టాటూల్లా ఉంటాయనే కొరికాం.. అతను రెచ్చగొట్టడం వల్లే లైంగికదాడి.!

author img

By

Published : Jun 11, 2022, 11:32 AM IST

Updated : Jun 12, 2022, 9:14 AM IST

Jubilee Hills Gang Rape Case

Jubilee Hills Gang Rape Case : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్‌ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణలో భాగంగా ఐదుగురు మైనర్లను కస్టడీలోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సేకరించేపనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే నిందితులకు పోలీసులు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లకు ఉస్మానియా ఆసుపత్రిలో ఈరోజు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించారు. వాటి వివరాలను పోలీసులు నేరాభియోగపత్రంలో దాఖలు చేయనున్నారు. పరీక్షల అనంతరం నిందితులను నేరుగా జూబ్లీహిల్స్ పీఎస్​కు తరలించి.. ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటనను పోలీసులు లోతుగా విచారిస్తున్నకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. బెంజ్‌ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు, చిత్రాలను సామాజిక మాధ్యమాలకు చేరవేసిన మరో ఇద్దరు మైనర్లను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. జువెనైల్‌ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను వేర్వేరు వాహనాల్లో శనివారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో వారికి లైంగిక పటుత్వ పరీక్షలు చేశారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. విచారణాధికారి, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ వారిని వేర్వేరుగా ప్రశ్నించారు. శుక్రవారం ముగ్గురు మైనర్లను విడివిడిగా, కలిపి విచారించగా నోరు మెదపని విషయం తెలిసిందే. రెండోరోజు విచారణలో నిందితులంతా ఒకే రకమైన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

మైనర్లు ఏం చెప్పారంటే..

‘‘జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలోకి కారును తీసుకెళ్లి నిర్జన ప్రాంతంలో నిలిపాం. అనంతరం ఒకరి తరువాత ఒకరం అత్యాచారానికి పాల్పడ్డాం. బాలిక మెడపై టాటూల్లా ఉంటాయనే ఆలోచనతోనే పళ్లతో కొరికాం. ఆమె ప్రతిఘటించడం వల్లే గాయాలయ్యాయి’’ అని మైనర్లందరూ అంగీకరించారని తెలిసింది. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ ప్రోద్బలంతోనే తాము అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పినట్టు సమాచారం. సాదుద్దీన్‌ మాత్రం ఎమ్మెల్యే కుమారుడే తొలుత బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పినట్లు తెలిసింది. దాదాపు గంట పాటు విచారించిన పోలీసులు సాయంత్రం మైనర్లను తిరిగి జువెనైల్‌ హోంకు తరలించారు.

ఎమ్మెల్యే కుమారుడి ప్రత్యేక విచారణ

నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కుమారుణ్ని పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. బెంజ్‌ కారులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారు... మధ్యలో సీట్లు ఎక్కడ మారారనే విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇన్నోవా కారులో ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే ఎందుకు దిగారంటూ ప్రశ్నించారు. శనివారం కస్టడీ గడువు ముగిసిన అనంతరం నిందితులను గుర్తించేందుకు పోలీసులు నిర్వహించే టీఐపీ (టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌) కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తద్వారా కోర్టులో నిందితులతోపాటు మరికొందరిని చేర్చి బాలికను తీసుకెళ్లి నిందితులను గుర్తించే ప్రక్రియను చేపట్టనున్నారు.

ఇప్పటికే బాలిక మెడికల్​ రిపోర్టులు పోలీసులకు చేతికి అందగా.. అందులో బాధితురాలికి గాయాలైనట్టు నిర్ధరించారు. బాధితురాలి మెడతో పాటు శరీరంలో అక్కడక్కడ గోర్లతో రక్కిన గాయాలున్నట్టు వైద్యులు నివేదికలో తెలిపారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. అత్యాచారం జరిగిన సమయంలో నిందితులు బాలికను గాయపర్చినట్లు పోలీసులు నమోదు చేసుకున్నారు. ఈ గాయాల గురించి కూడా నిందితులను ప్రశ్నించారు. ఎవరు గాయాలు చేశారనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. మైనర్లు మాత్రం పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదు.

Last Updated :Jun 12, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.