ETV Bharat / city

గుజరాత్‌కు కూడా తెలంగాణ డబ్బులే ఖర్చు పెడుతున్నారు: కేటీఆర్

author img

By

Published : Apr 21, 2022, 3:56 AM IST

KTR Warangal Tour: కేంద్రానికి తెలంగాణ నుంచి పన్నుల ద్వారా వెళ్లిన నిధులే ఎక్కువ అని... రాష్ట్రానికి వచ్చిన నిధులు మాత్రం తక్కువ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో తప్పున్నట్లు భాజపా నేతలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక రోజు పర్యటనలో భాగంగా హనుమకొండ, వరంగల్, నర్శంపేటల్లో 236 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

KTR
KTR

KTR Warangal Tour: ‘‘కేంద్రానికి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపేణా చెల్లిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.68 లక్షల కోట్లే. ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా’’ అని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మచిలీపట్నం నుంచి నర్సంపేట మీదుగా గుజరాత్‌ వెళ్తున్న గ్యాస్‌ పైపులైన్‌ నుంచి రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా చౌక ధరకు ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం గ్యాస్‌ బండ ధరను భారీగా పెంచిందని మండిపడ్డారు. బుధవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ, నర్సంపేటలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పది గంటలకుపైగా సాగిన ఆయన పర్యటనలో ప్రధాని మోదీ, రాష్ట్ర భాజపా ఎంపీలపై ఘాటైన విమర్శలు చేశారు. వరంగల్‌ నగరంలో రూ.196 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. స్మార్ట్‌ లైబ్రరీ, స్మార్ట్‌ రోడ్లను, పబ్లిక్‌గార్డెన్‌లో స్మార్ట్‌సిటీ పథకం కింద చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించారు. నర్సంపేటలో రూ.43.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్సంపేట, హనుమకొండ కార్యకర్తల సభల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసింది గుండు సున్నా అని.. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ వంటి విభజన హామీలను తుంగలో తొక్కిన పార్టీ భాజపా అని ధ్వజమెత్తారు.

పొత్తిళ్లలో పసిగుడ్డులా ఉన్న తెలంగాణను ఆనాడు కేంద్రం కాళ్లతో తన్నింది..
రాష్ట్రంలో ఉన్న నలుగురు భాజపా ఎంపీలు అసలు ఒక్కసారైనా ప్రధాని మోదీని నేరుగా కలిశారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. వారు రాష్ట్రానికి చేసింది శూన్యమని అన్నారు. పొత్తిళ్లలో పసిగుడ్డులా ఉన్న తెలంగాణను ఆనాడు కేంద్రం కాళ్లతో తన్నిందని, భద్రాద్రి రాముడి పక్కనున్న ఏడు మండలాలను ఆంధ్రలో కలిపింది మోదీ కాదా అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌కు ఆనాడు అంగబలం, అర్థబలం ఏమీ లేకున్నా కేవలం గుండె నిబ్బరంతో రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి గొప్ప వ్యక్తిపై ఇప్పుడు కొందరు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాలమూరులో పాదయాత్ర చేస్తూ పెద్ద మాటలు మాట్లాడుతున్న సంజయ్‌ అసలు కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న తీరుగా ఆయన వ్యవహారం ఉంది.

ఎమ్మెల్యేలు ఆగం కావొద్దు... తెరాస ఎమ్మెల్యేలు అనేక అభివృద్ధి పనులు చేయాలంటూ వినతి పత్రాలు పట్టుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడే అన్ని పనులు చేస్తే వచ్చేసారి అధికారం చేపట్టాక ఏం చేస్తాం? ఒకరిద్దరికి సంక్షేమ పథకాలు అందకపోతే మీడియా పనిగట్టుకొని రాస్తోంది. ఆ మాటలు పట్టుకొని ఎమ్మెల్యేలు ఆగం కావొద్దు. ప్రజలకు మనం చేసిన సంక్షేమం వివరించాలి’’ అని సభల్లో కేటీఆర్‌ ఉద్బోధించారు. సుడిగాలి రావడంతో హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో తెరాస ప్రతినిధుల సభా ప్రాంగణంలో మధ్యాహ్నం టెంట్లు కూలాయి. ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, నన్నపనేని నరేందర్‌ పర్యవేక్షణలో వాటినితొలగించి సభనిర్వహణకు ఏర్పాటు చేశారు.

ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఎక్కడ?.. కాంగ్రెస్‌ పార్టీ అయితే పూర్తిగా చచ్చిపోయింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు? కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల కష్టం అర్థం చేసుకొని రైతుబంధు, ఆసరా పింఛన్లు, మిషన్‌భగీరథ, కల్యాణలక్ష్మి లాంటి పథకాలెన్నో తెచ్చారు. ప్రతి సంక్షేమ పథకంలో ప్రజలు కేసీఆర్‌ను చూసుకుంటున్నారు.

కిషన్‌రెడ్డివి వట్టి కోతలే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోందని, నిరంతరం అనింటా దారుణమైన వివక్షను చూపుతోందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు బుధవారం ట్విటర్‌లో విమర్శించారు. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధాని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శంకుస్థాపన చేశారు. దానిని రాష్ట్రానికి తేవడంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. ఆయన దానిని తెలంగాణలో ఏర్పాటు చేస్తామంటూ కోతలు కోశారు. ఆయన మాటలు విని రాష్ట్రానికి అదైనా వస్తుందనుకున్నాం. కానీ, చివరికి దాన్ని కూడా ‘గుజరాత్‌ ప్రధాని’ తన రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు తీసుకెళ్లారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష ధారావాహికలా కొనసాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, 2 ఐఐఎస్‌ఈఆర్‌లు 16 ఐఐటీలు, 4 ఎన్‌ఐడీలు, 157 ప్రభుత్వ వైద్యకళాశాలలు, 84 నవోదయలు మంజూరు చేసినా అందులో తెలంగాణకు ఒక్కటీ రాలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు మొండిచేయి చూపారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదు’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:టీఎస్‌బీపాస్‌ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.