ETV Bharat / crime

ఆసుపత్రిలో బాలింత మృతి.. బంధువుల ఆందోళన

author img

By

Published : Jun 25, 2021, 8:31 AM IST

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందున్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ఆసుపత్రిలో బాలింత మృతి
ఆసుపత్రిలో బాలింత మృతి

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని మోతీనగర్‌కు చెందిన మణెమ్మ నిండు గర్భిణి. ప్రసవం కోసం ఈ నెల 22న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్‌ నేపథ్యంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం... వైద్యులు గురువారం మధ్యాహ్నం ప్రసవం చేశారు. పండంటి బాబుకు జన్మనిచ్చిన మణెమ్మ.. ఉన్నట్లుండి ఆనారోగ్యానికి గురై మరణించింది

బాలింత మృతి పట్ల మహిళ బంధువులు డాక్టర్లను నిలదీయడంతో... సీనియర్‌ వైద్యులతో మాట్లాడాలని సూచించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి... మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు.

ఆగ్రహించిన బంధువులు హైదరాబాద్‌-రాయ్‌చూర్‌ అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులు మృతదేహం ఉన్న అంబులెన్స్‌ను తిరిగి ఆసుపత్రిలోకి పంపించారు. అనంతరం రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు.

ఇదీ చదవండి: Door Curtain: బాలుడి మెడకు చుట్టుకున్న డోర్​ కర్టెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.