఊరు, చిరునామా తెలియకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. కరీంనగర్‌లోని ఓ ఆలయంలో ప్రధాన పూజారిగా చేసి ఇక్కడికి వచ్చానంటూ నమ్మించాడు. ఆధార్‌కార్డు ఇతర వ్యక్తిగత గుర్తింపు వివరాలు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కొన్నాళ్లకు ధర్మారం(బీ)కి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. మరొకరు తన పేరుతో సిమ్‌కార్డును తీసిచ్చారు. వారిచ్చిన సెల్‌ఫోన్‌ నంబరుతోనే పరిచయాలు పెంచుకున్నాడు. తీరా సదరు వ్యక్తి కనిపించకుండా పోవడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పారిపోయే ముందు బాధితులకు ఒకరి చెక్కులను మరొకరికి ఇచ్చాడు. తీరా అందరూ ఒకచోట చేరినప్పుడు చెక్కులన్నీ ఒకరివి మరొకరికి ఇచ్చినట్లు గుర్తించారు. సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్​ను కలిసిన బాధితులు.. నిన్న డిచ్​పల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: REVANTH: 'రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు కోరడమే రాజగోపాల్​రెడ్డి చేసిన తప్పా..?'

Last Updated :Jul 28, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.