Tragedy: తొలిరోజు బడికిపోయిన బిడ్డ... తిరిగిరాలేదు!

author img

By

Published : Sep 3, 2021, 12:48 PM IST

Tragedy, girl died in school

మహబూబ్​నగర్ జిల్లా కందూరు ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. బడికి పోయిన మొదటి రోజే... ఐదేళ్ల బాలిక తిరిగిరాని లోకాలకు పోయింది. తమ గారాలపట్టీ బడికిపోతే మురిసిపోయిన ఆ తల్లిదండ్రులు.. విగతజీవిగా ఉన్న చిన్నారిని చూసి గుండెలవిసేలా విలపిస్తున్నారు.

మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలోని నీటిసంపులో పడి ఐదేళ్ల బాలిక మృత్యువాత పడింది. కందూరు గ్రామానికి చెందిన షమీమా బేగం, రఫీక్ దంపతుల ఐదేళ్ల కూతురు షరీషా... గురువారం పాఠశాలకు వెళ్లింది. బడికి వెళ్లిన పాప ఎంతకీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు... సాయంత్రం నుంచి రాత్రి వరకూ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. గ్రామంలో ఎక్కడా కనిపించకపోయే సరికి తెల్లవారుజామున బడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికేందుకు పాఠశాలకు వెళ్లారు. అక్కడ నీటి సంపు తెరిచి ఉంది. అందులో చూడటంతో పాప మృతదేహం బైటపడింది.

మధ్యాహ్న భోజన సమయంలో చేయి కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడినట్లుగా అంచనా వేస్తున్నారు. బడికి వెళ్లిన మొదటిరోజే... అమ్మాయికి చివరిరోజు కావడంతో గ్రామంలో, పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. తహసీల్దార్, ఎంపీడీవోలు... సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంపును మూసి ఉంచేలా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: AGENCY PROBLEMS: సరుకులు కొనాలంటే.. ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.