ETV Bharat / city

'ఎలా జరిగే నా పండగ... ఎలా జరుగుతుందో చూడు మూషికా....'

author img

By

Published : Aug 22, 2020, 5:26 PM IST

ganesh reaction on today festival
ganesh reaction on today festival

పెద్ద పెద్ద మండపాలు... భారీ విగ్రహాలు... విద్యుత్​ దీపాలతో అలంకరణలు... భక్తిపాటలతో హోరెత్తే వీధులు... ఇవేవీ ఈ రోజు కన్పించట్లేదు. ఎంతో సందడిగా... ఆడంబరంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఇలాంటి దృశ్యాలు చూసి మరి ఆ గణపయ్య, మూషికం ఎమనుకుకంటున్నారో మనమూ విందాం రండి..

మూషికం చాలా దిగాలుగా ఉంది. వినాయకుడు మరో వైపు తాపీగా భూ లోకాన్ని గమనిస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అంతలో ఎలుకవైపు చూసి అంతరంగాన్ని లంబోదరుడు పసిగట్టేశాడు. ‘ఏమిటీ ఎలుక రాజా.. అలకా?’ అంటూ పలకరించాడు. ‘నా మనసేమీ బాలేదు స్వామీ. నన్నిలా మౌనంగా ఉండనీయండి’ అంటూ మూతి ముడుచుకుంది. ‘నీ బాధను నేను అర్థం చేసుకోగలను. పైకి సంతోషంగా ఉన్నా నాక్కూడా బాధగానే ఉంది’ అంటూ లంబోదరుడు తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘అవును స్వామీ! ఈ పాటికి ఎంత సందడి ఉండేది? మిమ్మల్ని మోసుకొని కైలాసం నుంచి భూలోకం వరకు నేను ఒక్క పరుగున తీసుకెళ్లడం, అక్కడ మనకు వీధి వీధి ఘన స్వాగతం పలికేవారు. పూజలు, లడ్డూ నైవేద్యాలు, ఊరేగింపులు, చివర నిమజ్జనం నాడైతే చెప్పలేనంత హడావుడి. కానీ ఈ సంవత్సరంలో అదేదో కరోనా మహమ్మారి అంట! మనకు వీధుల్లో చోటు లేకుండా చేసింది. మానవులకు సందడి లేకుండా ఆ మహమ్మారి మాటువేసింది. ఇది చాలదన్నట్టు వరదలు అతలాకుతలం చేశాయి. ఊళ్లు ఏర్లయ్యాయి.. రహదారులు నదులుగా మారాయి. జల ప్రళయం జనాన్ని భయపెడుతోంది’ అంటూ ఎలుక సమస్యల నామావళి చదవడం మొదలుపెట్టింది. వినాయకుడు అడ్డుతగిలి.. ‘ఆగాగు.. ఈ కష్టాలన్నింటికీ మానవుల నిర్లక్ష్యమే కారణం’ అంటుండగానే తెగ ఆశ్చర్యంతో మూషికం కలగజేసుకొని ‘మనుషుల నిర్లక్ష్యమా? అయితే అదేంటో సెలవియ్యండి గణేశా! తెలుసుకోవాలనుంది’ అని ఎలుక చెవులను మరింత పెద్దవి చేసి వినాయక పురాణం విన్నంత ఆసక్తిగా వినడం ప్రారంభించింది. వినాయకుడు చెప్పడం మొదలుపెట్టాడు.

వద్దంటే విన్నారా?

‘కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఇంతలా వ్యాప్తి జరిగిందంటే దానికి కారకులు మనుషులేగా. స్వయంకృతాపరాధం లాగా ఈ మహమ్మారిని పెంచి పోషించుకున్నారు. వినాయక చవితి నిమజ్జనం అయ్యాక మనం కైలాసం వెళ్లామంటే ఎక్కడికైనా కదులుతామా. కానీ మానవులు వైరస్‌ వచ్చాక కదలకుండా ఇంట్లో ఉండాలంటే ఉండలేకపోయారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండూ అంటూ నిపుణులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా పనిలేకున్నా వీధుల్లో తిరిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక కొందరు మూతికి ముసుగేసుకోవడం మరిచి, ఎదుటి వారితో పిచ్చాపాటి మాట్లాడడం వల్ల మరికొంత వ్యాప్తి జరిగింది. సామాజిక దూరం పాటించాలని పదే పదే చెప్పినా, మనుషులు దగ్గరదగ్గరగా సంచరించి వ్యాధిని స్వాగతించారు.

