"మిషన్ భగీరథ'తో నీరు కలుషితమైంది... మేం ఆస్పత్రి పాలయ్యాం"

author img

By

Published : Aug 9, 2021, 12:50 PM IST

కలుషిత నీటితో ప్రజల ఇబ్బందులు

రోడ్డు మరమ్మతుల వల్ల పగిలిన మిషన్ భగీరథ పైపులైన్​లోకి మురుగు నీరు చేరి.. ఆ నీరే సరఫరా అవుతుండటం వల్ల నాగర్​కర్నూల్ జిల్లా కోడేర్ మండలం వడ్డెగుడిసెలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషిత నీరు తాగి విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు.

రోడ్డు మరమ్మతుల వల్ల మిషన్ భగీరథ పైపు పగిలింది. పగిలిన పైపులైన్​లో మురుగు నీరు చేరినా.. అధికారులు పట్టించుకోలేదు. ఆ నీటినే ప్రజలకు సరఫరా చేశారు. కలుషిత నీరు తాగి నాగర్​కర్నూల్ జిల్లా కోడేర్ మండల కేంద్రంలోని వడ్డెగుడిసెలో ఎంతో మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు.

100 కుటుంబాలు నివసిస్తున్న వడ్డెగుడిసెలలో.. 20 రోజుల నుంచి కలుషిత నీటిని తాగి విషజ్వరాల బారినపడ్డారు. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున మంచానికి పరిమితమయ్యారు. విషజ్వరంతో కోడేర్ మండలంలో ఓ మహిళ మృతి చెందింది.

రోడ్డు మరమ్మతులు చేస్తున్నప్పుడు పగిలిపోయిన పైపులైన్​ను కాంట్రాక్టర్లు, అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే పైపుల్లోకి కలుషిత నీరు చేరి.. ఆ నీరే తమకు సరఫరా అవుతోందని వాపోయారు. కలుషిత నీటి వల్ల రోగాల బారిన పడుతున్నామని.. కూలీ చేసుకుని బతికే తమకు ఆస్పత్రిలో వేలకు వేలు ఖర్చు చేసే స్థోమత లేదని అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని భగీరథ పైపులైన్ మరమ్మతు చేయాలని కోరారు.

వడ్డెగుడిసెల ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. త్వరలోనే అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.