ETV Bharat / crime

సైబర్ నేరగాళ్ల 'బ్రాండెడ్' దోపిడీ... నకిలీ యాప్​లతో బురిడీ!

author img

By

Published : Mar 30, 2022, 10:10 PM IST

Cyber Crime
Cyber Crime

Cyber Crime With Fake Apps: చాలా కంపెనీలు తమ సేవల వినియోగం కోసం ప్రత్యేకంగా యాప్‌లను రూపొందిస్తాయి. దీన్ని కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ యాప్‌లు తయారు చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అసలైన కంపెనీల తరహాలోనే కాల్‌ సెంటర్‌ సిబ్బందిని నియమించుకుని మరీ డబ్బు దోచేస్తున్నారు. ఇంకొందరు బిట్‌కాయిన్లలో పెట్టుబడుల పేరిట శఠగోపం పెడుతున్నారు.

Cyber Crime With Fake Apps: సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో నేరాలు చేస్తున్నారు. వినియోగదారుల బలహీనలతలను అవకాశంగా తీసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ పేర్లతో నకిలీ యాప్‌లు తయారు చేసి జనం సొమ్ము కాజేస్తున్నారు. ఒకరు పెట్టుబడి పేరుతో.. మరొకరు బుకింగ్‌ల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. సైబర్ మాయలో పడేస్తున్నారు. ఓలా సంస్థ ఇటీవల స్కూటర్​ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇది అందరికీ దొరకటం లేదు. ఇదే అదనుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ సృష్టించారు.

కస్టమర్ కేర్ పేరుతో కాల్... ఆపై..

అసలు కంపెనీ యాప్‌ తరహాలోనే స్వల్ప మార్పులతో యాప్‌ తయారు చేసి జాతీయ బ్యాంకులో ఖాతాలు సృష్టించారు. అమాయకుల నుంచి బుకింగ్, ఇన్సూరెన్స్, డెలివరీల పేరిట వేలకు వేలు గుంజేస్తున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి కస్టమర్‌ కేర్‌ పేరుతో కాల్ వస్తుంది. బుకింగ్ అమౌంట్‌, డౌన్‌ పేమెంట్‌ పేరుతో రూ.20 వేల వరకూ గుంజుతారు. ఆ సొమ్ము అందాక.. సేల్స్ మేనేజర్‌ పేరుతో ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ వస్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ రుసుం పేరిట మరో రూ.20 వేల వరకూ వసూలు చేస్తారు. వినియోగదారుడు తాను మోసపోయానని గుర్తించే వరకూ అలా ఏదో ఒక పేరు చెప్పి డబ్బు గుంజుతూనే ఉంటారు. వినియోగదారుడు గట్టిగా నిలదీస్తే.. వెంటనే ఫోన్లు స్విచ్చాఫ్‌ అయిపోతాయి.

తస్మాత్‌ జాగ్రత్త...

ఏపీలోని విజయవాడకు చెందిన కొండేటి శశికుమార్ అనే యువకుడు ఇలా నకిలీ యాప్‌లో పేరు నమోదు చేసుకుని విడతల వారీగా రూ.38 వేలకు పైగా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో తాము వసూలు చేసిన మొత్తానికి ఓ బిల్లు పంపించి.. ఆ తర్వాత ఫోన్‌ ఎత్తటం మానేశారు. ఇదే తరహాలో పలు కంపెనీల యాప్‌లను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుని డబ్బు గుంజుతున్నారని.. ఇలాంటి యాప్‌ల పట్ల అప్రమత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకొందరు సైబర్ నేరగాళ్లు షేర్ మార్కెట్, బిట్ కాయిన్స్ పేరిట నకిలీ యాప్‌లు తయారు చేసి పెట్టుబడి పెడితే త్వరగా లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. పెట్టుబడుల రూపంలో డబ్బు గుంజి.. కొన్ని రోజుల తర్వాత యాప్‌లను మూసేస్తున్నారు.

పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఏవైనా యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలని.. సైబర్ నిపుణులు చెబుతున్నారు. యాప్‌లు డౌన్​లోడ్ చేసుకోమని వచ్చే మెస్సేజ్​లను క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే వినియోగదారులూ.. తస్మాత్‌ జాగ్రత్త.

ఇదీ చదవండి: Chain Snatcher Arrest: సింగం-3 సీన్​ రిపీట్​.. విమానంలో ఉన్న గొలుసుదొంగ అరెస్ట్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.