''నేను నీకు తోడుగా ఉంటా.. కలిసి బతుకుదాం.. నువ్వు, నేను, బాబు అంతే.. ఎక్కడికైనా వెళ్లి సంతోషంగా గడుపుదాం..'' అని మాయమాటలు చెప్పాడు. బస్టాండ్కు తీసుకెళ్లాడు. ఆమె వద్ద ఉన్న నగలను తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులు తీసుకుని ఇప్పుడే వస్తా... అని వివాహితను, బాబును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె ఆ వ్యక్తి కోసం... ఎదురు చూసిన తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించింది. ఇక చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది.
అసలు ఏం జరిగిందంటే...
నిర్మల్ జిల్లా బాసర మండలం ఎంచ గ్రామానికి చెందిన సాయిలు, లక్ష్మి దంపతులు. వీరికి మూడు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు సాయిలు.. గత రెండు సంవత్సరాల క్రితం దుబాయికి వెళ్లాడు. ఈ క్రమంలో గతేడాది లింబ గ్రామానికి చెందిన పాపన్నతో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. పాపన్న కూడా ఆమెను ఇష్టపడ్డాడు. దీనితో పాపన్న ఆమెకు తోడుగా ఉంటానని మాయమాటలు చెప్పాడు. ఎక్కడికైనా వెళ్లిపోదామని నమ్మబలికాడు. పాపన్న లక్ష్మిని తీసుకుని గత మూడు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి తీసుకువచ్చాడు. స్నేహితుడి ఇంట్లో రెండు రోజులు గడిపారు.
గురువారం ఉదయం పాపన్న... లక్ష్మిని, ఆమె కుమారుడిని కామారెడ్డికి తీసుకువచ్చాడు. ఆమె చెవి కమ్మలు తాకట్టు పెట్టించాడు. వాటికి 9వేల రూపాయలు రావడంతో... అనంతరం కామారెడ్డి బస్టాండ్కు వచ్చారు. లక్ష్మి వద్ద ఉన్న డబ్బులను, ఆమె సెల్ఫోన్ను తీసుకుని బయటకు వెళ్లి వస్తా అని.. వెళ్లిపోయాడు. సుమారు గంట పాటు పాపన్న కోసం.. బాబుతో బస్టాండ్లో ఎదురుచూసింది. అయినా తిరిగి రాలేదు. దీనితో మోసపోయినట్లు గ్రహించిన లక్ష్మి.. కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించింది.
నన్ను బస్టాండ్లో ఉండు... ఇప్పుడే వస్తా అని చెప్పాడు. నా దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ తీసుకున్నాడు. ఓ 500 రూపాయలు ఇస్తా అంటే... నేనే వద్దు అన్నాను. కానీ నన్ను నిండా ముంచి వెళ్లాడు. నన్ను, నా కొడుకును ఆగం చేసి పోయిండు.
- బాధిత మహిళ