ETV Bharat / crime

Gang Rape: కాబోయే భర్తను కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం!

author img

By

Published : Jun 21, 2021, 7:45 AM IST

gang-rape-on-women-in-guntur-district
Gang Rape: కాబోయే భర్తను కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

సరదాగా నదీ తీరంలోని ఇసుక తిన్నెలపై సేద తీరుదామని వెళ్లడమే వారి పాలిట శాపమైంది. అక్కడే మాటువేసిన దుండగులు ఒక్కసారిగా మీదపడే సరికి దిక్కుతోచని స్థితి ఎదురైంది. క్రూరత్వం నిండిన దుర్మార్గుల చేతిలో యువతి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైంది. అడ్డుకునేందుకు అవకాశం లేకుండా ఆమె కాబోయే భర్త ముందే అఘాయిత్యం చేసిన తీరు కలచివేసింది. ముఖ్యమంత్రి అధికార నివాసానికి కిలోమీటరున్నర దూరంలోనే జరిగిన ఈ ఘటన భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

కాబోయే భర్త కాళ్లు చేతులను కట్టేసి.. కదిలితే పీక కోసేస్తామంటూ బెదిరించి అతడి కళ్లెదుటే యువతిపై అత్యంత క్రూరంగా ఇద్దరు దుండగులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో.. సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ముఖాన్ని ఇసుకలో కుక్కేసి, ఊపిరాడనివ్వకుండా చేసి పాశవికంగా అకృత్యానికి పాల్పడ్డారు.

ఏపీలోని విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన 20ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిని శిక్షణలో భాగంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలందిస్తున్నారు. శనివారం రాత్రి ఎనిమిదింటికి విధులు ముగిశాక కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్‌ వైపు వచ్చారు. నది లోపలికి వెళ్లి ఇసుక తిన్నెలపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ మాటేసిన ఇద్దరు దుండగులు వీరి కదలికలు గమనిస్తూ వెనుకవైపు నుంచి ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. బ్లేడ్లు చూపుతూ చంపేస్తామని బెదిరించారు. యువకుడిని పక్కకు ఈడ్చేసి బాధితురాలి చున్నీతో కాళ్లు చేతులు కట్టేశారు. బాధితురాలిని ఈడ్చుకెళ్లారు.

మెడపై బ్లేడు పెట్టి

దుండగుల్లో ఒకడు బ్లేడును యువకుడి మెడపై ఉంచి బెదిరించాడు. మరొకడు యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత రెండో దుండగుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాధితులు కేకలు వేసినప్పటికీ ఈ ప్రాంతం రోడ్డుకు దూరంగా ఉండడంతోపాటు చిమ్మ చీకటి కావడంవల్ల ఎవరికీ వినిపించలేదు. యువ జంట వద్దనున్న సెల్‌ఫోన్లు, డబ్బు, బాధితురాలి చెవిదుద్దులు దోచుకొని నిందితులు పారిపోయారు. కొద్దిసేపటికి బాధితులు తేరుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు విషయం తెలుసుకుని తాడేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

gang-rape-on-women-in-guntur-district
నాటు పడవలో పరారీ

బ్లేడ్‌ బ్యాచ్‌ పనేనా

అత్యాచారం చేశాక నిందితులిద్దరూ నాటు పడవలో నదీ మార్గంలో విజయవాడవైపు పారిపోయారు. దీంతో వారు విజయవాడవైపు నుంచి వచ్చిన బ్లేడ్‌ బ్యాచ్‌ అయి ఉంటారని అనుమానిస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న రైల్వే వంతెనలపై నుంచి విజయవాడ మార్గం గుండా బ్లేడ్‌ బ్యాచ్‌ దుండగులు సీతానగరంవైపు నిత్యం వస్తుంటారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి దోచుకుంటారు. తాజా ఉదంతంలోనూ వారే దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత యువకుడితో కలిసి పోలీసులు నదీతీరంలో గాలించారు. అనుమానితులను చూపించారు. బాధిత యువతికి చిత్రాలను ఎప్పటికప్పుడు పంపిస్తూ సమాచారం సేకరించారు.

