ETV Bharat / crime

Fake Certificates Gang: లక్ష ఇస్తే బీటెక్ సర్టిఫికెట్.. ఏడుగురు సభ్యుల గ్యాంగ్​ అరెస్ట్​..

author img

By

Published : Feb 15, 2022, 6:50 PM IST

Updated : Feb 15, 2022, 7:15 PM IST

Fake Certificates Gang: నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని నివారించడానికి డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Fake Certificates Gang arrested in hyderabad
Fake Certificates Gang arrested in hyderabad

లక్ష ఇస్తే బీటెక్ సర్టిఫికెట్.. ఏడుగురు సభ్యుల గ్యాంగ్​ అరెస్ట్​..

Fake Certificates Gang: ఇతర రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన డిగ్రీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోపాల్​లోని సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ ఆచార్యుడితో పాటు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్న శ్రీకాంత్, మహేశ్వర్, ఏడుగురు విద్యార్థులను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

సర్టిఫికెట్లకు లక్షలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీకాంత్.. దిల్​సుఖ్​నగర్​లో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల వివరాలు సేకరించి... వాళ్లకు ఫోన్ చేసి ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు ఇస్తానని ఆకర్షిస్తాడు. ఆ తర్వాత ఒక్కో డిగ్రీ సర్టిఫికెట్​కు కనీసం లక్ష రూపాయలు వసూలు చేసి బీటెక్, పీజీ, డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. దుబ్బాకలోని రామక్కపేటకు చెందిన మహేశ్వర్ సైతం అత్తాపూర్​లో ప్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. గత ఐదేళ్లుగా ఇతను కూడా బోపాల్​లోని స్వామి వివేకానంద విశ్వవిద్యాలయం, సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ ఆచార్యుడు కేతన్​సింగ్ సహకారంతో శ్రీకాంత్, మహేశ్వర్ సర్టిఫికెట్లను విద్యార్థులకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఫేక్​ సర్టిఫికెట్ల నివారణకు ప్రత్యేక బృందం..

ఈ తరహా సర్టిఫికెట్ల వల్ల ఏళ్ల పాటు చదివి ఉత్తీర్ణులైన ప్రతిభ గల విద్యార్థులకు నష్టం జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్​ తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇలాంటి కన్సల్టెన్సీలు ఇంకా ఉన్నాయని.. వీటిని నివారించడానికి డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

"ఉన్నత విద్యను భ్రష్టు పట్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారు. నకిలీ పట్టాలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. శ్రీసాయి ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీని శ్రీకాంత్‌ నిర్వహిస్తున్నాడు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో డిగ్రీ సర్టిఫికెట్‌కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులను అరెస్ట్ చేశాం. భోపాల్‌ సర్వేపల్లి రాధాకృష్ణ వర్సిటీ నుంచి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతన్ సింగ్ సాయంతో ఈ తతంగం జరుగుతోంది. వర్సిటీకి చెందిన ఇతర ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాం. బీటెక్ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు లక్షల్లో డబ్బులు ఇచ్చారు. తీసుకున్న వాటిలో 30 శాతం డబ్బులు శ్రీకాంత్ తీసుకున్నట్లు గుర్తించాం. 70శాతం డబ్బులు కేతన్ సింగ్‌కి ఇచ్చినట్లు తేలింది. కేతన్‌సింగ్‌తో మహేశ్వర్‌ కూడా చేతులు కలిపాడు." - సీపీ ఆనంద్​, సీపీ

ఇదీ చూడండి:

Last Updated :Feb 15, 2022, 7:15 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.