ప్రియుడి మోజులో పడి.. కన్న తండ్రిపైనే బాలిక హత్యాయత్నం!

author img

By

Published : Jan 22, 2023, 10:44 AM IST

knife

Daughter Attack on Father: నేటి యువత ప్రేమ అనే ఉచ్చులో చిక్కి కన్నతల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. యువతనే కాకుండా బాల బాలికలు కూడా ప్రేమ అనే మాయలో పడి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో 17 ఏళ్ల బాలిక ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిపై చాకుతో దాడికి పాల్పడింది.

Daughter Attack on Father: ప్రియుడి మాయలో పడి ఓ బాలిక కన్న తండ్రిపై చాకుతో దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ నగరంలో చోటు చేసుకుంది. నాలుగో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కుమారుడు, కుమార్తె (17) ఉన్నారు. కుమార్తె ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది.

ఆమెకు నగరంలోనే ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్న బాలుడి (17)తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారడంతో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలిక తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను బాలుడికి ఇచ్చింది. విషయం తండ్రికి తెలిసి కుమార్తెను.. నిలదీయడంతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె ప్రియుడికి చెప్పింది.

తన దగ్గర డబ్బులేదని, నీవే ఏదో ఒకటి చేయాలని బాలుడు సూచించాడు. బాలిక శుక్రవారం రాత్రి వంట గదిలోని చాకు తీసుకుని తండ్రి మెడపై పొడవబోయింది. ఆ అలికిడికి తండ్రి మేల్కొని పక్కకు జరగడంతో వీపునకు చాకు తగిలి గాయమైంది. శనివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను.. అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

బాలుడికి మరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆమె ప్రోద్బలంతోనే డబ్బు కాజేశారని దాడికి పాల్పడిన బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. తనను మోసం చేసి నగదు కాజేశారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడిపై కేసు నమోదు చేశామని, బాలికను జువైనల్‌ హోంకు తరలిస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.