gang-rape-on-women-in-guntur-district
ఘటనా స్థలంలో నీళ్ల సీసా, చిరిగిన దుస్తులు

అసాంఘిక శక్తులకు అడ్డాగా

ఘటనా స్థలం వద్ద బాధితురాలు తెచ్చుకున్న నీళ్ల సీసా, ఆమె సెల్‌ఫోన్‌ బ్యాక్‌పౌచ్‌, చిరిగిన కొన్ని దుస్తుల ఆనవాళ్లున్నాయి. అక్కడే రెండు బీరు సీసాలూ ఉన్నాయి. తాజాగా అత్యాచారం జరిగిన రైల్వే వంతెన కింది భాగం, సీతానగరం పుష్కర ఘాట్‌ ప్రాంతమంతా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ‘ఈనాడు’ ప్రతినిధి ఆదివారం అక్కడ పరిశీలించగా.. గంజాయి పీల్చుతూ కొందరు, మద్యం తాగుతూ మరికొందరు కనిపించారు.

Gang Rape: కాబోయే భర్తను కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో అనుమానం వచ్చింది..

‘మా అమ్మాయి శనివారం కొంచెం ఆలస్యమవుతుందని ఫోన్‌ చేసి చెప్పింది. రాత్రి 10 అవుతున్నా ఇంటికి రాకపోయేసరికి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె కాబోయే భర్త ఫోనూ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. మాకు భయమేసింది. అర్ధరాత్రి తర్వాత తాడేపల్లి పోలీసు స్టేషన్‌ నుంచి మాకు ఫోన్‌ వచ్చింది. అమ్మాయి ఏడుస్తూ విషయం చెప్పింది. ప్రస్తుతం మా అమ్మాయి గొంతు నొప్పిగా ఉంది. మాట్లాడలేకుంది.

- బాధితురాలి తల్లి

యువకుడిపై అనుమానం లేదన్నారు..

'కాబోయే భర్తపై అనుమానం లేదని బాధితురాలు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. అఘాయిత్యానికి పాల్పడింది బ్లేడ్‌ బ్యాచ్‌ దుండగులా? ఇతరులా? అనేది నిర్ధారణ కాలేదు. నిందితులెవరూ అదుపులో లేరు.'

- ఆరిఫ్‌ హఫీజ్‌, గుంటూరు అర్బన్‌ ఎస్పీ

gang-rape-on-women-in-guntur-district
Gang Rape: కాబోయే భర్తను కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

పోలీసు నిఘా ఏదీ?

సీతానగరం పుష్కర ఘాట్‌ ప్రాంతం, నదీ తీరమంతా నేరగాళ్లకు, గంజాయి ముఠాలు, బ్లేడ్‌ బ్యాచ్‌లకు అడ్డాగా మారిందని తెలిసినా పోలీసు నిఘా లేదు. పుష్కరఘాట్ల వద్దనున్న లైట్లు వెలగవు. రైల్వేకు సంబంధించిన ఓ ఆర్చీని అడ్డాగా చేసుకుని వారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నెల కిందట ఓ గూడ్సు రైలు ఇక్కడ వంతెనపై సిగ్నల్‌ కోసం ఆగింది. అందులో ఓ మహిళా గార్డు ఉన్నారు. బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు దాడి చేసి ఆమె వద్దనున్న బంగారు గొలుసు, డబ్బులు దోచుకున్నారు. తెనాలికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పుష్కరఘాట్‌లో స్నానం చేస్తుండగా గాయపరిచి దోచుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ 2, 3 నెలల్లోనే అనేకం చోటు చేసుకున్నాయి. దిశా యాప్‌కు ఫిర్యాదు చేసినా, డయల్‌ 100కు ఫోన్‌ చేసినా క్షణాల్లో వస్తామని పోలీసులు పదేపదే చెబుతుంటారు. గస్తీ లేని ప్రాంతాల్లో వెనువెంటనే అక్కడికి చేరుకోవడమెలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదీ చదవండి: ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం..50 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.