ETV Bharat / crime

హైదరాబాద్​లో యథేచ్ఛగా మాదకద్రవ్యాల విక్రయం.. నేరాలకు అదే కారణం!

author img

By

Published : Sep 16, 2021, 10:16 AM IST

రాజధాని మత్తుకు అడ్డాగా మారింది. ఎవరికి కావాలన్నా సులభంగా గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాలు దొరుకుతున్నాయి. ఈ క్రమంలోనే అనేకమంది విచక్షణ కోల్పోయి అత్యాచారం చేసి చిన్నారులను చంపేస్తున్నారు. అతి వేగంగా వాహనాలు నడిపి అనేకమంది చావులకు కారణమవుతున్నారు. సైదాబాద్‌ ఠాణా పరిధిలోని బస్తీలో ఒక చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కూడా గంజాయి తాగి మత్తులోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తేలింది. పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నా కూడా ఒక వైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

heavy-heavy-drug-trafficking-in-hyderabad-from-visakhapatnam
heavy-heavy-drug-trafficking-in-hyderabad-from-visakhapatnam

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం కేంద్రంగా గంజాయి, శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా వివిధ రకాల మత్తుమందులు రాజధానికి చేరుతున్నాయి. వీటిని నిరోధించే బాధ్యత ఎక్సైజ్‌ శాఖదంటూ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలేదు. ఎక్కడినుంచైనా సమాచారం అందితే ప్రత్యేక పోలీసు విభాగాలు దాడులు చేయడం తప్పా... పూర్తిస్థాయి నిఘా ఉండటం లేదు. ఇది వ్యాపారులకు వరంగా మారింది. విశాఖ నుంచి తెచ్చిన దీన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్‌ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో తూతూమంత్రంగా దాడులు చేసి వదిలేస్తున్నారు. కళాశాలల దగ్గర కొకైన్‌ లాంటి అనేక రకాల మత్తుమందుల విక్రయాలు జరుగుతుంటే పోలీసులు దృష్టిసారించడం లేదు. ఎక్కడైనా దొరికినా రెండుమూడు రోజులు హడావుడి చేస్తూ తర్వాత మర్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా వీటిని పొందుతున్నారు. దీనివల్లే అనేకమంది నేరాలు చేయగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

దక్షిణ మండలం పరిధిలో గతంలో స్వాధీనం చేసుకున్న గంజాయి

సెల్‌ వాడకపోతే నిందితున్ని పట్టుకోలేరా!

చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు సెల్‌ఫోన్‌ వాడడని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఘటన జరిగిన ఆరు రోజులైనా నిందితుడిని పట్టుకోలేకపోయాయమని చెబుతున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే సెల్‌ఫోన్‌ వాడకపోతే నిందితులను అరెస్టు చేయడం సాధ్యం కాదా అంటూ అనేకమంది పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఠాణాల పరిధిలో కాలనీల వారీగా పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే ఎటువంటి నేరం చేసిన నిందితులైనా కూడా సులభంగా పట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

మత్తుపదార్థాల వివరాలు

కఠిన చర్యలు తీసుకుంటాం

సైదాబాద్‌ ఘటనలో నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీల వారీగా నిఘా పెట్టాం. మద్యం అలవాటు ఉండటంతో అన్ని దుకాణాల దగ్గర నిఘాను ఏర్పాటు చేశాం. అతణ్ని అరెస్టు చేసి తీరుతాం. భవిష్యత్తులో ఇంటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.

- అంజనీకుమార్‌, సీపీ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌

నేరాల వివరాలు

నిషాలోనే దిశ ఘటన..

రాజధాని పరిధిలో హత్యలు, అత్యాచారాలు, అపహరణ కేసుల సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గినా పూర్తిస్థాయిలో నియంత్రణ కావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు మత్తు కూడా కారణమవుతోందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. మద్యం మత్తులో చాలామంది హత్యలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట శంషాబాద్‌ దగ్గర దిశ అత్యాచారం, హత్య వ్యవహారంలో నిందితులు మద్యం తాగి దారుణానికి ఒడిగట్టారు. విశాఖపట్నం నుంచి వచ్చే వేలాది కిలోల గంజాయి నిల్వలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విరివిగా గంజాయి దొరకడంతో దీన్ని వినియోగించే వారి సంఖ్య భారీగానే పెరుగుతోంది. సైదాబాద్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన చిన్నారి హత్యాచారం ఘటనలో కూడా నిందితుడు గంజాయి తాగాడని పోలీసుల విచారణలో తేలింది.

ఇదీ చూడండి: NCRB: మానవ అక్రమ రవాణాలో రెండు... సైబర్ నేరాల్లో నాలుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.