మహిళను వివస్త్రను చేసి.. వీధుల్లో తిప్పుతూ.. సభ్యసమాజం సిగ్గుపడేలా...

author img

By

Published : Aug 30, 2021, 7:13 AM IST

Updated : Aug 30, 2021, 1:47 PM IST

brutally-attack-on-a-woman-in-suryapet-district

మహిళ అని చూడకుండా.. వివస్త్రను చేసి... కళ్లల్లో కారం పోసి... వీధుల్లో తిప్పుతూ.. కర్రలతో దాడి చేసిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఇంత ఘోరం కళ్ల ముందు జరుగుతున్నా... కనీసం ఆపడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. అంటే ఎలాంటి చేతకాని వాళ్ల మధ్య మనముంటున్నామో అర్థం చేసుకోవాల్సిన ఘటన ఇది.

హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను మృతుని కుటుంబ సభ్యులు ప్రతీకారంతో గ్రామంలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి కర్రలతో కొట్టారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. సూర్యాపేట మండలం రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యాడు. ఆ ఊరికే చెందిన బాధితురాలు హత్య కేసులో ఒక నిందితురాలిగా అరెస్టయ్యారు. శంకర్‌నాయక్‌ బంధువులతో ఆమెకు పాతకక్షలున్నాయి.

బాధితురాలు ఇటీవల బెయిలుపై విడుదలై సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంటున్నారు. రాజునాయక్‌ తండాకు చెందిన బంధువొకరు శనివారం మృతిచెందడంతో ఆ మహిళ అక్కడికి వెళ్లారు. శంకర్‌నాయక్‌ హత్యానంతరం మొదటిసారిగా తండాకు వచ్చిన ఆమెను చూసి.. మృతుని బంధువులు కోపోద్రిక్తులయ్యారు. వెంటనే ఆమెపై దాడి చేయడం ప్రారంభించారు. ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం పోసి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో తిప్పారు.

ఒక్కరూ కూడా ఆపలేదు

నడిరోడ్డులో దాదాపు గంటసేపు జరిగిన ఈ అమానుషాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ... ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమెకు దుస్తులిచ్చి గదిలో రక్షణ కల్పించారు. విషయం తెలిసి పోలీసులు తండాకు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లునావత్‌ భారతి, బానోతు జ్యోతి, లునావత్‌ పద్మ, జ్యోతి, సునీత, పింప్లి, రాజేష్‌, సుప్రియ, కిషన్‌, మరో బాలిక తనపై దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్పంచి, గ్రామపెద్దలు చూస్తున్నా అడ్డుకోలేదని పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రాజునాయక్​ తండాకు చెందిన ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్​కు తరలించారు.

భయమో..! నిర్లక్ష్యమో..!

ఎక్కడైనా చిన్న ఘటన జరిగితే దాని రికార్డు చేసి... సోషల్​ మీడియాలో పోస్టులు చేసి తమ బాధను వ్యక్తం చేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ కళ్ల ముందు ఎంతటి ఘోరాలు జరుగుతున్నా... ఎదురు తిరిగి ఆపడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించట్లేదు. మాకేమి జరుగుతుందో అనే భయమో.. మాకెందుకులే అనే నిర్లక్ష్యమో. కళ్లముందు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఆపేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి ఘటనలు ఆగుతాయని చెప్పలేము కానీ... వాటి ప్రభావం మాత్రం ఎక్కువగా ఉండదనేది వాస్తవం.

ఇదీ చూడండి: Cruel Mother: పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?

Last Updated :Aug 30, 2021, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.