ETV Bharat / crime

మహిళలను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Apr 21, 2021, 7:27 AM IST

accident
కారు ప్రమాదం

ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనాల వేగానికి కళ్లెంపడడంలేదు. రోడ్డు దాటుతున్న మహిళా కూలీలను అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు కబళించింది. అది ఎంత వేగంతో దూసుకువచ్చిందంటే.. ఇద్దరు మహిళల మృతదేహాలు వంతెన పైనుంచి కిందకు ఎగిరిపడ్డాయి. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చలివేంద్రిగూడ బైపాస్‌ కూడలి వంతెన వద్ద మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మదనపల్లి పాత తండాకు చెందిన వర్త్య లాలీ (25), వర్త్య సక్కు (24) అల్లికోల్‌ తండాకు చెందిన పాత్లావత్‌ అరుణ (40) బైపాస్‌ రోడ్డు పక్కన ఓ వెంచర్‌లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం పని అయిపోయాక ఇంటికి వెళ్లే క్రమంలో వంతెనపై రోడ్డు దాటుతుండగా షాద్‌నగర్‌ వైపు నుంచి అతివేగంతో దూసుకువచ్చిన కారు వారిని ఢీకొంది.

ఇద్దరు మహిళలు వంతెనపై నుంచి కింద పడగా ఒకరు రోడ్డు డివైడర్‌ వద్ద ఎగిరిపడ్డారు. ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. కారు నాగర్‌కర్నూల్‌వాసికి చెందినదిగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలైన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: జోనల్‌ వ్యవస్థకు ఆమోదంతో తదుపరి ప్రక్రియపై సర్కారు దృష్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.