ETV Bharat / crime

రూ.500 ఇచ్చి.. రూ.2.50 లక్షలు దోచేశారు.. ఎలాగంటారా..?

author img

By

Published : Oct 9, 2022, 12:47 PM IST

Cyber Fraud in Sangareddy: ఈ రోజుల్లో అదనపు ఆదాయం కోసం ఎన్నో కొత్తపుంతలు తొక్కుతున్నారు. రకరకాల మార్గాల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కనిపించిన అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదు. నమ్మి మోసపోకూడదు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇలాగే అదనపు ఆదాయం కోసం ఆన్​లైన్​లో వెతికి ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే..?

Cyber criminals
సైబర్​ నేరగాళ్లు

Cyber Fraud in Sangareddy: అదనపు ఆదాయం కోసం ఆన్​లైన్​లో వెతికిన​ ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి నుంచి రూ.2.5 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధి డీఎన్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్.. గచ్చిబౌలి ఇన్ఫోసిస్​లో అడ్మిన్​గా పని చేస్తున్నాడు. అయితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయ సంపాదన కోసం ఆన్​లైన్​లో ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఫేస్​బుక్​లో ఉన్న ఓ లింక్​ను ఓపెన్ చేశాడు. అంతే.. వెంటనే వాట్సాప్ ఓపెన్ అయి.. మెయిల్​ ఐడీ, ఫోన్​ నెంబర్​ తెలపాలంటూ ఓ మెసేజ్​ ఉంది. అందులో ఉన్నట్లుగానే శ్రీనివాస్​ తన మెయిల్​ ఐడీ, ఫోన్​ నెంబర్​ తెలిపాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి సూచించిన ఓ పోర్టల్​లో లాగిన్ అయ్యాడు.

ఆ తర్వాత వారు సూచించిన మేరకు రూ.500 వేసి ఓ గేమ్​ ఆడితే.. రూ.500 గెలుచుకున్నట్లు శ్రీనివాస్​ ఖాతాకు నగదు పంపారు. దీంతో నమ్మకం పెరిగిన శ్రీనివాస్.. అప్పటి నుంచి పలు దఫాలుగా వారు సూచించిన మేరకు రూ.2.5 లక్షలు జమ చేసి పలుమార్లు గేమ్​ ఆడాడు. అయితే రూ.6.53 లక్షలు ఆదాయం వచ్చినట్లు పోర్టల్​లో చూపింది కానీ ఇతని ఖాతాకు నగదు రాకపోవడంతో అనుమానం వచ్చి గేమ్​ ఆడటం ఆపేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.