పాలకులకు పట్టలేదు

ఈ వైరస్‌ను పెంచిపోషించింది సామాన్య ప్రజలే కాదు, తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు.. పాలకుల పాపమూ ఇందులో ఉంది. కరోనాను కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేదు. సర్కారు దవాఖానాలను సన్నద్ధం చేయడంలో కొంత నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేక వైద్యం కోసం వచ్చిన వారిని వెనక్కి పంపడం వల్ల చాలా మంది ప్రాణాలు వదిలారు. ఇక కొన్ని ఆసుపత్రులు కరోనా కాలాన్ని కాసుల సంపాదించే అవకాశంగా వాడుకుంటున్నా వాటిపై కొరడా ఝళిపించడం లేదు. వైద్యం కోసం వస్తే లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇల్లు గుల్లా చేసి పంపుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిగా ఉండడం మానవ తప్పిదం కాక మరేంటి?’ అంటూ వినాయకుడు కరోనా చరితను కళ్లకు కట్టాడు.

గొలుసు తెగింది..

‘స్వామీ! ఈ మహమ్మారి ఎలా వ్యాపించిందో అర్థమైంది. ఇదంటే మనుషులు వ్యాప్తి చేసుకున్నారు. మరి ప్రకృతి విపత్తు వచ్చి ఊళ్లు, పట్టణాలు మునిగిపోతే అదీ వారి తప్పిదం అంటూ నిందలేల స్వామీ’ అని ఎలుక ఏకరవు పెట్టింది.

● ‘అది కూడా వివరంగా చెబుతా వినుకో మూషికమా! పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది మానవుల నిర్లక్ష్య వైఖరేంటో!’ అంటూ మళ్లీ గణపతి వానలు, వరదలపై తన ప్రసంగం మొదలుపెట్టాడు.. వానలుంటేనే మనుషుల మనుగడ. కానీ ఇప్పుడు చూడు అనేక నగరాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఈ తప్పిదం కచ్చితంగా మానవులదే.నీళ్లుండాల్సిన చెరువుల్లో అక్రమంగా కట్టిన ఇళ్లున్నాయి. వారి వక్రమార్గం వల్ల ఇప్పుడు మళ్లీ ఇళ్లల్లో నీళ్లున్నాయి. నీకు గుర్తుందిగా ఓ రెండు దశాబ్దాల క్రితం మనల్ని నిమజ్జనం చేసే చెరువులు ఎంత శుభ్రంగా ఉండేవో, ఇప్పుడవి ఎలా కలుషితమయ్యాయో చూస్తున్నావుగా. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల గొలుసు తెంచింది ఈ మానవులు కాక మరెవరు? రహదారులను అడ్డదిడ్డంగా నిర్మించి వరద కాలువలు లేకుండా చేశారు. మురుగు నీరు ప్రవహించాల్సిన కాలువలను ఆక్రమించుకొని అంతస్తులు కట్టేశారు. ఇలా సహజంగా కురిసిన వానల నుంచి వచ్చే వరద నీరు ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకున్నది వీళ్లు కాక మరెవరు?’ అంటూ వినాయకుడు ఆవేశంతో ఆక్రమణల పర్వం విడమరచి చెప్పాడు.

‘అవును స్వామీ! నాకిప్పుడు అర్థమైంది ఈ మనుషుల నిర్లక్ష్యమే వారికి కొత్త కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందని. కనీసం వచ్చేసారి నీ పండగ వరకైనా మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నా స్వామీ!’ అంటూ ఎలుక విఘ్నేశ్వరుడికి నమస్కరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.